Horse riding: గుర్రంపై రోజూ కాలేజీకి !
ABN, First Publish Date - 2023-07-21T11:59:12+05:30
మదురై(Madurai) అవనియాపురానికి చెందిన ఓ యువకుడు రోజూ గుర్రపుస్వారీ చేస్తూ లా కాలేజీకి వెళ్లి చదువుకోవడం చూసి స్థానికులు వి
చెన్నై, (ఆంధ్రజ్యోతి): మదురై(Madurai) అవనియాపురానికి చెందిన ఓ యువకుడు రోజూ గుర్రపుస్వారీ చేస్తూ లా కాలేజీకి వెళ్లి చదువుకోవడం చూసి స్థానికులు విస్మయం చెందుతున్నారు. అవనియాపురం కావేరి నగర్ ప్రాంతానికి చెందిన బాలమురుగన్, మణిమేగల దంపతుల కుమారుడు షణ్ముగసుందర్ (24) ఎంఏ ఉత్తీర్ణుడై ప్రస్తుతం శివగంగలోని ప్రైవేటు కళాశాలలో ఎల్ఎల్బీలో చేరాడు. అంతే కాకుండా తానుంటున్న ప్రాంతం నుంచి కళాశాలకు రోజూ గుర్రంపై వెళ్ళి వస్తున్నాడు. ఈ విషయమై షణ్ముగసుందర్ మాట్లాడుతూ చిన్నప్పటి నుండి తనకు పెంపుడు జంతువులంటే ఇష్టమని, మొదట తల్లిదండ్రులు కాస్త విసుక్కున్నా, ప్రస్తుతం తాను పెంచుతున్న పెంపుడు జంతువులను చూసి ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. కుక్కలు, మేకలు, పశువులు పెంచిన తనకు గుర్రాన్ని పెంచాలనే కోరిక పుట్టిందన్నారు. దీనితో పలు ప్రాంతాల్లో పనిచేసి సంపాదించిన రూ.75వేలతో ఓ గుర్రాన్ని కొన్నానని తెలిపారు. గుర్రాలు మానవులతో సఖ్యంగా పెరిగేందుకు ఇష్టపడే సామాజిక జంతువులన్నారు. గుర్రపు సవారీ(Horse riding) చేస్తూ మానసిక ఒత్తిడి మాయమవుతుందని, ధైర్యం అధికమవుతుందని షణ్ముగనాధర్ వివరించారు. వెటర్నరీ డాక్టర్ల ద్వారా గుర్రాన్ని పెంచే పద్ధతులు, వాటికి అందించే చికిత్స గురించి తెలుసుకున్నానని, దీంతో వీధుల్లో తిరిగే గుర్రాలను ఇంటికి తీసుకువచ్చి వాటికి చికిత్సలందించి సంరక్షిస్తున్నానని తెలిపారు. రవాణాకు గుర్రాన్ని ఉపయోగిస్తే పర్యావరణ పరిస్థితులు మెరుగవుతాయన్నారు. ఇక గుర్రాన్ని పెంచడం ఆషామాషీ విషయం కాదని, వాటికి రోజుకు రూ.400ల విలువ చేసే వివిధ రకాల దాణాలను ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. రోజూ పది కిలోమీటర్ల వరకూ గుర్రపు సవారీ చేస్తానని, ప్రస్తుతం ఎలాంటి మానసిక ఒత్తిళ్లు లేకుండా న్యాయశాస్త్రాన్ని అభ్యసిస్తున్నాని షణ్ముగసుందర్ తెలిపారు.
Updated Date - 2023-07-21T11:59:22+05:30 IST