మహాలక్ష్మి పథకం ప్రారంభం
ABN, First Publish Date - 2023-12-10T00:40:09+05:30
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల అమలులో భాగంగా ప్రభుత్వం శనివారం మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రేవంత్రెడ్డి ఆరు గ్యారంటీ పథకాల అమలుపై సంతకం చేశారు. ఆ పథకాలన్నింటినీ వంద రోజుల్లో దశల వారీగా అమల్లోకి తెస్తామని ప్రకటించింది.
- ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
- తొలి రోజే కిటకిటలాడిన బస్సులు, బస్టాండ్లు
- విద్యార్థులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఊరట
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాల అమలులో భాగంగా ప్రభుత్వం శనివారం మహాలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే రేవంత్రెడ్డి ఆరు గ్యారంటీ పథకాల అమలుపై సంతకం చేశారు. ఆ పథకాలన్నింటినీ వంద రోజుల్లో దశల వారీగా అమల్లోకి తెస్తామని ప్రకటించింది. సోనియాగాంధీ పుట్టిన రోజు సందర్భంగా శనివారం మధ్యాహ్నాం 1:30 గంటల నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ఆరంభించారు. అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ. 10 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యాన్ని అందించేందుకు ఆరోగ్యశ్రీ ట్రస్టుకు సీఎం రేవంత్రెడ్డి రూ. 2 కోట్ల చెక్కును అందించి ఆరంభించారు. కర్ణాటక తరహాలో రాష్ట్రంలోనూ పల్లె వెలుగు ఆర్డినరీ, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు. బాలికలు, మహిళలు, వృద్ధులు, ట్రాన్స్జెండర్లకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు అవకాశం కల్పించారు. తెలంగాణ ప్రాంతంలో పుట్టి పెరిగిన వారికే ఈ సౌకర్యం ఉంటుంది. అంతర్రాష్ట్ర బస్సుల్లో ఈ సౌకర్యం ఉండదు. రాష్ట్ర సరిహద్దు స్టేజీల వరకు మాత్రమే ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. తొలి రోజు జిల్లాలోని గోదావరిఖనిలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, రామగుండం పోలీస్ కమిషనర్ రెమారాజేశ్వరీ కలిసి ప్రారంభించారు. మొదటి రోజే గోదావరిఖని, పెద్దపల్లి, మంథని బస్టాండ్లు, బస్సులు మహిళలతో కిటకిటలాడాయి. వివిధ పనుల నిమిత్తం ఉదయం పూట బస్సు చార్జీలు చెల్లించి నిర్ణీత ప్రాంతానికి వెళ్లిన మహిళలు తిరుగు ప్రయాణంలో ఎలాంటి చార్జీ లేకుండా రావడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత ప్రయాణం మధ్యాహ్నాం 1:30 గంటల నుంచి రాష్ట్రమంతటా ప్రారంభం అయ్యింది. ఈ ఉచిత ప్రయాణం గురించి మహిళలు, విద్యార్థినులు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు చర్చించుకుంటూ నెలకు మనకు ఎంత ఆదా అవుతుందని లెక్కలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పథకాన్ని ప్రవేశ పెట్టిందని మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్న, మొన్నటి వరకు అడ్డగోలుగా ఉన్న ఆర్టీసీ చార్జీలను భరించలేకనే వివిధ శుభకార్యాలకు, ఇతర పనులకు వెళ్లలేక పోయామని, ఇప్పుడు మాకు ఆ బెంగ లేదని అంటున్నారు. వేలాది మంది విద్యార్థినులు ఉన్నత విద్యాభ్యాసం కోసం పట్టణాలకు వస్తున్నారు. బస్సు పాసులు తీసుకుని రోజుపోయి వస్తున్నారు. అది కేవలం ఆర్డినరీ బస్సుల్లోనే.. ఇప్పుడు వారికి నెలనెలా ఆర్థిక భారం తప్పడంతో పాటు ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు ఉండడంతో సంతోషంగా ఉన్నారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
- కలెక్టర్ ముజమ్మీల్ఖాన్, సీపీ రెమ రాజేశ్వరి
కళ్యాణ్నగర్, డిసెంబరు 9: ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ముజమ్మీల్ ఖాన్ అన్నారు. గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మహాలక్ష్మి, ఆరోగ్య చేయూత పథకాలను రామగుండం సీపీ రెమ రాజేశ్వరితో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రాజీవ్ ఆరోగ్య శ్రీ గరిష్ట పరిమితి ఐదు లక్షల రూపాయలు ఉండేదని, ప్రభుత్వం దానిని రూ.10లక్షలకు పెంచిందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 1600రకాల రోగాలకు చికిత్స అందించనున్నారని, 1300ఆసుపత్రుల్లో లబ్ధిదారులకు చికిత్స అందించడం జరుగుతుందని, దీని కోసం రూ.10లక్షల నగదు రహిత చికిత్సను అందుబాటులోకి వస్తాయని కలెక్టర్ అన్నారు. మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని, రాష్ట్రంలో ఎక్కడ నుంచైనా మహిళలు, థర్డ్ జండర్లు పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చునని చెప్పారు. అనంతరం మహాలక్ష్మి చేయూత పథకాలకు సంబంధించిన పోస్టర్లను కలెక్టర్, సీపీ ఆవిష్కరించారు. మహాలక్ష్మి పథకం క్రింద ఉచిత బస్సు ప్రయాణాన్ని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.
- బస్సులో ప్రయాణించిన కలెక్టర్, సీపీ
మహాలక్ష్మి పథకంలో భాగంగా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆర్టీసీ బస్సుకు జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, రామగుండం సీపీ రెమ రాజేశ్వరి, రామగుండం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ హిమబిందు మహిళలతో కలిసి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించారు. వారికి కండక్టర్ రూ.0 టికెట్ను అందించారు. పలువురు మహిళలు, ఆసుపత్రి సిబ్బంది ఉచిత ప్రయాణంపై ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రవేశపెట్టిన ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో ప్రమోద్కుమార్, పెద్దపల్లి ఆర్టీఓ రంగారావు, రామగుండం ఆర్టీఏ ఉమా మహేశ్వర్, గోదావరిఖని డిపో మేనేజర్ నాగభూషణం, మెప్మా డీఎంసీ రజిని, వైద్య సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2023-12-10T00:40:15+05:30 IST