అమాత్యుడిపైనే ఆశలు
ABN, Publish Date - Dec 17 , 2023 | 12:30 AM
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జిల్లాకు మంత్రి పదవి దక్కడంతో అభివృద్ధిపై జిల్లా ప్రజలు ఆశలు పెంచుకున్నారు. రాష్ట్రంఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వచ్చింది. కానీ జిల్లాకు చెందిన వారికి ఎవరికి కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో ఇతర ప్రాంతాలతో పోలిస్తే జిల్లా అభివృద్ధిలో వెనుకబడి పోగా, జిల్లాకు రావాల్సిన డీఎంఎఫ్టీ నిధులను పక్క జిల్లాలకు తరలించుకుపోయారు.
- అసంపూర్తిగా చిన్న కాళేశ్వరం
- కాళేశ్వరం బ్యాక్ వాటర్తో పంటలకు ముప్పు
- మానేరుపై పూర్తి కాని ఓడేడు వంతెన
- ఇసుక రవాణాతో దెబ్బతిన్న రోడ్లు
- అభివృద్ధికి నోచుకోని బౌద్ధస్తూపం, దేవాలయాలు
- నేడు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు జిల్లాకు రాక
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జిల్లాకు మంత్రి పదవి దక్కడంతో అభివృద్ధిపై జిల్లా ప్రజలు ఆశలు పెంచుకున్నారు. రాష్ట్రంఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీయే అధికారంలోకి వచ్చింది. కానీ జిల్లాకు చెందిన వారికి ఎవరికి కూడా మంత్రి పదవి దక్కకపోవడంతో ఇతర ప్రాంతాలతో పోలిస్తే జిల్లా అభివృద్ధిలో వెనుకబడి పోగా, జిల్లాకు రావాల్సిన డీఎంఎఫ్టీ నిధులను పక్క జిల్లాలకు తరలించుకుపోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు సాధించి అధికారం చేపట్టింది. అందులో భాగంగా జిల్లాలోని మంథని నుంచి దుద్దిళ్ల శ్రీధర్బాబు, పెద్దపల్లి నుంచి చింతకుంట విజయరమణారావు, రామగుండం నుంచి రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గెలుపొందిన విషయం తెలిసిందే. ఆరుసార్లు పోటీ చేసి ఐదుసార్లు గెలిచిన శ్రీధర్బాబు గతంలో మంత్రిగా, ప్రభుత్వ విప్గా పనిచేసిన అనుభవం ఉండడంతో ఆయనకు మంత్రి పదవి లభించింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రిగా నియమితులయ్యారు. శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించిన ఆయన గెలిచిన నాటి నుంచి బిజీబిజీగా గడుపుతున్న ఆయన జిల్లాలో అడుగు పెట్టలేదు. ఆదివారం ఆయన జిల్లాకు వస్తుండడంతో అడుగడుగునా స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా సరిహద్దు దుబ్బపల్లి వద్ద పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలకనున్నారు. కమాన్పూర్ క్రాస్ రోడ్ వద్ద మంథని నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలకనున్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఆయన గెలుపొందినప్పటికీ ప్రతిపక్షంలోనే ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం, ఆయన మంత్రి కావడంతో జిల్లా అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. పెండింగులో ఉన్న పలు సమస్యలు పరిష్కారం కానున్నాయని ప్రజలు ఆశిస్తున్నారు.
- అర్ధాంతరంగా నిలిచిన చిన్న కాళేశ్వరం..
మంథని నియోజకవర్గంలోని తూర్పు ప్రాంతంలో గల పలు మండలాల్లోని 40 వేల ఎకరాల భూములకు సాగు నీటిని అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు అసంపూర్తిగానే మిగిలి పోయింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదు. బీఆర్ఎస్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో ఆరెంద, మల్లారం, ఖాన్సాయిపేట్, ఖానాపూర్, మంథని, విలోచవరం, పోతారం, సుందిళ్ల, ముస్త్యాల గ్రామాలకు చెందిన పలు పంట భూములు నీట మునుగుతున్నాయి. ప్రతీ సీజన్లో రైతులు నష్ట పోతున్నారు. ఆ భూములను సేకరించేందుకు సర్వే చేసినప్పటికీ, కొన్ని భూములకు పరిహారం చెల్లించినా గడిచిన ప్రభుత్వం మిగతా పరిహారాన్ని చెల్లించలేదు. ఎప్పటి నుంచో రైతులు పరిహారం ఇవ్వాలని ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా కూడా వారి సమస్య పరిష్కారం కాలేదు. 2015లో మానేరుపై ఓడేడు వద్ద చేపట్టిన వంతెన నిర్మాణం అసంతపూర్తిగా నిలిచి పోయింది. ఆ వంతెన పూర్తి కాకపోవడం వల్ల వరంగల్కు కనెక్టివిటీ తగ్గిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోతల పథకం చేపట్టి మంథని ప్రాంతంలోని 30 వేల ఎకరాల భూములకు సాగు నీటిని అందిస్తామని డీపీఆర్లో పేర్కొన్నప్పటికీ, బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు. పెద్దపల్లి నుంచి కాటారం వరకు గల రోడ్డు అసంపూర్తిగా మిగిలి పోగా, ఓవర్లోడ్ ఇసుక రవాణా వల్ల ఓడేడు నుంచి గంగాపురి వరకు గల రోడ్డు, ఖమ్మంపల్లి నుంచి మంథని వరకు రోడ్లు దెబ్బతిన్నాయి. ఓవర్ లోడ్ ఇసుక రవాణాను నిలిపి వేసి రోడ్లకు మరమ్మతులు చేయాలి. గుంజపడుగును మండలంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. ఇలా పలు సమస్యలు పరిష్కారం కావాల్సి ఉన్నాయి.
