Azan prayer in School: పాఠశాల అసెంబ్లీ ప్రేయర్లో అజాన్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
ABN, First Publish Date - 2023-06-16T18:30:37+05:30
పాఠశాల ప్రభాత ప్రార్థనల సమయంలో రెగ్యులర్ ప్రార్థనకు బదులు మైకులో "అజాన్'' ప్లే చేయడం తీవ్ర వివాదమైంది. ముంబైలోని కాండివిలి (వెస్ట్)లో ఉన్న కపోల్ అంతర్జాతీయ పాఠశాలలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చేటుచేసుకుంది. దీనిపై తల్లిదండ్రులు, బీజేపీ నేతలు ఆందోళనలకు దిగడంతో కేసు నమోదైంది.
ముంబై: పాఠశాల ప్రభాత ప్రార్థనల సమయంలో రెగ్యులర్ ప్రార్థనకు బదులు మైకులో "అజాన్'' (Azan) ప్లే చేయడం తీవ్ర వివాదమైంది. ముంబై (Mumbai) లోని కాండివిలి (వెస్ట్)లో ఉన్న కపోల్ అంతర్జాతీయ పాఠశాలలో శుక్రవారం ఉదయం ఈ ఘటన చేటుచేసుకుంది. మసీదుల నుంచి వినిపించే 'అజాన్'ను పాఠశాల ప్రార్ధనా సమయంలో వినిపించడంపై ఇటు పిల్లల తల్లిదండ్రులతో పాటు అటు బీజేపీ నేతలు భగ్గుమనడంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.
పాఠశాల మార్నింగ్ ప్రేయర్గా అజాన్ ప్లే చేసినట్టు కాండవలి నుంచి ఒక ఫిర్యాదు అందినట్టు డీఎస్పీ అజయ్ కుమార్ బన్సాల్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు చెప్పారు. అన్ని కోణాల నుంచి సమస్యను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కాగా, పాఠశాల బయట నిరసనలు పెల్లుబికినట్టు ముంబై బీజేపీ ముంబై విభాగం ఒక ట్వీట్లో తెలియజేసింది. బీజేపీ స్థానిక ఎమ్మెల్యే యోగేష్ సాగర్ వెంటనే అక్కడకు చేరుకుని నిరసనలకు దిగిన తల్లిదండ్రులతో కలిసి పాఠశాల యాజమాన్యంపై నిప్పులు చెరిగారు. ఆందోళన కారణంగా అన్ని క్లాసులు రద్దు చేసినట్టు పాఠశాల ప్రకటించింది. ఈ ఘటనకు కారణమైన టీచర్పై చర్య తీసుకునేంత వరకూ తాము వెనక్కి తగ్గేది లేదని తల్లిదండ్రులు పట్టుపట్టారు. కాగా, పరిస్థితి తీవ్రరూపం దాల్చే ప్రమాదం గ్రహించడంతో ఇందుకు బాధ్యుడైన టీచర్ను సస్పెండ్ చేస్తున్నట్టు పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రేష్మా హెగ్డే ప్రకటించారు. "టీచర్ను సస్పెండ్ చేశాం. దర్యాప్తు జరుగుతోంది. ఇది హిందూ పాఠశాల. మా పాఠశాలతో గాయత్రీ మంత్రం, సరస్వతి ప్రార్థన జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం' అని ఆందోళనకు దిగిన విద్యార్థుల తల్లిదండ్రులను రేష్మా హెగ్డే శాంతపరచారు.
అజాన్ వివాదం..
మహారాష్ట్రలో స్పీకర్ల నుంచి అజాన్ వినిపించడం మహారాష్ట్రలో ఇప్పటికే రాజకీయ అంశంగా ఉంది. రాష్ట్రంలో ఎక్కడూ కూడా లౌడ్స్పీకర్ల ద్వారా అజాన్ వినిపించరాదంటూ మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్థాకరే గత ఏడాది ఆందోళన చేపట్టారు. లౌడ్ స్పీకర్లు తొలగించకుంటే తమ పార్టీ కార్యకర్తలు ప్రతీ మసీదు బయట హనుమాన్ చాలీసా పఠిస్తారని హెచ్చరించారు.
Updated Date - 2023-06-16T18:35:09+05:30 IST