KTR : ఓటమితో కుంగిపోవద్దు
ABN, Publish Date - Dec 26 , 2023 | 01:45 AM
అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమితో కుంగి పోవద్దని, లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు
లోక్సభ ఎన్నికలకు సిద్ధం కండి
బీఆర్ఎస్ నేతలకు కేటీఆర్ పిలుపు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులే..
ఆ నియోజకవర్గాలకు ఇన్చార్జులు
కర్ణాటక మంత్రి వ్యాఖ్యలు హాస్యాస్పదం
రైతులు కరువును కోరుకోరు: కేటీఆర్
హైదరాబాద్, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమితో కుంగి పోవద్దని, లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఈ మేరకు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. జనవరి 26లోగా సమావేశాలు పూర్తి చేయాలని సూచించారు. సోమవారం తెలంగాణ భవన్లో చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ నేతలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికల బరిలో నిలిచే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని, గెలిచిన ఎమ్మెల్యేలతోపాటు ఓటమి చెందినవారు సైతం నియోజకవర్గాల్లో ప్రజలకు, పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం చెందిన అభ్యర్థులే ఆయా నియోజకవర్గాల ఇన్చార్జులని స్పష్టం చేశారు. వారు ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలన్నారు. కాగా, రైతులు ఏటా కరువు రావాలని కోరుకుంటున్నారంటూ కర్ణాటక మంత్రి శివానంద్ పాటిల్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ ఖండించారు. బెళగావిలో జరిగిన ఓ సమావేశంలో శివానంద్ పాటిల్ మాట్లాడుతూ.. రైతాంగం ఏటా కరువు రావాలని కోరుకుంటున్నారని, దీనివల్ల ప్రభుత్వం నుంచి రుణమాఫీ పొందవచ్చని భావిస్తున్నార ంటూ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఎక్స్ వేదికగా కేటీఆర్ స్పందించారు. రైతుల పట్ల కర్ణాటక మంత్రి చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఎటువంటి దుర్భర పరిస్థితుల్లోనూ అన్నదాతలు కరువును కోరుకోరని ఆయన పేర్కొన్నారు.
చేవెళ్ల నుంచి మళ్లీ పోటీ : రంజిత్రెడ్డి
చేవెళ్ల లోక్సభ స్థానం నుంచి తాను మరోసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని ఎంపీ రంజిత్రెడ్డి తెలిపారు. తనను అక్కడినుంచి మళ్లీ పోటీ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పినట్లు మీడియాకు వెల్లడించారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందంటూ కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు తామంతా కృషి చేస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు.
Updated Date - Dec 26 , 2023 | 01:45 AM