Silicon Valley Bank crisis: సిలికాన్ వ్యాలీ బ్యాంకు పతనానికి కారణమేంటి?
ABN, First Publish Date - 2023-03-11T20:33:46+05:30
చిన్నచిన్న పొరపాట్ల వల్ల పేకమేడలా ఎలా కూలిపోతుందో చెప్పడానికి అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్(SVB) ఉదంతమే నిదర్శనం. ఆర్థిక క్రమ శిక్షణ లేమి..
ఒక్కో ఇటుక పేర్చి కూర్చిన ఇల్లు.. చిన్నచిన్న పొరపాట్ల వల్ల పేకమేడలా ఎలా కూలిపోతుందో చెప్పడానికి అమెరికాలోని సిలికాన్ వ్యాలీ బ్యాంక్(SVB) ఉదంతమే నిదర్శనం. ఆర్థిక క్రమ శిక్షణ లేమి.. పెట్టుబడుల్లో దీర్ఘదృష్టి కొరవడడం.. రుణాలివ్వడంలో తొందరపాటు.. డిపాజిట్దారులను కాపాడుకోవడంలో వైఫల్యాలు.. వెరసి ఎస్వీబీ 40 ఏళ్ల సుదీర్ఘ ప్రస్తానానికి ముగింపుగా మారిపోయింది.
అమెరికాలోనే 15వ అతిపెద్ద బ్యాంకు
కాలిఫోర్నియాలోని శాంతాక్లారా కేంద్రంగా పనిచేస్తున్న ఎస్వీబీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనుబంధ సంస్థగా 1983లో సిలికాన్ వ్యాలీ బ్యాంక్(SVB) ఏర్పాటైంది. స్టార్టప్లు, ఇంక్యుబేషన్ కేంద్రాలకు హబ్గా ఉన్న సిలికాన్ వ్యాలీలో టెక్ సంస్థలు, స్టార్టప్లు.. వెంచర్ క్యాపిటల్ ఫండ్లకు రుణాలిస్తూ.. ఓ వెలుగు వెలిగింది. అమెరికాలోనే 15వ అతిపెద్ద బ్యాంకుగా పేరు తెచ్చుకుంది. ఇప్పుడు ఎస్వీబీ చేసిన చిన్నచిన్న పొరపాట్లకు టెక్ కంపెనీల్లో లేఆఫ్లు, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులు వంటి కారణాలతో SVB క్రమంగా దివాలా అంచులకు చేరుకుని, కనుమరుగైపోయింది.
ఏం జరిగింది?
అమెరికాలో ఫెడ్(FED) రుణాల రేట్లను పెంచడంతో ఎస్వీబీ పతనం ప్రారంభమైంది. ఈ బ్యాంకు ఫిక్డ్స్ రేట్ అవైలబుల్ ఫర్ సేల్(FRAS) బాండ్ల రూపంలో 21 బిలియన్ డాలర్లను దీర్ఘకాలిక(మూడున్నర సంవత్సరాలకు) 1.79% వడ్డీ రేటుపై ఇన్వెస్ట్ చేసింది. FRAS డిపాజిట్లపై వడ్డీ రేట్లు స్థిరంగా ఉంటాయి. ఫెడ్ రేట్లు మారినా.. FRAS డిపాజిట్ల వడ్డీపై మార్పు ఉండదు. గడిచిన ఏడాది కాలంలో అమెరికాలో వడ్డీ రేట్లను FED పలు దఫాలుగా వడ్డీ రేట్లను పెంచింది. దీంతో ఆ రేటు 4.71 శాతానికి చేరుకుంది. దాంతో ఎస్వీబీ కకావికలమైంది. తన పెట్టుబడులపై వచ్చే వడ్డీ తక్కువ కావడం.. తమ వద్ద డిపాజిట్లు చేసిన వారికి అధిక వడ్డీ ఇవ్వడంతో లిక్విడిటీని పెంచుకోవడం ఒక్కటే మార్గంగా భావించింది. నిజానికి 2020లో ఈ బ్యాంకులో డిపాజిటర్లు చేసిన ఫిక్డ్స్ డిపాజిట్ల మొత్తం 61.70 బిలియన్ డాలర్లుగా ఉండగా.. 2021లో అది కాస్తా 189.20 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. అంటే కొవిడ్(Covid-19) కల్లోలంలో కూడా గట్టిగా నిలదొక్కుకోగలింది. 2022లో టెక్ కంపెనీల్లో సంక్షోభం ఆరంభమవ్వడంతో FDల విత్డ్రాలు పెరిగిపోయాయి. దాంతో.. ఎస్వీబీ పతనం మరింత వేగంగా సాగింది. దాంతో లిక్విడిటీని పెంచుకునే దిశలో FRAS బాండ్లను నష్టానికి విత్డ్రా చేసుకుంది. అంటే.. 21 బిలియన్ డాలర్లకు బదులు ఎస్వీబీకి దక్కింది 1.8 బిలియన్ డాలర్ల నష్టమే..! ఈ బ్యాంకుకు గత ఆర్థిక సంవత్సరంలో వచ్చిన లాభాలు-- 1.5 బిలియన్ డాలర్లతో పోలిస్తే.. ఇంకా 0.3 బిలియన్ డాలర్లు నష్టమే..! ఈ నష్టాన్ని కవర్ చేయడానికి మరో 2.3 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను అమ్మడానికి సిద్ధమైంది. అదే ఎస్వీబీ కొంప ముంచింది. దీనికి తోడు.. ఎస్వీబీని దాని మాతృసంస్థ ఎస్వీబీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ హస్తగతం చేసుకోబోతోందనే వార్తల నేపథ్యంలో డిపాజిటర్లు విత్డ్రాలకు ఎగబడ్డారు. ఈ ప్రభావం ఎస్వీబీ షేర్లపై తీవ్రంగా పడింది. గురువారం 50%, శుక్రవారం 66% మేర ఆ బ్యాంకు షేర్లు పతనమైపోయాయి.
