పంటలకు తుఫాను ముప్పు
ABN, First Publish Date - 2023-12-06T00:45:00+05:30
బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫానుతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తుఫాను ప్రభావంతో భారీగా ఈదురుగాలులు వీయడంతోపాటు, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
- కోతకు సిద్దంగా ఉన్న వరి
- ఆందోళనలో అన్నదాతలు
హుజూరాబాద్రూరల్, డిసెంబరు 5: బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫానుతో రైతులు ఆందోళన చెందుతున్నారు. తుఫాను ప్రభావంతో భారీగా ఈదురుగాలులు వీయడంతోపాటు, భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మండలంలో ప్రస్తుతం వరికోతలు ప్రారంభమయ్యాయి. పంట చేతికి వచ్చే సమయం కావడంతో ధాన్యం పాడైపోతుందని, మరికొన్ని ధాన్యం రాశులు రోడ్లపై ఆరబోసి ఉండడంతో తడిసిపోతే మా పరిస్థితి ఏమిటంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం మండల వ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం పడటంతో రైతులు ఇబ్బంది పడ్డారు. పంట విక్రయించే సమయంలో, పంట కోసే సమయంలో ఇలా తుఫాను ప్రభావం చూపటంపై రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు.
రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- వరికోత చేపట్టిన రైతులు ధాన్యాన్ని ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రదేశానికి తరలించి టార్పాలిన్తో కప్పి భద్రపరుచుకోవాలి.
- వరి మళ్లలో నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలి.
- వ్యవసాయ పనులను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి.
- ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో చెట్ల కింద నిలుచోవద్దు.
- సెల్ఫోన్లు, ఇతర ఎలక్ర్టిక్ వస్తువులకు చార్జింగ్ పెట్టటం, వాడడం, విద్యుత్ మోటార్లు ఆన్ చేయటం లాంటి పనులు చేయకూడదు. విద్యుత్ వాహక వస్తువుల నుంచి దూరంగా ఉండాలి.
- నీటి కుంటలు, చెరువులు, విద్యుత్తు స్తంభాలు, తీగల నుంచి దూరంగా ఉండాలి.
- పశువులు, జీవాలను చెట్ల కింద ఉంచకూడదు.
- ట్రాక్టర్లు, ఇతర లోహ వ్యవసాయ పరికరాల నుంచి పశువులను దూరంగా ఉంచాలి.
- పశువులను చెట్లకు, స్తంభాలకు కట్టి వేయకూడదు. నీటి కుంటలు, చెరువుల నుంచి దూరంగా ఉంచాలి.
- పశువులను సురక్షితమైన పాకల్లో లేదా గడ్డితో వేసిన పాకల్లో ఉండేలా జాగ్రత్త వహించాలి.
Updated Date - 2023-12-06T00:45:14+05:30 IST