సీఐపై వైసీపీ దాడి!
ABN, First Publish Date - 2023-12-11T02:53:19+05:30
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలో వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. తమ అక్రమాలకు, ఎంజాయ్మెంటుకు అడ్డొస్తే సహించమంటూ వారి స్టైల్లో పోలీసులపైనే దాడులకు తెగబడుతున్నాయి. ఇప్పటిదాకా టీడీపీ, ఇతర ప్రతిపక్షాలే
గుంపుగా వచ్చి విరుచుకుపడ్డ 10 మంది
రెండ్రోజుల క్రితం మహిళా ఎస్ఐపైనా దాడి
సీఎం సొంత జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ మూకలు
ఫిర్యాదిచ్చిన రాయచోటి ఇంటెలిజెన్స్ సీఐ భార్య
రాజీ పడకుంటే ఎదురు కేసంటూ ఆమెకు బెదిరింపు
పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు
కడప, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లాలో వైసీపీ మూకలు రెచ్చిపోతున్నాయి. తమ అక్రమాలకు, ఎంజాయ్మెంటుకు అడ్డొస్తే సహించమంటూ వారి స్టైల్లో పోలీసులపైనే దాడులకు తెగబడుతున్నాయి. ఇప్పటిదాకా టీడీపీ, ఇతర ప్రతిపక్షాలే బాధితులనుకుంటే ఇప్పుడు పోలీసులు కూడా చేరారు. ఒక్క రోజు వ్యవధిలోనే మహిళా ఎస్ఐ, ఒక సీఐపై దాడి జరగడం పోలీసు వర్గాలనే విస్మయానికి గురి చేసింది. ఇంత జరిగినా పోలీసు యంత్రాంగం లైట్ తీసుకోవడం సిబ్బందిని నిరుత్సాహానికి గురి చేస్తోంది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఇంటెలిజెన్స్ సీఐగా అనిల్కుమార్ పనిచేస్తున్నారు. ఆయనకు కడప కోఆపరేటివ్ కాలనీలో సొంతిల్లు ఉంది. రాయచోటికి కడప దగ్గర కావడంతో అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి వెళుతుంటారు. శనివారం కూడా స్వగృహానికి వచ్చారు. అయితే రాత్రి 11 గంటల సమయంలో మయూరా గార్డెన్స్లో పనిచేసే కొంతమంది యువకులు.. సీఐ ఇంటికి సమీపంలో ఉన్న టీ బంకు వద్ద అల్లరి చేస్తూ అక్కడ ఉండే స్థానికులకు ఇబ్బంది కలిగేలా రుబాబు చేస్తున్నారు. పదిరోజుల క్రితం అదేచోట సేమ్ బ్యాచ్ అల్లరి చేయడంతో అప్పట్లో వారికి సీఐ వార్నింగ్ ఇచ్చారు. శనివారం రాత్రి తిరిగి అల్లరి చేస్తుండటంతో సీఐ వారిని హెచ్చరించి ఇంటి మేడపైకి వెళ్లి ఫోనులో మాట్లాడుతుండగా.. సుమారు పది మంది వచ్చి ఆయన్ను చితకబాదారు. ఈ హఠాత్పరిణామంతో భయపడ్డ సీఐ భార్య శ్వేత దుండగులను అడ్డుకునే యత్నం చేసి, వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వన్టౌన్ పోలీసులు వచ్చి.. సీఐ అనిల్కుమార్తో పాటు దాడి చేసిన కొంతమంది అనుమానితులను స్టేషన్కు తీసుకెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున 5గంటల వరకు వారిని అక్కడే ఉంచారు. చికిత్స కోసం ఆదివారం ఉదయం అనిల్కుమార్ రిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. ఈ దాడిలో శంకరాపురానికి చెందిన వైసీపీ గుంపు పాల్గొన్నట్లు సీఐ భార్య శ్వేత చెబుతుండగా.. పోలీసులు మాత్రం అసోం, ఒడిశాకు చెందిన వారు దాడిలో పాల్గొన్నట్లు చెబుతున్నారు. కాగా, దాడి చేసిన వారిలో ఎస్సీ ఎస్టీలు ఉన్నారని, వారు ఫిర్యాదు చేస్తే మీ మీదే కేసు పెట్టాల్సి వస్తుందని, రాజీ పడాలంటూ ఓ పోలీసు అఽధికారి చెప్పినట్లు బాధిత వర్గాలు అంటున్నాయి. ఇక, మయూరా గార్డెన్స్ (హోటల్)ను సీఎం జగన్కు బంధువైన ఎమ్మెల్యేకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు చూసే వైసీపీ నేత, అదే పార్టీకి చెందిన రాజారెడ్డి కలిసి ఏర్పాటు చేశారు. ఈ హోటల్లో పనిచేసేవారే సీఐపై దాడికి పాల్పడ్డారు. వీరు వైసీపీ వారు కావడంతో పోలీసులు చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నారని సమాచారం. దాడి గురించి వన్టౌన్ సీఐ భాస్కర్రెడ్డి మాట్లాడుతూ.. దీనిపై ఎలాంటి ఫిర్యాదు రాలేదన్నారు.
మహిళా ఎస్ఐపై దాడి
ఇక, ప్రొద్దుటూరులో ఓ ముఖ్య నేత అనుచరుడే ఇసుక అక్రమాలకు పాల్పడుతున్నాడనే ఆరోపణ ఉంది. శుక్రవారం అర్ధరాత్రి ప్రొద్దుటూరులోని పెన్నానది నుంచి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా వన్టౌన్ ఎస్ఐ హైమావతిపై ఇసుక మూక రాయితో దాడి చేసింది. దీంతో ఆమె సెల్ఫోన్ పగిలిందని, కాలికి గాయమైనట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారంలోనూ ఇప్పటివరకు పోలీసులు ఎవ్వరినీ అరెస్టు చేయలేదు.
Updated Date - 2023-12-11T02:53:20+05:30 IST