ప్రమోషనల్ సందేశాలకు చెక్!
ABN, First Publish Date - 2023-11-10T05:14:54+05:30
మన మొబైల్ ఫోన్లకు చాలాసార్లు సాధారణ కాల్స్, సందేశాల కంటే ప్రమోషనల్ కాల్స్, మెసేజ్లే ఎక్కువగా వస్తుంటాయి.
కస్టమర్ల అనుమతి తీసుకోవాల్సిందే
టెల్కోలకు ట్రాయ్ మార్గదర్శకాలు
న్యూఢిల్లీ, నవంబరు 9: మన మొబైల్ ఫోన్లకు చాలాసార్లు సాధారణ కాల్స్, సందేశాల కంటే ప్రమోషనల్ కాల్స్, మెసేజ్లే ఎక్కువగా వస్తుంటాయి. ఈ పరిస్థితిని అడ్డుకునేందుకు ట్రాయ్ టెలికం సంస్థలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రమోషనల్, స్పామ్ ఎస్సెమ్మె్సలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ తరహా సందేశాలు పంపే ముందు ఇకపై వినియోగదారుల అనుమతి తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. ప్రమోషనల్ సందేశాలను అరికట్టడానికి ‘డిజిటల్ కన్సెంట్ అక్విజిషన్ (డీసీఏ)’ పేరిట ట్రాయ్ ఓ కార్యక్రమాన్ని చేపట్టింది. డీసీఏ ప్రకారం రుణాలు, పథకాలు అంటూ బ్యాంకులు, రియల్ ఎస్టేట్ సంస్థలు వ్యాపార సంబంధిత సందేశాలు పంపించాలంటే ముందుగా వినియోగదారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
డీసీఏ నిబంధన కింద.. ఏదైనా ఏజెన్సీ వినియోగదారుడికి సమాచారం పంపాలంటే ముందుగా టెలికం ఆపరేటర్ నుంచి అనుమతి పొందాలి. తర్వాత ఆ ఆపరేటర్ 127తో మొదలయ్యే షార్ట్ కోడ్తో కూడిన ఓ ఎస్సెమ్మెస్ పంపుతుంది. దేనికోసం అనుమతి కోరుతున్నారన్నది అందులో ఉంటుంది. ఆ సందేశానికి వినియోగదారుడు అనుమతి ఇవ్వొచ్చు లేదా నిరాకరించవచ్చు. యూజర్ అనుమతివ్వకపోతే టెలికం కంపెనీ సదరు ఏజెన్సీని ఆ వినియోగదారుడికి ఇకపై సందేశాలు పంపకుండా ఆపాల్సి ఉంటుంది. అలాగే ప్రమోషనల్ సందేశాలకు ఇచ్చిన అనుమతులను ఎప్పుడైనా ఉపసంహరించుకునేందుకు వీలుగా ఓ ఆన్లైన్ పోర్టల్ను సిద్ధం చేయాలని టెలికం కంపెనీలకు ట్రాయ్ సూచించింది. తక్షణమే ఈ నిబంధనలు అమల్లోకి వస్తాయని స్పష్టంచేసింది. అలాగే స్పామ్ కాల్స్, ఎస్సెమ్మె్సలను గుర్తించేందుకు ట్రాయ్ ‘ట్రాయ్ డీఎన్డీ 3.0’ పేరిట యాప్ను రూపొందించింది. ఇది గూగుల్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంది.
Updated Date - 2023-11-10T05:14:55+05:30 IST