గత ఏడాది సెప్టెంబరులో 406 డాలర్లుగా ఉన్న ఎస్వీబీ షేర్ విలువ.. శుక్రవారం 106 డాలర్లకు పడిపోయింది. ఓ దశలో ఎస్వీబీ షేర్ల ట్రేడింగ్ను సెక్యూరిటీస్ సంస్థ నిలిపివేయాల్సి వచ్చింది. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఏకంగా ఈ బ్యాంకును దివాలా తీసినట్లుగా ప్రకటించింది. 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో వాషింగ్టన్ మ్యూచువల్ తర్వాత, ఇదే అతి పెద్ద బ్యాంకు వైఫల్యం అని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
వివాదాలు ఎన్నో..
సిలికాన్ వ్యాలీ బ్యాంక్(SVB)ను గడిచిన ఆరేడేళ్లుగా వివాదాలు చుట్టుముడుతున్నాయి. కొన్ని వివాదాస్పద నిర్ణయాలు ఇందుకు ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
1. SVB అధిక వడ్డీ రేట్లు వసూలు చేస్తోందంటూ ఆ బ్యాంకు వినియోగదారులు, ఉద్యోగులు పెద్దఎత్తున ఆరోపణలు చేశారు. 2020లో దీనిపై బ్యాంకు సీఈవో(SVB CEO)కు ఫిర్యాదులు అందాయి. ఇలా ఫిర్యాదు చేసిన ఉద్యోగులను ఆ తర్వాతి కాలంలో తొలగించడంతో.. వారంతా బ్యాంకుపై దావా వేశారు.
2. 2016 ఎన్నికల్లో ట్రంప్ అభ్యర్థిత్వానికి మద్దతుగా.. 2020లోనూ బైడెన్కు వ్యతిరేకంగా ఈ బ్యాంకు రాజకీయ విరాళాలు ఇచ్చిందనే ఆరోపణలున్నాయి. అప్పట్లో అమెరికా పత్రికలు ఈ కథనాలను ప్రముఖంగా ప్రచురించాయి. ఈ రెండు సందర్భాల్లోనూ బ్యాంకు ఖాతాదారులు ఆ చర్యలను మానుకోకుంటే తమ డిపాజిట్లను విత్డ్రా చేస్తామంటూ బెదిరించడం గమనార్హం.
3. SVB సర్వర్పై 2019లో సైబర్ దాడి జరిగింది. దాంతో కొందరు కస్టమర్లు తమ వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకోలేదంటూ ఆందోళన చేశారు.
4. 2018లో వివాదాస్పద స్టార్టప్నకు ఈ బ్యాంకు రుణాలిచ్చింది. రక్తపరీక్ష స్టార్టప్ అయిన థెరానోస్కు రుణం ఇవ్వడంపై విమర్శలు ఎదుర్కొంది. ఆ సంస్థకు 700 మిలియన్ డాలర్ల రుణాన్నివ్వగా.. కొంతకాలానికే థెరానోస్ దివాలా తీసింది.
5. 2020లో బ్యాంకుతో జాత్యాహంకార ధోరణిపై ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు సీఈవోకు లేఖ రాశారు. శ్వేతజాతీయులు తమను అణిచివేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు.
Updated Date - 2023-03-28T16:52:12+05:30 IST