ULFA : ఉల్ఫాతో శాంతి ఒప్పందం
ABN, Publish Date - Dec 30 , 2023 | 03:57 AM
నాలుగు దశాబ్దాలకు పైగా వేర్పాటువాదంతో అట్టుడుకుతున్న అసోంలో శాంతిస్థాపన దిశగా కీలక అడుగుపడింది.
త్రైపాక్షిక ఒప్పందంపై 16 మంది ఉల్ఫా ప్రతినిధులు, పౌర సమాజానికి చెందిన 13 మంది సంతకాలు
అసోంలో శాంతి దిశగా కొత్త ఆరంభం: అమిత్ షా
న్యూఢిల్లీ, డిసెంబరు 29: నాలుగు దశాబ్దాలకు పైగా వేర్పాటువాదంతో అట్టుడుకుతున్న అసోంలో శాంతిస్థాపన దిశగా కీలక అడుగుపడింది. స్వతంత్ర, సార్వభౌమ అసోం కోసం పోరాడుతున్న సాయుధ వేర్పాటువాద సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోం (ఉల్ఫా)లోని చర్చల అనుకూల వర్గం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో శుక్రవారం శాంతి ఒప్పం దం కుదుర్చుకుంది. హింసను విడనాడి, ఉల్ఫాను రద్దుచేసి ప్రజాస్వామిక ప్రక్రియలో కలిసి ముందుకు సాగేందుకు అంగీకరిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ సమక్షంలో ఈ త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం చేసింది. ఉల్ఫాలోని చర్చల అనుకూలవర్గానికి చెందిన 16మంది తమ చీఫ్ అరబింద రాజ్ఖోవా నేతృత్వంలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. పౌరసమాజానికి చెందిన 13 మంది ఈ ఒడంబడికపై సంతకం చేశారు. ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా అసోంలోశాంతి నెలకొనడానికి ఇది కొత్త ఆరంభమని అమిత్షా పేర్కొన్నారు. భార త ప్రభుత్వంపై ఉల్ఫా ప్రతినిధులు పెట్టుకున్న విశ్వాసాన్ని వమ్ముకానీయబోమని హామీ ఇచ్చారు.
ఈమేరకు కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి, దాని ద్వారా శాంతి ఒప్పందంలోని ప్రతి అంశా న్నీ నిర్ణీత కాలావధిలో నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఈ ఒప్పందంలోని అంశాలను నెరవేర్చేందుకు ఆ కమిటీ అసోం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుందని స్పష్టంచేశారు. అసోంకు భారీ అభివృద్ధి ప్యాకేజీని ఇస్తామని ప్రకటించారు. ఒప్పందం ప్రకారం హింస ను విడనాడి, తమ సంస్థను ఎత్తివేయడానికి, ప్రజాస్వామ్యప్రక్రియలో పాలుపంచుకోవడానికి ఉల్ఫా ఒప్పుకొందని అమిత్షా వెల్లడించారు. ‘‘అసోంలో 1979నుంచి హింసవల్ల 10వేల మందికి పైగా ప్రాణా లు కోల్పోయారు. మోదీ ప్రధాని అయ్యాక ఢిల్లీకి, ఈశాన్యానికి నడుమ విభేదాల తొలగింపునకు ప్రయత్నాలు జరిగాయి. ఫలితంగా ఈశాన్యంతో గత ఐదేళ్లలో 9శాంతి ఒప్పందాలు కుదిరాయి. 9000 మంది లొంగిపోయారు. దీంతో ఈశాన్య రాష్ట్రాల్లో శాంతి నెలకొంది’’ అని షా అన్నారు. ఇక హిమంత బిశ్వశర్మ దీన్ని చరిత్రాత్మక ఒప్పందంగా అభివర్ణించారు.
ఇదీ నేపథ్యం..
పరేశ్ బారువా, అరబింద రాజ్ఖోవా, అనూప్ చెటియా, భూపేన్ బోర్గోహెయిన్, ప్రదీప్ గొగోయ్, భద్రేశ్వర్ గొహెయిన్ తదితర 20 మంది యువకులు 1979 ఏప్రిల్7న ఉల్ఫాను స్థాపించారు. సాయుధ పోరాటాన్ని మార్గంగా ఎంచుకున్నారు. 1992లో ఉల్ఫాలోని ద్వితీయ శ్రేణి నాయకులు పెద్దఎత్తున ప్రభుత్వానికి లొంగిపోయారు. 2011లో ఉల్ఫా రెండు ముక్కలుగా చీలిపోయింది. వాటిలో ఒక వర్గం కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు అనుకూలం(ఉల్ఫా-పీటీఎఫ్) కాగా.. మరొకటి వ్యతిరేకం(ఉల్ఫా-ఏటీఎఫ్). చర్చల అనుకూ ల వర్గానికి నేతృత్వం వహించిన చైర్మన్ అరబింద రాజ్ఖోవాను ఉల్ఫా కమాండర్ ఇన్ చీఫ్ పరేష్ బారువా నుంచి బహిష్కరించారు. ఉల్ఫా-ఏటీఎఫ్కి ఆయనే నేతృత్వం వహిస్తున్నారు. శుక్రవారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకుంది.. రాజ్ఖోవా నేతృత్వంలోని చర్చల అనుకూల వర్గంతోనే.
Updated Date - Dec 30 , 2023 | 03:57 AM