Tribal CM Vishnudev Sai elected for Chhattisgarh : ఛత్తీస్గఢ్కు గిరిజన సీఎం విష్ణుదేవ్ సాయ్ ఎన్నిక
ABN, First Publish Date - 2023-12-11T03:21:32+05:30
ఛత్తీస్గఢ్ సీఎంగా బీజేపీ సీనియర్ గిరిజన నేత విష్ణుదేవ్ సాయ్ (59) నియమితులయ్యారు.
బీజేపీ ఎల్పీ భేటీలో ప్రకటన.. స్పీకర్గా రమణ్సింగ్
ప్రభుత్వ ఏర్పాటుకు సాయ్ను ఆహ్వానించిన గవర్నర్
రేపో ఎల్లుండో ప్రమాణ స్వీకారం?
రాయ్పూర్ ఎంపీగా వరుసగా 4 సార్లు ఎన్నికైన సాయ్
మోదీ తొలి సర్కారులో కేంద్ర మంత్రిగా విధులు
మోదీ-షా ఎంపికపై కమలనాథుల విస్మయం
రాయ్పూర్-న్యూఢిల్లీ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ఛత్తీస్గఢ్ సీఎంగా బీజేపీ సీనియర్ గిరిజన నేత విష్ణుదేవ్ సాయ్ (59) నియమితులయ్యారు. ఆదివారమిక్కడ జరిగిన పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన్ను నేతగా ఎన్నుకున్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి.. తాజా ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపిన మాజీ సీఎం రమణ్సింగ్ను కాదని.. ప్రధాని మోదీ-కేంద్ర హోం మంత్రి అమిత్షా తీసుకున్న ఈ నిర్ణయం కమలనాథులనే విస్మయపరచింది. అయితే రమణ్సింగ్కు అసెంబ్లీ స్పీకర్ పదవిని కట్టబెట్టడం గమనార్హం. సామాజిక సమతుల్యంలో భాగంగా ఇద్దరు ఉపముఖ్యమంత్రులను కూడా నియమించింది. ఓబీసీ నేత, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ సావో, సీనియర్ నేత విజయ్ శర్మలకు ఆ పదవులు ఇచ్చింది. ఈ నెల 3వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాయి. 90 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీ 54 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ వారం రోజుల్లో కేంద్ర మంత్రి రేణుకాసింగ్, ఎంపీ గోమతీసాయి సహా అనేక పేర్లు ప్రచారంలోకి వచ్చినా.. చివరకు అనూహ్యంగా సాయ్ను సీఎం పదవి వరించింది.
పార్టీ పరిశీలకులైన కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, శర్బానంద్ సొనోవాల్, జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్కుమార్ గౌతమ్ ఆధ్వర్యంలో ఆదివారం శాసనసభాపక్ష భేటీ జరిగింది. కేంద్ర నాయకత్వం సాయ్ను సారథిగా ఖరారుచేసినట్లు ముండా ప్రకటించగానే పార్టీ ఎమ్మెల్యేలంతా ఆయన్ను తమ నేతగా ఎన్నుకున్నారు. అనంతరం సావో సారథ్యంలోని బీజేపీ బృందం సాయంత్రం గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసింది. సాయ్ను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్న విషయాన్ని లేఖ రూపంలో నివేదించింది. దీంతో సాయ్ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. ఆయన్ను సీఎంగా నియమిస్తూ నియామక పత్రాన్ని కూడా అందజేశారు. తనను ముఖ్యమంత్రిగా నియమించినందుకు ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. అధికారం చేపట్టగానే పేదలకు 18 లక్షల ఇళ్లు మంజూరు చేస్తానని, మోదీ ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తానన్నారు.
రాజకీయ కుటుంబం నుంచి..
విష్ణుదేవ్ సాయి గిరిజనుల్లో అత్యంత పలుకుబడిగల సాహు (తేలీ) వర్గానికి చెందినవారు. బిలా్సపూర్, దుర్గ్, రాయ్పూర్ ప్రాంతాల్లో ఈ వర్గం వారు అత్యధికంగా ఉంటారు. ఆయన రాజకీయ కుటుంబం నుంచే వచ్చారు. తాత బుద్ధనాథ్ సాయి 1947-52 నడుమ నామినేటెడ్ ఎమ్మెల్యేగా పనిచేశారు. సాయి పెదనాన్న నరహరి ప్రసాద్ సాయి బీజేపీ పూర్వరూపమైన జన్సంఘ్ నేత. 1962-67, 72-77ల్లో రెండు సార్లు ఎమ్మెల్యేగా, 1977-79 మధ్య ఎంపీగా, జనతా పార్టీ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగానూ ఉన్నారు. విష్ణుదేవ్ జశ్పూర్ జిల్లా కుంకురిలో ప్రభుత్వ పాఠశాలలో చదివారు. డిగ్రీ మధ్యలోనే చదువు మానేశారు. బీజేపీ దివంగత సీనియర్ నేత దిలీ్పసింగ్ జుదేవ్ ప్రోద్బలంతో రాజకీయాల్లోకి వచ్చారు. 1990లో సర్పంచ్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదే ఏడాది అవిభక్త మధ్యప్రదేశ్లోని తప్కరా నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 1999 లోక్సభ ఎన్నికల్లో రాయ్పూర్ నుంచి గెలిచారు. వరుసగా 2004, 2009, 2014ల్లో కూడా ఎన్నికయ్యారు. 2014లో మోదీ మొదటి ప్రభుత్వంలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. సుసంపన్న రాజకీయ వారసత్వం ఉన్నప్పటికీ పార్టీకి సాయ్ ఎప్పుడూ పార్టీకి విధేయుడే. అంకితభావం కలిగిన నేత. లక్ష్య సాధనలో ముందుంటారు. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగానూ దీర్ఘకాలం పనిచేశారు.
Updated Date - 2023-12-11T03:21:45+05:30 IST