Chennai: మా పార్టీలో వారసత్వ రాజకీయాల్లేవు
ABN, First Publish Date - 2023-06-02T07:31:23+05:30
మా పార్టీలో వారసత్వ రాజకీయాల్లేవని, దశాబ్దాల తరబడి పార్టీకి సేవలందించిన తన కుమారుడు దురై వైగోను ప్రజాస్వామ్య పద్ధతిలోనే పార్టీ కార్యనిర్వా
చెన్నై, (ఆంధ్రజ్యోతి): మా పార్టీలో వారసత్వ రాజకీయాల్లేవని, దశాబ్దాల తరబడి పార్టీకి సేవలందించిన తన కుమారుడు దురై వైగోను ప్రజాస్వామ్య పద్ధతిలోనే పార్టీ కార్యనిర్వాహక సభ్యులంతా కలిసి ఎన్నుకున్నారని ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో స్పష్టం చేశారు. గురువారం ఉదయం ఎగ్మూరు(Egmoor)లోని పార్టీ కార్యాలయం తాయగంలో నూతన కార్యవర్గ ఎన్నికల ఏర్పాట్లు జరిగాయి. ఆ సందర్భంగా వైగోతోపాటు, పార్టీ సీనియర్ నాయకులు వివిధ పదవులకు నామినేషన్లు వేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి వైగో, ప్రిసీడియం చైర్మెన్ పదవికి అర్జున్ సంపత్, కోశాధికారి పదవికి సెంథిలదిబన్, ముఖ్య కార్యదర్శి పదవికి వైగో కుమారుడు దురై వైగో, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి పదవికి సత్య నామినేషన్లు వేశారు. పార్టీలోని వివిధ పదవులకు ఒకరి కంటే అధికంగా నామినేషన్లు దాఖలు చేస్తే బ్యాలెట్ విధానంలో ఈ నెల 14న ఎన్నికలు జరుగుతాయని పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. నామినేషన్ల ప్రక్రియ అనంతరం వైగో మీడియాతో మాట్లాడుతూ ఇటీవల పార్టీ ప్రిసీడియం చైర్మెన్ పదవికి రాజీనామా చేసిన తిరుప్పూరు దురైసామి పార్టీలో వారసత్వ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారంటూ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా తాము పార్టీ శ్రేణుల అభిఫ్రాయాల ప్రకారమే పార్టీని సమర్థవంతంగా నడుపుతున్నామని, డీఎంకేతో పొత్తు కొనసాగిస్తూ ఎండీఎంకే(MDMK) సిద్ధాంతాలకు కట్టుబడి ఆ పార్టీకి మిత్రపక్షంగానే కొనసాగుతుందన్నారు. పార్టీలో తాను వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించే ప్రసక్తే లేదని అన్నారు. భవిష్యత్లో పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని, బలహీనవర్గాల సంక్షేమమే తమ పార్టీ ఆశయమని వైగో పేర్కొన్నారు.
వైగో ఎంపిక ఏకగ్రీవం...
పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి వైగో మాత్రమే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. ఈ మేరకు ఈ నెల మూడున అధికారికంగా ప్రకటించనున్నారు. ఇదే విధంగా వైగో కుమారుడు దురై వైగో కూడా ముఖ్య కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికకానున్నారు. నామినేషన్ల రక్రిరయ అనంతరం వివిధ పదవులకు పోటీ చేస్తున్న అభ్యర్థులంతా కలిసి వైగోతో గ్రూప్ ఫొటో తీసుకున్నారు.
Updated Date - 2023-06-02T07:31:23+05:30 IST