పంచాయతీ రిజర్వేషన్లపై అయోమయం!
ABN, Publish Date - Dec 17 , 2023 | 11:04 PM
గ్రామపంచాయతీల ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. దీంతో ఎక్కడచూసినా గ్రామాల్లో దీనిపైనే చర్చలు జరుగుతున్నాయి.
ఎన్నికల ఏర్పాట్లులో అధికారుల నిమగ్నం
పోటీదారుల్లో ఉత్కంఠ!
మేడ్చల్ డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గ్రామపంచాయతీల ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. దీంతో ఎక్కడచూసినా గ్రామాల్లో దీనిపైనే చర్చలు జరుగుతున్నాయి. అయితే ప్రంచాయతీ ఎన్నికల్లో ప్రధానంగా రిజర్వేషన్లపై అయోమయం నెలకొంది. గతంలో పంచాయతీలకు ఐదేళ్లకు ఒకసారి రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలు నిర్వహించేవారు. గత ప్రభుత్వం చట్టసవరణ తీసుకొచ్చి పంచాయతీల రిజర్వేషన్లు పదేళ్లు చేసింది. నిబంధనల ప్రకారం గత ఎన్నికల్లో పంచాయతీలకు కేటాయించిన రిజర్వేషన్లు ఈ ఎన్నికల్లోనూ ఉండాలి. అయితే ప్రభుత్వం మారడంతో రిజర్వేషన్లు ఉంచుతారా.. లేదా మార్పులు చేసి తిరిగి కొత్తగా కేటాయిస్తారా.. అనే దానిపై జోరుగా చర్చలు జరుగుతున్నాయి. పంచాయతీల పాలకవర్గాల గడువు జనవరి నెలతో ముగుస్తుంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు వివరాలు సేకరిస్తున్నా... ఇప్పటి వరకు రిజర్వేషన్ల అంశం తేల్చకపోవడం, లోకసభ ఎన్నికలు కూడా వస్తుండటంతో వీటిపై సందిగ్ధత నెలకొంది.
ఏమీ తేలకపోయినా....
ఎన్నికల సంఘం ఇప్పటికే ఏర్పాట్లకు సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికలను నిర్వహించేందుకు అవసరమైన సిబ్బంది వివరాలను టీపోల్ పోర్టల్లో నమోదు చేస్తున్నారు. 2019లో రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు కూడా అదే విధంగా జరిగే అవకాశం ఉంది. అందుకు అవసరమైన బ్యాలెట్ పెట్టెలు ఎన్ని అవసరపడుతాయి.. ఎన్ని ఉన్నాయి... ఇంకా ఎన్ని అవసరమనే సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. ఇదిలా ఉండగా, అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో ఉంటే.. సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్ధులు ఇప్పటి నుండే ఆయా పార్టీల మండల, జిల్లా నేతలను సంప్రదిస్తున్నారు. పార్టీ గుర్తుతో ఎన్నికలు లేకపోయినా... మద్దతు కోసం నేతల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
Updated Date - Dec 17 , 2023 | 11:04 PM