మావోయిస్టు దంపతుల అరెస్టు
ABN, First Publish Date - 2023-12-03T03:22:21+05:30
పట్టణ ప్రాంతాల్లో విస్తరించాలన్న మావోయిస్టుల వ్యూహానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సెంట్రల్ టెక్నికల్ టీమ్ సభ్యుడు
వివరాలు వెల్లడించిన సీపీ రెమా రాజేశ్వరి
కోల్సిటీ, డిసెంబరు 2: పట్టణ ప్రాంతాల్లో విస్తరించాలన్న మావోయిస్టుల వ్యూహానికి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సెంట్రల్ టెక్నికల్ టీమ్ సభ్యుడు వేంగోదాదా (80), అతని భార్య భవానీ (60)లను శనివారం మంచిర్యాల జిల్లా ఇందారం వద్ద అరెస్టు చేశారు. రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి శనివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఏపీలోని కోనసీమ జిల్లా డెల్టా గన్నవరం మండలం నరేంద్రపురానికి చెందిన గంగాధర్రావు అలియాస్ వేంగోదాదా, అదే ప్రాంతానికి చెందిన ఆయన భార్య భవానీ అలియాస్ సుజాతలు 1980లో అజ్ఞాతంలోకి వెళ్లారని తెలిపారు. 2000లో పార్టీ కేంద్ర కమిటీ వేంగోదాదాకు సాంకేతిక విభాగం బాధ్యతలు అప్పగించిందని, ఆయుధాలు, పేలుడు పదార్థాల తయారీలో వేంగోదాదా నిష్ణాతుడని తెలిపారు. అర్బన్ ఏరియాలో పార్టీ విస్తరణలో భాగంగా వీరిని కేంద్ర కమిటీ నియమించినట్టు తెలుస్తోందన్నారు. వృద్ధాప్యంలో కొడుకులు పట్టించుకోవడం లేదని, చిన్న ఇల్లు కట్టుకుని ఇక్కడే ఉంటామంటూ మారుపేర్లతో భూమి కొని ఇందారంలో తాత్కాలిక ఇంట్లో ఉంటున్నట్లు అందిన విశ్వసనీయ వర్గాల సమాచారంతో శనివారం దాడి చేసి అరెస్టు చేశామని, వారి వద్ద నుంచి రూ.15.76 లక్షల నగదు, మొబైల్ ఫోన్లు, పెన్డ్రైవ్లు, ట్యాబ్లు, విప్లవ సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామని కమిషనర్ తెలిపారు.
Updated Date - 2023-12-05T07:49:31+05:30 IST