'Vande Bharat' train: ‘వందే భారత్’ రైళ్లకు పెరిగిన ఆదరణ
ABN, First Publish Date - 2023-02-16T11:08:54+05:30
చెన్నై సెంట్రల్-మైసూరు మధ్య నడుపుతున్న ‘వందే భారత్’ రైలు('Vande Bharat' train)కు ప్రయాణికుల ఆదరణ పెరుగుతుండడంతో మరికొన్ని
- మరిన్ని మార్గాల్లో నడపాలని దక్షిణ రైల్వే నిర్ణయం
పెరంబూర్(చెన్నై), ఫిబ్రవరి 15: చెన్నై సెంట్రల్-మైసూరు మధ్య నడుపుతున్న ‘వందే భారత్’ రైలు('Vande Bharat' train)కు ప్రయాణికుల ఆదరణ పెరుగుతుండడంతో మరికొన్ని మార్గాల్లో ఈ రైళ్లు నడిపేలా దక్షిణ రైల్వే చర్యలు చేపట్టింది. స్థానిక పెరంబూర్ ఐసిఎఫ్లో తయారైన 5వ వందే భారత్ రైలు దక్షిణ రాష్ట్రాల్లో తొలిసారిగా చెన్నై సెంట్రల్-కర్ణాటక రాష్ట్రం మైసూరు మధ్య గత ఏడాది నవంబరులో ప్రారంభించారు. బుధవారం మినహా అన్ని రోజుల్లో ఈ రైలు ఉదయం 5.50 గంటలకు చెన్నై సెంట్రల్లో బయల్దేరి బెంగుళూరు మీదుగా మధ్యాహ్నం 12.20 గంటలకు మైసూరు చేరుకుంటుంది. మరుమార్గంలో మధ్యాహ్నం 1.05 గంటలకు బయల్దేరి రాత్రి 7.30 గంటలకు చెన్నై సెంట్రల్(Chennai Central) చేరుకుంటుండగా, ఈ రైళ్లు కాట్పాడి, బెంగుళూరు రైల్వేస్టేషన్లలో మాత్రమే ఆగుతాయి. అత్యాధునిక వసతులు, అధునాతన భద్రతా సాంకేతిక పరిజ్ఞానంతో 16 బోగీలు కలిగిన ఈ రైలులో 1,128 మంది ప్రయాణించవచ్చు. చెన్నై సెంట్రల్-మైసూర్కు ‘ఏసీ చైర్ కార్’ ఛార్జీ రూ.1,200, ‘ఏసీ’ ప్రత్యేక బోగీ ఛార్జి రూ.1,980గా వసూలుచేస్తున్నారు.
130 కి.మీ వేగం...
ప్రస్తుతం ఈ రైలు 110 కి.మీ వేగంతో నడుస్తుండగా, త్వరలో 130 కి.మీ పెంచనున్నారు. ప్రారంభ రోజుల్లో టిక్కెట్ల రిజర్వేషన్ 90 శాతం ఉండగా, ప్రస్తుతం 130 శాతానికి పెరిగింది. చెన్నై సెంట్రల్ నుంచి మైసూరు వెళ్లేందుకు 6.30 గంటలు పడుతుండగా, ఇతర రైళ్లలో 9.25 గంటలుండడంతో, వందే భారత్ రైల్లో వెళ్లడానికి ప్రయాణికులు ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది నవంబరులో 60 వేల మంది, డిసెంబరులో 1.01 లక్షలు, జనవరిలో 1.12 లక్షలు, ఈ నెల 12వ తేది వరకు 40 వేల మంది మొత్తం 3 లక్షల మంది వందే భారత్ రైలులో ప్రయాణించారు. ఈ రైలుకు ఆదరణ పెరగడంతో, చెన్నై సెంట్రల్-కోవై నడుమ వందే భారత్ రైలు నడిపేందుకు రైల్వే బోర్డుకు దక్షిణ రైల్వే అధికారులు లేఖ రాశారు. కాగా, 180 కి.మీ వేగంతో వెళ్లే సామర్ధ్యం కలిగిన ఈ రైలు విడతల వారీగా పూర్తి వేగంతో వెళ్లేలా చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు.
Updated Date - 2023-02-16T11:08:56+05:30 IST