బీరువా తాళం తీస్తామని అర కిలో బంగారం చోరీ
ABN, Publish Date - Dec 22 , 2023 | 04:17 AM
బీరువా తాళం తీసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు అర కిలో బంగారం ఎత్తుకెళ్లారు. కళ్యాణ్నగర్ ఫేస్-1 ప్రాంతానికి చెందిన పి.సూర్యనారాయణ రాజు(75) శుభకార్యానికి బ్యాంకు లాకర్లో పెట్టిన 448 గ్రాముల బంగారాన్ని తీసుకొచ్చాడు.
యూసు్ఫగూడ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): బీరువా తాళం తీసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు అర కిలో బంగారం ఎత్తుకెళ్లారు. కళ్యాణ్నగర్ ఫేస్-1 ప్రాంతానికి చెందిన పి.సూర్యనారాయణ రాజు(75) శుభకార్యానికి బ్యాంకు లాకర్లో పెట్టిన 448 గ్రాముల బంగారాన్ని తీసుకొచ్చాడు. కార్యక్రమం అనంతరం ఆ బంగారాన్ని పెట్టెలో పెట్టి, ఇంట్లో ఉన్న బీరువాలో భద్రపరిచాడు. దానిని తిరిగి బ్యాంకు లాకర్లో పెడదామని చూడగా బీరువా తాళం కనిపించలేదు. దీంతో డూప్లికేట్ తాళాలు చేసే ఇద్దరు వ్యక్తులు మధురానగర్లో తారసపడగా వారిని ఇంటికి తీసుకొచ్చాడు. వారు ఎంత ప్రయత్నించినా బీరువా తాళం తెరుచుకోకపోవడంతో మరుసటిరోజు వస్తామని చెప్పి వారు వెళ్లిపోయారు. డిసెంబరు 10న ఇంటికి వచ్చిన వారు బీరువా తాళం తీయడానికి ప్రయత్నిస్తూ, తాగాడానికి నీళ్లు కావాలని ఇంట్లో వాళ్ల దృష్టి మళ్లించారు. అనంతరం తాళం జామ్ అయిందని, తెరుచుకోవడం లేదని చెప్పి, రూ.200 తీసుకుని వెళ్లిపోయారు. కొద్ది రోజుల తరువాత ఇంట్లోనే తాళం కనిపించడంతో సూర్యనారాయణ రాజు బీరువా తెరిచేందుకు ప్రయత్నించగా, అది తెరుచుకోలేదు. దీంతో డిసెంబరు 16న యూసు్ఫగూడలో బీరువా తాళం మరమ్మతులు చేసే మరో వ్యక్తిని తీసుకువచ్చాడు. అతను మరమ్మతు చేసి బీరువా తాళం తెరిచాడు. కానీ అందులో బంగారం కనిపించలేదు. దీంతో డూప్లికేట్ తాళం చేసేందుకు వచ్చిన ఆ ఇద్దరు వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేస్తూ సూర్యనారాయణ రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Updated Date - Dec 22 , 2023 | 06:44 AM