Voters: అబ్బో.. బాగానే పెరిగారుగా.. రాష్ట్రంలో మొత్తం ఓటర్లు ఎంతమంది తెలుసా..
ABN, First Publish Date - 2023-06-01T11:23:20+05:30
రాష్ట్రంలో 18 ఏళ్లు పూర్తయిన వారు ఓటరు జాబితాలో పేరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి
పెరంబూర్(చెన్నై): రాష్ట్రంలో 18 ఏళ్లు పూర్తయిన వారు ఓటరు జాబితాలో పేరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు(Satyapradasahu) తెలిపారు. ఈ మేరకు ఈసీ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో... కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) సూచనల మేరకు, జనవరి 1 మాత్రమే కాకుండా ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబరు 1వ తేదీల్లో 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఈక్రమంలో 2023 ఓటరు జాబితాను బుధవారం విడుదల చేశామన్నారు. ఈ జాబితాలో 1,23,064 కొత్తగా చేరారన్నారు. తాజా ఓటరు జాబితా ప్రకారం, రాష్ట్రంలో 3,01,18,904 మంది పురుషులు, 3,11,09,813 మంది మహిళలు, 7,979 మంది హిజ్రాలు అని మొత్తం 6,12,36,696 మంది ఓటర్లున్నారన్నారు. ఇక, రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గంగా షోళింగనల్లూర్ ఉందని, ఈ నియోజకవర్గంలో 3,26,253 మంది పురుషులు, 3,24,713 మంది మహిళలు, 111 మంది హిజ్రాలు అని మొత్తం 6,51,077 మంది ఓటర్లున్నారని తెలిపారు. ఏప్రిల్ 1వ తేదీతో 18 ఏళ్లు పూర్తయిన వారు https://elections.tn.gov.in/ అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల కమిషన్ తెలియజేసింది.
Updated Date - 2023-06-01T11:23:20+05:30 IST