రాజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
ABN, Publish Date - Dec 26 , 2023 | 12:16 AM
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం భక్తజనంతో జాతరను తలపిస్తోంది. మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తుండడం, వరుస సెలవులు రావడంతో రాజన్న క్షేత్రానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు.
వేములవాడ, డిసెంబరు 25 : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం భక్తజనంతో జాతరను తలపిస్తోంది. మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తుండడం, వరుస సెలవులు రావడంతో రాజన్న క్షేత్రానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు. సోమవారం వేములవాడ దివ్య క్షేత్రం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. దూరప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకొని తరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు. కళాభవన్లో స్వామివారి నిత్య కల్యాణం, సత్యనారాయణ వ్రతం, బాలాత్రిపుర సుందరి దేవి ఆలయంలో కుంకుమ పూజ వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ఆలయ అధికారులు గర్భాలయంలోకి ప్రవేశం నిలిపివేసి లఘు దర్శనం అమలు చేశారు. సర్వదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్ల మీదుగా ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు నందీశ్వరుడి వద్ద నుంచి స్వామివారిని దర్శించుకున్నారు. అనుబంధ ఆలయమైన బద్ది పోచమ్మ ఆలయం భక్తులతో రద్దీగా మారింది. భక్తులు బద్ది పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని బోనం మొక్కు చెల్లించుకున్నారు. మరో అనుబంధ దేవాలయమైన భీమేశ్వర స్వామివారి దేవస్థానం సైతం భక్తులతో కిటకిటలాడింది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. సోమవారం సుమారు 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Updated Date - Dec 26 , 2023 | 12:16 AM