Antibiotics: యాంటీ ‘భయో’ టిక్స్...
ABN, First Publish Date - 2023-10-06T11:11:39+05:30
ప్రస్తుతం డెంగీ, మలేరియా, టైఫాయిడ్, జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో మందుల వినియోగం పెరిగింది. కాస్త
- అతిగా వాడితే ప్రమాదమే
- పెరుగుతున్న ఏఎంఆర్ ప్రభావం
- సన్నగిల్లుతోన్న రోగ నిరోధకశక్తి
దగ్గు వచ్చినా.. తుమ్ము వచ్చినా.. కాస్త నలతగా ఉన్నా వెంటనే ఓ యాంటీబయాటిక్ గోలీని చటుక్కున నోట్లో వేసుకోవడం.. గుటుక్కున మింగేయడం ప్రతి ఒక్కరికీ సర్వసాధారణమైంది. యాంటీబయోటిక్స్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని, యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్(ఏఎంఆర్) ప్రాబల్యం చాలా పెరుగుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ సిటీ, (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం డెంగీ, మలేరియా, టైఫాయిడ్, జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో మందుల వినియోగం పెరిగింది. కాస్త నలతగా ఉండగానే కొంతమంది వైద్యుల సూచన లేకుండానే యాంటీబయోటిక్స్ వాడేస్తున్నారు. దీనివల్ల జబ్బు తగ్గకపోగా ప్రమాదకరంగా మారుతోంది.
ఎక్కువ రోజులు వాడితే..
యాంటీబయోటిక్స్ ఎంత వరకు అవసరమో.. అంత వరకే వినియోగించాలి. ఈ మందులను ఎక్కువ రోజులు వాడితే రోగ నిరోధక శక్తి తగ్గుతుందని, తద్వారా జబ్బులను నియంత్రించలేని పరిస్థితికి దారి తీస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఎక్కువ మోతాదులో వాడకం వల్ల బ్యాక్టీరియా శక్తివంతమవుతుందని వైద్యులు పేర్కొంటున్నారు.
అవయవాలపై ప్రభావం
మూత్రపిండాలు, కాలేయం, మధుమేహం, గుండె జబ్బులు ఉన్న వారు యాంటీబయోటిక్స్ అధికంగా వాడడం వల్ల మరిన్ని సమస్యలు తలెత్తుతున్నాయి. ఎక్కువ మోతాదులో వాడిన వారు ఆస్పత్రుల పాలవుతున్నారు. న్యుమోనియా, టైఫాయిడ్ జబ్బులకు చికిత్స అందించడం కష్టంగా మారుతోంది.
పూర్తి కోర్సు వాడకపోయినా..
కొంతమంది పూర్తి కోర్సు వాడడం లేదు. డాక్టర్లు నాలుగైదు రోజులపాటు కోర్సు మందులను రాస్తున్నారు. అది రోజు వారీగా ఎంత మోతాదులో వేసుకోవాలో ప్రిస్ర్కిప్షన్పై రాస్తున్నారు. అయితే చాలామంది వైద్యులు సూచించిన ప్రకారం మందులు వేసుకోవడం లేదు. రోజుకు మూడుసార్లు, నాలుగైదు రోజులు రాస్తే, రెండుసార్లు, మూడు రోజులు వేసుకుంటున్నారు. దీనివల్ల శరీరంలో రోగ నిరోధకశక్తి తయారు కావడం లేదంటున్నారు వైద్యులు.
లొంగని ఇన్ఫెక్షన్లు..
యాంటీబయోటిక్స్కు కొన్నిసార్లు ఇన్ఫెక్షన్లు లొంగడం లేదు. రెట్టించిన శక్తితో దాడి చేస్తుండడం వల్ల వ్యాధులు తగ్గడం లేదు. కొన్నిసార్లు శస్త్రచికిత్స సమయంలో దుష్ఫలితాలు ఇస్తున్నాయని వైద్యులు చెప్పారు.
వైద్యుడితో చర్చించాకే..
బ్యాక్టీరియా, వైర్సలు, శిలీంధ్రాలు, పరాన్నజీవులు కాలక్రమేణా రూపు మార్చుకున్నప్పుడు, రోగి మందులకు ప్రతి స్పందించడంలో విఫలమైనప్పుడు యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ ఏర్పడుతుంది. దీంతో ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం కష్టం. చివరికి మరణానికీ కారణమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి పదివేల మంది ఏఎంఆర్తో యుద్ధంలో ఓడిపోతుంటే 2050 నాటికి మరో రెండు మిలియన్ల మంది దీనివల్ల చనిపోతారని అంచనా. వైద్యుడితో చర్చించిన తర్వాతే మందులు తీసుకోవడం మంచిది.
- డాక్టర్ సుబ్బారెడ్డి, ఇంటెన్సివ్ కేర్ వైద్యుడు
Updated Date - 2023-10-06T11:11:39+05:30 IST