Almaty: నిండిన ఆల్మట్టి జలాశయం
ABN, First Publish Date - 2023-08-08T10:58:33+05:30
కృష్ణానదికి అనుబంధంగా విజయపుర జిల్లా నిడగుంది తాలూకా పరిధిలోని లాల్బహదూర్శాస్త్రి (ఆల్మట్టి) జలాశయం
- 6 ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): కృష్ణానదికి అనుబంధంగా విజయపుర జిల్లా నిడగుంది తాలూకా పరిధిలోని లాల్బహదూర్శాస్త్రి (ఆల్మట్టి) జలాశయం దాదాపు నిండింది. సోమవారం రాత్రికి లేదా మంగళవారం ఉదయానికి భర్తీ కానున్నటు కృష్ణా జలమండలి అధికారులు ప్రకటించారు. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 519.60 అడుగులు కాగా ఆదివారం సాయంత్రానికి 519.52 అడుగులకు చే రింది. ఇన్ఫ్లో 66,750 క్యూసెక్కులుగా ఉంది. మహారాష్ట్ర పశ్చిమ(Western Maharashtra) భాగంలో ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు ప్రాజెక్టుకు భారీగా వరద చేరింది. ఆల్మట్టికి వరద పోటెత్తుతుండటంతో జూలై 21 నుంచి ఆరు విద్యుత్ ఉత్పత్తి విభాగాలకు అనువుగా రోజు 42వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూలై 21 నుంచి ఆగస్టు 7 వరకూ 80 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగింది. విద్యుత్ను పవర్ గ్రిడ్ ద్వారా అవసరమైన ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఆల్మట్టి నిండిన మేరకు నదికి నీరు భారీగా వదులుతున్నందున కిందిభాగాన ఉండే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్(Telangana, Andhra Pradesh) రాష్ట్రాల ప్రాజెక్టులకు జలకళ సాధ్యం కానుందనే సంతోషం వ్యక్తమవుతోంది. కర్ణాటక పరిధిలో ప్రాజెక్టులు నిండిన వెంటనే ముఖ్యమంత్రి(Chief Minister) వాయనం సమర్పించే సం ప్రదాయం ఉంది. కానీ శ్రావణ మాసం ఆరంభమయ్యాక 18 తర్వాత సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
Updated Date - 2023-08-08T10:58:33+05:30 IST