మంత్రి పదవి దక్కేదెవరికో...?
ABN, First Publish Date - 2023-12-10T22:15:37+05:30
జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. తొలివిడుత కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రెండో విడుత మంత్రివర్గ కూర్పుపై జోరుగా చర్చ జరుగుతోంది.
మంచిర్యాల, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ముగ్గురు ఎమ్మెల్యేలు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. తొలివిడుత కొందరు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. రెండో విడుత మంత్రివర్గ కూర్పుపై జోరుగా చర్చ జరుగుతోంది. మంచిర్యాల జిల్లా నుంచి మంత్రి పదవి ఎవరికి దక్కుతుందోనన్న చర్చ ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల నుంచి కొక్కిరాల ప్రేంసాగర్రావు, గడ్డం వివేక్, గడ్డం వినోద్లు ఎమ్మెల్యేలుగా భారీ మెజార్టీతో గెలుపొందారు.
ముగ్గురూ సీనియర్లే
జిల్లాలోని మూడు నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ముగ్గురు నేతలు సీనియర్లు కావడంతో కేబినెట్లో అవకాశం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయింది. ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ కేడర్ అలాగే ఉంది. పదేళ్ళుగా కొక్కిరాల ప్రేంసాగర్రావు పార్టీ కేడర్ను కాపాడుతూ వచ్చారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి బాధ్యతలు స్వీకరించిన అనంతరం కాంగ్రెస్కు ఊపు రాగా, మొదటిసారిగా ఆయన ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభను విజయవంతం చేయడంలో ప్రేంసాగర్రావు కీలకపాత్ర పోషించారు. ప్రేంసాగర్రావు 2007-13 వరకు ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీగా పదవిని అలంకరించారు. ఆయనకే ఈసారి మంత్రి పదవి దక్కుతుందని కాంగ్రెస్ వర్గాలు గట్టిగా విశ్వసిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దివంగత కాకా వెంకటస్వామి తనయులైన గడ్డం వినోద్, గడ్డం వివేక్కు కూడా ఘనమైన చరిత్ర ఉంది. గడ్డం వినోద్ 2004లో చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికకాగా 2009 వరకు ఐదేళ్లపాటు కార్మికశాఖ మంత్రిగా పని చేశారు. గత ఎన్నికల్లో బెల్లంపల్లి నుంచి బీఎస్పీ టికెట్పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గడ్డం వివేక్ 2009-14 వరకు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా సేవలందించారు. తిరిగి 2014లో పెద్దపల్లి పార్లమెంటు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మొదటి సారిగా ఎమ్మెల్యే బరిలో నిలిచిన ఆయన ఇటీవల జరిగిన ఎన్నికల్లో చెన్నూరు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గడ్డం సోదరులు కూడా బలమైన నేతలు కావడంతో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందోనని మూడు నియోజక వర్గాల ప్రజలు ఆసక్తితో ఉన్నారు.
ఢిల్లీ లెవల్లో పైరవీలు...
ఎమ్మెల్యేలు ముగ్గురికి ఢిల్లీ స్థాయిలో పరిచయాలు ఉండటంతో మంత్రి పదవి కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ముగ్గురు నేతలు ఎవరికి వారే ఇటీవల ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో ములాఖత్ అయ్యారు. ఉమ్మడి జిల్లాలో పార్టీకి పూర్వవైభవం తీసుకొచ్చిన తనకే మంత్రి పదవి దక్కుతుందని ప్రేంసాగర్రావు విశ్వసిస్తుండగా, తన తండ్రి కాకా వెంకటస్వామి పార్టీకి చేసిన సేవలకు గాను ఢిల్లీ పెద్దలు తమవైపే మొగ్గు చూపుతారనే భావనలో గడ్డం సోదరులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి మంత్రి వర్గంలో చోటు లభిస్తుందోననే ఉత్కంఠ నెలకొంది. మూడు నియోజకవర్గాల్లో భారీ మెజార్టీతో గెలవడం, ముగ్గురు నేతలు ఒకే జిల్లాకు ప్రాతినిథ్యం వహిస్తుండటంతో మంత్రి పదవి ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ అటు పార్టీ శ్రేణుల్లో, ఇటు ప్రజల్లోనూ నెలకొంది.
Updated Date - 2023-12-10T22:15:39+05:30 IST