Five skeletons : ఆ ఇంట్లో ఐదు అస్తిపంజరాలు...
ABN, Publish Date - Dec 30 , 2023 | 03:45 AM
ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాలుగేళ్ల తర్వాత వెలుగుచూసింది.
అవమానంతో కుటుంబం ఆత్మహత్య?
నాలుగేళ్ల తర్వాత వెలుగులోకి
కర్ణాటకలో ఘోరం
బళ్లారి గాంధీనగర్, డిసెంబరు 29: ఓ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాలుగేళ్ల తర్వాత వెలుగుచూసింది. కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ నగరం చెళ్లకెర గేట్ సమీపంలో ఓ ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం పోలీసులు వచ్చి తాళం పగులగొట్టి చూడగా ఐదుగురి మృతదేహాలు దాదాపు అస్తిపంజరాలుగా మారిన స్థితిలో కనిపించాయి. పెంపుడు కుక్క కళేబరం కూడా అక్కడే ఉంది. పోలీసులు బాగా చిరిగిన సూసైడ్ నోట్తోపాటు కొన్ని ఆధారాలను సేకరించారు. నేమ్ బోర్డు ఆధారంగా ఇంటి యజమాని జగన్నాథ్రెడ్డి అయి ఉండవచ్చని పోలీసులు ఆ కోణంలో వివరాలు సేకరించారు. జగన్నాథ్ రెడ్డి బంధువు పవన్కుమార్ను విచారించగా కొన్నేళ్లుగా తమకు, వారికి రాకపోకలు లేవని సమాచారం ఇచ్చారు. ఇంట్లో గోడకు 2019 క్యాలెండర్ వేలాడదీసి ఉండడంతో ఘటన అదే సంవత్సరంలో జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లో లభించిన ఫొటోల ఆధారంగా రిటైర్డ్ ఇంజనీర్ జగన్నాథ్రెడ్డి(70), ఆయన భార్య ప్రేమావతి (60), కూతురు త్రివేణి (42), కుమారులు కృష్ణారెడ్డి(40), నరేంద్రరెడ్డి (38) మృతిచెందినట్టు పోలీసులు భావిస్తున్నారు. జగన్నాథ్రెడ్డికి ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారని స్థానికులు అంటున్నారు. వీరిలో ఎవరికీ వివాహం కాలేదని సమాచారం. పెద్ద కొడుకు మంజునాథ్రెడ్డి గతంలోనే మృతి చెందాడని స్థానికులు అంటున్నారు.
కొడుకుపై కేసు అవమానంగా భావించి...
జగన్నాథ్ రెడ్డి కుమారుడు నరేంద్ర రెడ్డి ఓ ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేసేవాడు. 2013లో బిడది వద్ద ఓ వాహనాన్ని నిలిపి దోపిడీ చేసినట్లు కేసు నమోదైంది. నరేంద్రరెడ్డి కొన్ని రోజులు జైలు జీవితం గడిపాడు. దీన్ని అవమానంగా భావించి.. కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్లో రాసి ఉందని పోలీసులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న జగన్నాథ్ రెడ్డి సోదరుడి భార్య కొల్లి లక్ష్మి పోలీసులతో మాట్లాడారు. కుమారుడిపై దోపిడీ కేసు జగన్నాథ్ రెడ్డి కుటుంబాన్ని కుంగదీసిందని అన్నారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో ఖాళీ చేసి వెళ్లిపోయి ఉంటారని భావించామని, ఇలా జరిగి ఉంటుందని ఊహించలేదని అన్నారు. అయితే, ఒకేసారి ఐదుగురు మృతి చెందడం అనుమానంగా ఉందని, దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. కాగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Updated Date - Dec 30 , 2023 | 04:13 AM