Bangalore-Mysore Expressway: 1 నుంచి బెంగళూరు-మైసూరు ఎక్స్ప్రెస్వేపై ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు బంద్
ABN, First Publish Date - 2023-07-26T12:16:27+05:30
బెంగళూరు మైసూరు ఎక్స్ప్రెస్ వే(Bangalore Mysore Expressway)పై గత కొద్దికాలంగా ప్రమాదాలు అధికమవుతున్నాయనే విమర్శల నేపథ్యంలో జాతీ
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బెంగళూరు మైసూరు ఎక్స్ప్రెస్ వే(Bangalore Mysore Expressway)పై గత కొద్దికాలంగా ప్రమాదాలు అధికమవుతున్నాయనే విమర్శల నేపథ్యంలో జాతీయ రహదారి ప్రాధికార (ఎన్హెచ్ఏఐ) కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుంచి ఈ మార్గంలో ద్విచక్ర, త్రిచక్రవాహనాలకు అనుమతి ఉండదు. ప్రధానంగా బైక్లు, ఆటో రిక్షాలు, ట్రాక్టర్లు, స్లో మూవింగ్ వ్యవసాయ యంత్రాలు (టిల్లర్) వంటివాటిని ఈ మార్గంలో అనుమతించరు. 119 కిలో మీటర్లను 90 నిమిషాల్లో చేరుకునే ఈ మార్గంలో వేగ నియంత్రణకు చర్యలు చేపట్టనున్నట్టు తెలుస్తోంది. ఈ మార్గంలో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో వెళ్లేందుకు అనుమతి ఇచ్చారు. గత యేడాది అక్టోబరు నుంచి ఇప్పటివరకు 600కుపైగా ప్రమాదాలు చోటు చేసుకోగా వందమందికి పైగా మృతి చెందగా, పదుల సంఖ్య తీవ్రగాయాలపాలయ్యారు. దీనిపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ప్రాధికార స్పందించింది. ప్రాధికార నిపుణుల సమితి, ఉన్నతస్థాయి అధికారులతో కలసి ఎక్స్ప్రెస్ వేను పరిశీలించింది. ఎక్కువగా ద్విచక్ర, త్రిచక్రవాహనదారులే ప్రమాదానికి గురైనట్టు గుర్తించి ఈ మార్గంలో బైక్లు, స్కూటర్లు, ఇతర ద్విచక్రవాహనాలు, ట్రాలీ రహిత, సహితతో కూడిన ట్రాక్టర్లను అనుమతించరాదని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర భూ ఉపరితల రవాణా మంత్రిత్వశాఖకు నివేదిక పంపారు.
దీంతో గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ట్రాఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ ఏడీజీపీ అలోక్కుమార్, కొంతమంది ఎన్హెచ్ఏఐ అధికారులతో కలసి మంగళవారం ఎక్స్ప్రె్సవేను స్వయంగా పరిశీలించారు. వేగ నియంత్రణకు సంబంధించిన ప్రదేశాలను గుర్తించారు. కొన్ని చోట్ల 60కిలో మీటర్ల తక్కువ వేగంతో వెళ్తున్నా ప్రమాదాలు చోటు చేసుకున్నాయని గుర్తించినట్టు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ అధికారి వివేక్, మండ్య ఎస్పీ ఎన్ యతీశ్ తదితరులు ఉన్నారు.
Updated Date - 2023-07-26T12:16:27+05:30 IST