గోవిందా.. గోవిందా...
ABN, Publish Date - Dec 26 , 2023 | 10:30 PM
ఆదిశిలాక్షేత్రంలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన మహారథోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు.
- నామ స్మరణతో మారుమోగిన ఆదిశిలా క్షేత్రం
- రథోత్సవానికి వేలాదిగా తరలివచ్చిన జనం
- దర్శనం కోసం క్యూలైనులో వేచి వున్న భక్తులు
- తలనీలాలు, దాసంగాల సమర్పణ
మల్దకల్, డిసెంబరు 26 : ఆదిశిలాక్షేత్రంలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నిర్వహించిన మహారథోత్సవానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. స్వామి వారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు, ఎన్ఎన్ఎస్ వలంటీర్లు సేవలు అందిస్తున్నారు. భక్తులు స్వామి వారికి దాసంగాలు సమర్పించారు. తలనీలాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జాతర ప్రాంగ ణంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ రితిరాజ్ ఆదేశం మేరకు పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. గద్వాల, మల్దకల్, అయిజ ప్రధాన రోడ్డు కూడళ్ల వద్ద ట్రాఫిక్కు అంతరాయం కలగ కుండా చర్యలు తీసుకున్నారు.
జనసంద్రం ఆదిశిలా క్షేత్రం
మహా రథోత్సవానికి తరలివచ్చిన భక్తులతో ఆది శిలాక్షేత్రం జనసంద్రంగా మారింది. మంగళవారం అర్ధరాత్రి రథోత్సవానికి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాన్ని తిలకించేందుకు ఉదయం ఎనిమిది గంటల నుంచే వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో అయిజ - గద్వాల రహదారితో పాటు మద్దెలబండ, ఎల్కూరు వైపు నుంచి మల్దకల్కు వచ్చే అన్ని రహదారులు వాహనాలతో కిక్కిరిసి పోయాయి. దీంతో 12 కిలోమీటర్ల దూరం వెళ్లడానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది. అన్ని వైపుల నుంచి వచ్చే వాహనాలను పోలీసులు మల్దకల్ శివారులో ఆపి వాటికి కేటాయించిన స్థలాలకు పంపిస్తూ, ట్రాఫిక్కు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మధ్యాహ్నం సమయానికే క్షేత్రం పరిసర ప్రాంతాలన్నీ భక్త జనంతో నిండిపోయాయి. దేవాలయానికి వెళ్తే మార్గం భక్తులతో కిటకిటలాడింది. రాత్రి 12 గంటల తర్వాత జరిగే రథోత్సవాన్ని తిలకిం చేందుకు అంచనాకు మించి భక్తులు రావడంతో ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
పటిష్ట బందోబస్తు ఏర్పాటు : ఎస్పీ
మహారథోత్సవం సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ రితిరాజ్ తెలిపారు. మంగళవారం ఉదయం మల్దకల్ క్షేత్రానికి వచ్చిన ఆమెకు ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం వేంకటేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేయించారు. స్వామివారి శేషవస్త్రం, జ్ఞాపికను అందించి సత్కరిం చారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 20 మంది ఎస్ఐలతో పాటు 230 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. చైర్మన్తో మాట్లాడి మహా రథోత్సవాన్ని నిర్వహించే సమయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట డీఎస్పీ వెంకటేశ్వర్లు, మల్దకల్ ఎస్ఐ కల్యాణ్ కుమార్ ఉన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 10:58 PM