సాహిత్యానికి పట్టాభిషేకం...
ABN, First Publish Date - 2023-11-06T05:13:55+05:30
బాగా చిన్నప్పుడు కథలు వినడం, కాస్త పెద్దయ్యాక కథలు చదవడం... చాలామంది పిల్లల్లాగే నా జీవితం కూడా ఇలాగే మొదలయింది.
‘‘భాష, సాహిత్యం ఎల్లప్పుడూ జీవనదుల్లా సాగిపోతూ ఉండాలి. రాబోయే తరాలకు వాటిని ఏ రూపంలోనైనా అందజేయాల్సిన బాధ్యత మనదే’’ అంటారు డాక్టర్ ఉమారాణి.
తమిళనాడులోని అరణికి చెందిన ఈ 52 ఏళ్ళ టీచర్... తమిళ మహాకవి తిరువళ్ళువార్ రచించిన ‘తిరుక్కురల్’ పంక్తులను అనేక వస్తువులపై రాసి... వాటి గొప్పతనాన్ని చాటిచెబుతున్నారు.
‘‘బాగా చిన్నప్పుడు కథలు వినడం, కాస్త పెద్దయ్యాక కథలు చదవడం... చాలామంది పిల్లల్లాగే నా జీవితం కూడా ఇలాగే మొదలయింది. హైస్కూల్లో చేరాక సాహిత్యం మీద, ప్రత్యేకించి నా మాతృభాష అయిన తమిళం మీద ప్రత్యేకమైన ఆసక్తి కలిగింది. ఉపాధ్యాయురాలు కావాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. మాది తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా అరణి పట్టణం. చదువు పూర్తయ్యాక... తమిళ టీచర్గా ఉద్యోగంలో చేరినప్పుడు... నా ఆనందానికి అవధులు లేవు. అప్పుడప్పుడే ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళ ఆధిపత్యం పెరుగుతోంది. పిల్లలకు మాతృభాషమీద మమకారం కలిగించాల్సిన బాధ్యత.... ఆ భాషను బోధించే టీచర్లదే కదా! అందుకే ఆ బాధ్యతను గర్వంగా భావించాను. పాతికేళ్ళ పాటు పిల్లలకు పాఠాలు చెప్పడం, నా భర్త, ఇద్దరు కూతుర్ల బాధ్యతలు... మరోవైపు సాహిత్య పఠనం, కవితలు రాయడం... జీవితం ఇలా సాగిపోయింది. అయితే... కాలం గడిచేకొద్దీ పిల్లలు భాషకూ, సాహిత్యానికీ క్రమంగా దూరమవుతున్నారనే ఆవేదన నన్ను వెంటాడేది. మూడేళ్ళ క్రితం... కరోనా విజృంభణతో ప్రభుత్వాలు లాక్డౌన్ విధించడంతో... పుస్తకాలు చదవడానికి ఎంతో తీరిక దొరికింది. అప్పుడే నాకొక ఆలోచన కలిగింది.
కాదేదీ...
తమిళ మహాకవి తిరువళ్ళువార్ రాసిన ‘తిరుక్కురల్’ నాకు నిత్య పారాయణ గ్రంథం లాంటిది. ఇది తమిళులకు ఆరాధ్య గ్రంథం. ‘కురల్’ అంటే ద్విపద శ్లోకం లాంటిది. తిరుక్కురల్... అలాంటి 1330 కురల్ల సంకలనం. మానవ జీవనానికి మార్గదర్శకాలైన ఎన్నో సూక్తులు వాటిలో ఉన్నాయి. వాటికి పిల్లల్లో ప్రాచుర్యం కల్పించాలంటే... ఏదో ఆకర్షణ ఉండాలి. అందుకే వివిధ వస్తువుల మీద కురల్స్ రాయాలనుకున్నాను. బియ్యపు గింజల మీద రాయడం మొదలుపెట్టాను. నాణేలు, చేతి గాజులు, సోయా బీన్ గింజలు, గంటలు, గొడుగులు, చిన్నపూసలు, జాతీయ పతాకం... ఇలా ‘కాదేదీ రాతకు అనర్హం’ అన్న రీతిలో ఇది కొనసాగింది. మొత్తం కురల్స్ అన్నిటినీ కూడా రకరకాల వస్తువుల మీద రాశాను. దీన్ని మా అమ్మాయిలు ఎంతగానో ప్రోత్సహించారు. వాళ్ళూ రాయడం ప్రారంభించారు. బడులు తెరిచాక... మా విద్యార్థుల కోసం వాటిని ప్రదర్శించినప్పుడు... బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. దాదాపు ఇరవై మంది అమ్మాయిలు.... నేను రాసిన వాటిని నమూనాలుగా తీసుకున్నారు. మునక్కాడలు, పసుపు కొమ్ములు, ల్యాబరేటరీలోని టెస్ట్ ట్యూబ్ల లాంటివి కూడా వాళ్ళు ఎంచుకొంటున్నారు. మిగిలిన విద్యార్థులు కూడా కురల్స్ నేర్చుకొని, వాటి భావాలు అర్థం చేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. తద్వారా వారికి భాషపట్ల ఆసక్తి పెరగడం నాకు ఆనందంగా అనిపిస్తోంది.
70కి పైగా అవార్డులు..
ఈ ఏడాది మార్చిలో పుదుచ్చేరిలో జరిగిన ‘వరల్డ్ తిరుక్కురల్ అఛీవర్స్ సదస్సు’లో అనేకమంది రచయితలు, పండితులు పాల్గొన్నారు. ఆ సదస్సు బయట నేను ఏర్పాటు చేసిన ప్రదర్శన అభినందనలు అందుకుంది. ‘ఆలిండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో నా పేరు చోటుచేసుకోవడంతో పాటు... ఇప్పటివరకూ డెబ్భైకి పైగా అవార్డులు లభించాయి. నా గురించి తెలుసుకున్న తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ తమిళిసై సౌదరరాజన్ ప్రత్యేకంగా ఆహ్వానించి, అభినందించడం మరచిపోలేని జ్ఞాపకం. నా కృషిని మరింత దీక్షగా కొనసాగించాలనే ప్రేరణను అది నాకు కలిగించింది. తిరుక్కురల్ను జాతీయ గ్రంథంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలనే డిమాండ్ను ప్రతిచోటా గట్టిగా వినిపిస్తున్నాను. అది నెరవేరాలనేదే నా ఆకాంక్ష.’’
Updated Date - 2023-11-06T05:13:56+05:30 IST