Ajit Doval: గాంధీ స్థానంలో ఆయన ఉండుంటే..? అజిత్ దోవల్ సంచలన వ్యాఖ్యలు..!
ABN, First Publish Date - 2023-06-17T21:17:01+05:30
భారతదేశం స్వాతంత్ర్యం సిద్ధించుకున్న తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ అక్కడ ఉండి ఉంటే దేశ విభజన జరిగేది కాదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ అన్నారు. గాంధీ స్థానంలో బోస్ ఉంటుంటే బ్రిటిష్ వాళ్లను స్వాతంత్ర్యం కోసం అడుక్కునేందుకు అంగీకరించేవారు కాదని అన్నారు.
న్యూఢిల్లీ: భారతదేశం స్వాతంత్ర్యం సిద్ధించుకున్న తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Netaji Subhas Chandra Bose) అక్కడ ఉండి ఉంటే దేశ విభజన జరిగేది కాదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోవల్ (Ajit Doval) అన్నారు. గాంధీ స్థానంలో బోస్ ఉంటుంటే బ్రిటిష్ వాళ్లను స్వాతంత్ర్యం కోసం అడుక్కునేందుకు అంగీకరించేవారు కాదని అన్నారు. గాంధీతో విభేదించే ధైర్యసాహసాలు నేతాజీకి ఉన్నప్పటికీ గాంధీని బోసు గౌరవించేవారని చెప్పారు. పాక్ జాతిపితగా చెప్పుకునే మొహమ్మద్ అలీ జిన్నా సైతం తాను ఒకే నాయకుడిని అంగీకరిస్తానని, ఆయనే సుభాష్ చంద్రబోస్ అని చెప్పినట్టు డోవల్ తెలిపారు. అసోచామ్ (ASSOCHAM) ఆధ్వర్యంలో శనివారంనాడిక్కడ జరిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్మారకోపన్యాసంలో డోవల్ మాట్లాడుతూ, దేశ ప్రజల సామర్థ్యంపై బోస్కు అపారమైన విశ్వాసం ఉండేదని చెప్పారు.
చరిత్ర ఆయన (బోస్)ను అంతగా పట్టించుకున్నట్టు కనబడనప్పటికీ చరిత్రను పునరుద్ధరించేందుకు మోదీ జరుపుతున్న ప్రయత్నాలు ఆయనకు సంతోషం కలిగించేవేనని అన్నారు. 1962లో చైనాతో యుద్ధంలో భారత్ ఓడిపోవడానికి కారణం యుద్ధానికి దేశం సన్నద్ధంగా లేకపోవడమేనని డోవల్ అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్యోద్యమానికి బోస్ చేసిన సేవలను ఆయన గుర్తుచేసుకుంటూ, గాంధీని ఛాలెంజ్ చేసే ధైర్యసాహసాలు బోస్కు ఉన్నప్పటికీ గాంధీజీ పట్ల ఉన్న గౌరవం కారణంగా ఆయనకు మార్గం సుగమం చేశారని, ఆ తర్వాత జైలుకు వెళ్లాలని, నిర్బంధంలో ఉన్న ఇండియా నుంచి తప్పించువెళ్లాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. ఆప్ఘన్ దుస్తుల్లో కాబూల్ వెళ్లారని, అటు పిమ్మట రష్యా, తర్వాత జర్మనీ వెళ్లి హిట్లర్ (అడాల్ఫ్)ను కలుసుకున్నారని చెప్పారు. హిట్లర్ జైలులో ఉంచిన 4000 మంది భారతీయులకు విముక్తి కలిగించారని, ఆ తర్వాత ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించారని చెప్పారు.
బోస్ మతభావాలుమ కలిగిన వ్యక్తి అని, ఎప్పుడూ తన వెంట భగవద్గీతను ఉంచుకునేవారని చెప్పారు. చూడడానికి సెక్యులర్గా కనిపించినా అంతరంగంలో పవిత్రమైన, ఆధ్యాత్మిక భావాలు ఉండేవని అన్నారు. పటిష్ట ఆర్థిక భారతావనిని ఆయన కాంక్షించేవారని చెప్పారు. దేశ ప్రజల సామర్థ్యంపై నేతాజీకి అపారమైన నమ్మకం ఉండేదని, ఇవాళ మనదేశ ప్రాధాన్యతా క్రమం కూడా పౌరులకు సాధికారత కల్పించడం, అంతర్జాతీయంగా కూడా వారిని సమర్ధవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉందని అజిత్ డోవల్ చెప్పారు.
Updated Date - 2023-06-17T21:17:01+05:30 IST