- కలగానే మారిన పెద్దపల్లి బస్ డిపో..
పెద్దపల్లి బస్ డిపో కలగానే మిగిలి పోయింది. ఎప్పటి నుంచో ఇక్కడ బస్ డిపో ఏర్పాటుకు ప్రతిపాదన ఉన్నప్పటికీ అడుగు ముందుకు పడడం లేదు. బస్ డిపో లేక నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలకు బస్ సౌకర్యం లేకుండా పోయింది. చారిత్రాక బౌద్ధ స్థూపం పర్యాటకంగా అభివృద్ధికి నోచుకోవడం లేదు. జిల్లాలోనే పేరొందిన ఏకైక దేవాలయం ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానం అభివృద్ధికి బాటలు వేయాల్సిన అవసరం ఉంది. పెద్దపల్లి జిల్లా కేంద్రం కావడంతో ప్రధాన రహదారి రద్దీగా మారింది. దీని నివారణకు బైపాస్ రోడ్డు నిర్మించాలని, ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలను పెద్దపల్లికి మంజూరు చేయాలనే డిమాండ్ ఉంది. ధర్మారం క్రాస్ రోడ్డులో గాకుండా జిల్లా కోర్టును పెద్దపల్లిలోనే నిర్మించాలని న్యాయవాదులు, గర్రెపల్లిని మండలంగా ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు. 28 ఏళ్ల క్రితం ఏర్పాటైన ఎలిగేడు మండలంలో ఇప్పటి వరకు పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయకపోగా, పెద్దపల్లి స్టేషన్ ఎస్ఐనే ఎస్హెచ్వోగా కొనసాగిస్తున్నారు. ట్రాఫిక్, మహిళా పోలీస్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. నియోజకవర్గంలోని ఓదెల, కాల్వరాంపూర్ మండలాల్లోని చివరి ఆయకట్టు భూములకు పూర్తి స్థాయిలో సాగు నీటిని అందించేందుకు పత్తిపాక వద్ద రిజర్వాయర్ నిర్మాణ ప్రతిపాదనను ముందుకు తీసుకుపోవాలని రైతులు కోరుతున్నారు. కూనారంలో వరి పరిశోధనా క్షేత్రం ఉండడంతో దీనికి అనుబంధంగా పెద్దపల్లిలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలని, ఇసుక లారీల వల్ల దెబ్బతిన్న పలు రహదారులకు మరమ్మతులు చేయాలని, జూలపల్లి నుంచి పెద్దపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు.
- కరకట్ట లేక బ్యాక్ వాటర్ ముప్పు..
కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ వల్ల రామగుండం, గోదావరిఖని పట్టణ ప్రజలు వరదలు వచ్చినప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. కర కట్టల నిర్మాణంలేక బ్యాక్ వాటర్ పలు కాలనీలను ముంచెత్తుతుండడంతో వర్షాకాలంలో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సీఎల్, సింగరేణి వంటి సంస్థలతో పాటు చిన్నచిన్న పరిశ్రమలు నెలకొని ఉండడంతో పారిశ్రామికంగా రామగుండం మరింత అభివృద్ధి చెందాల్సి ఉంది. ఇండస్ట్రీయల్ పార్కును ఏర్పాటు చేస్తే మరికొంత మందికి ఉపాధి అవకాశాలున్నాయి. బీపీఎల్ విద్యుత్ను పునరుద్ధరించాలని, మైనింగ్ ఇంజి రింగ్ కళాశాలను ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. మున్సిపల్ కార్పొరేషన్కు ప్రత్యేకించి డంపింగ్ యార్డు లేక గోదావరిని ఆనుకుని ఉన్న వైకుంఠధామానికి వెళ్లే దారిలో ఎక్కడ పడితే అక్కడ చెత్తను పడేస్తుండడంతో సమీప కాలనీల ప్రజలు దుర్గంధం భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. బసంత్నగర్ ఎయిర్ పోర్టుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతానికి మరిన్ని పరిశ్రమలు వచ్చే అవకాశాలున్నాయి. జిల్లా మరింత అభివృద్ధికి నోచుకుంటుందని, జిల్లాలో నెలకొన్న పలు సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని మంత్రి శ్రీధర్బాబుపైనే ప్రజలు ఆశలు పెంచుకున్నారు.
Updated Date - Dec 17 , 2023 | 12:30 AM