ఘనంగా దత్తాత్రేయ స్వామి జయంతి
ABN, Publish Date - Dec 26 , 2023 | 10:42 PM
జిల్లా వ్యాప్తంగా మంగళవారం దత్తాత్రేయ స్వామి జయంతిని దత్త భక్తులు ఘనంగా జరుపుకున్నారు.
నారాయణపేట, డిసెంబరు 26 : జిల్లా వ్యాప్తంగా మంగళవారం దత్తాత్రేయ స్వామి జయంతిని దత్త భక్తులు ఘనంగా జరుపుకున్నారు. జిల్లా కేంద్రంలోని సుభాష్ రోడ్ సద్గురు అవధూత నరసింహా స్వామి మఠంలో ఉదయం పాదుక పూజ, రుద్రాభిషేకం, అలంకరణతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మఠం కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువా, పూలమాలతో సత్కరించి, నరసింహా స్వామి చిత్రపటాన్ని అందించారు. వారం రోజులుగా దత్త పారాయణం నిర్వహించిన భక్తులు ముగింపు అనంతరం అవధూత నరసింహా స్వామి, దత్త, గాయత్రి, సరస్వతి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళల ఆధ్వర్యంలో దత్తాత్రేయ స్వామికి డోలారోహణం నిర్వహించి, భక్తి గీతాలు ఆలపించారు. మహా మంగళహారతి అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. అదే విధంగా రెండవ వార్డు బ్రహ్మణ్ వాడి దత్తాత్రేయ స్వామి ఆలయంలో భక్తులు డోలారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి, అన్నదానం చేశారు. మాత మరిగమ్మ ఆలయంలో దత్తాత్రేయ స్వామికి డోలారోహణం, పల్లకీ సేవ, యజ్ఞం నిర్వహించారు. షిర్డి సాయి హనుమాన్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో షిర్డి సాయికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు అన్నదానం చేశారు. నారాయణపేట సరిహద్దులోని మాణిక్యగిరి కొండ కింద కొలువైన దత్తాత్రేయ స్వామి ఆలయంలో గురుచరిత్ర పారాయణం, దత్త యాగం, పాదుకపూజ, ఆలయ ట్రస్ట్ కార్యదర్శి కృష్ణ కోర్వార్ ఆధ్వర్యంలో కొనసాగింది. పౌర్ణమి సందర్భంగా సుభాష్ రోడ్ హనుమాన్ ఆయల కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో పురోహితులు మంజూనాథ్ జోషి, బాబురావు, కౌన్సిలర్ జొన్నల అనిత సుభాష్, భక్తులు పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 10:42 PM