50 శాతానికి పైగా ఓట్లే లక్ష్యం
ABN, Publish Date - Dec 24 , 2023 | 04:15 AM
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ నాయకులకు ప్రధాని మోదీ సూచించారు.
బీజేపీ నేతలకు ప్రధాని మోదీ సూచన
న్యూఢిల్లీ, డిసెంబరు 23: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని బీజేపీ నాయకులకు ప్రధాని మోదీ సూచించారు. ఢిల్లీలో జరిగిన పార్టీ జాతీయ పదాధికారుల అంతర్గత సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2024 ఎన్నికల్లో పార్టీ ఓట్ల శాతాన్ని గత ఎన్నికల్లో కంటే 10ు పెంచేందుకు కృషి చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 2019లో 303 సీట్లు గెలిచామని, ఇప్పటినుంచి మిషన్ మోడ్లో పనిచేస్తే ఈసారి మరిన్ని సీట్లు గెలుచుకుంటామని చెప్పారు. సోషల్ మీడియాలో దూకుడుగా అభిప్రాయాలు వ్యక్తం చేయాలని పార్టీ అధిష్ఠానానికి సూచించారు. ప్రతిపక్షాలు చేస్తున్న ప్రతికూల ప్రచారాన్ని తిప్పికొట్టేలా ప్రజలకు వాస్తవాలను వివరిస్తూ, సానుకూల సమాధానాలు ఇవ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, అవగాహన కల్పించేందుకు చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ద్వారా పెద్దసంఖ్యలో మహిళలు, యువత, రైతులు, పేదలను చేరుకోవాలని ప్రధాని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. ఓట్ల పెంపుతో పాటు రామాలయం మీద కూడా దృష్టిని కేంద్రీకరించాలని బీజేపీ నిర్ణయించింది. కాగా, బీజేపీ దెబ్బకు ప్రతిపక్షాలు దిగ్ర్భాంతి చెందాలని అమిత్ షా అన్నారు.
Updated Date - Dec 24 , 2023 | 06:37 AM