ఉద్యమం ఉధృతం చేస్తాం
ABN, Publish Date - Dec 17 , 2023 | 11:52 PM
అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెను ఉధృతం చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆరో రోజు ఆదివారం కూడా సమ్మెను కొనసాగించారు. జిల్లా వ్యాప్తంగా నిరసన దీక్షలతో పాటు వివిధ రూపాల్లో ఆందోళన చేపట్టారు.
- ఆరో రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె
- మద్దతు పలికిన ప్రజా సంఘాలు
విజయనగరం, డిసెంబరు 17 (ఆంరఽధజ్యోతి): అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెను ఉధృతం చేశారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆరో రోజు ఆదివారం కూడా సమ్మెను కొనసాగించారు. జిల్లా వ్యాప్తంగా నిరసన దీక్షలతో పాటు వివిధ రూపాల్లో ఆందోళన చేపట్టారు. అంగన్వాడీలకు టీడీపీ, ప్రజాసంఘాల నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగుల సంఘం నాయకులు బి.పైడిరాజు, లక్ష్మి, సుధారాణి మాట్లాడుతూ.. వారు మాట్లాడుతూ.. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తుందని విమర్శించారు. గర్భిణులు, బాలింతలతో పాటు పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ సేవలు అందిస్తున్నా తమ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతుంటే కక్ష సాధింపునకు దిగుతుందన్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం రూ.26వేలు వేతనం, ఉద్యోగ విరమణ తరువాత పెన్షన్, అదే విధంగా మినీ అంగన్వాడీలను మెయిన్ కేంద్రాలుగా మార్చాలని డిమాండ్ చేశారు. నిత్యావసర ధరలు భారీగా పెరుగుతున్నా వేతనాలు పెంచడం లేదని, మెనూ చార్జీలు కూడా అరకొరగా అందజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు నాణ్యమైన సరుకులు అందజేయాలని కోరారు. కేంద్రాల అద్దె లు, 2017 నుంచి పెండింగ్లో ఉన్న టీఏ బిల్లులు, ఇతర బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీల పోరాటానికి మధ్యాహ్న భోజన వంట కార్మికులు కూడా మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ నాయకురాలు అనసూయ, సీఐటీయూ నాయకులు కె.సురేష్, ఎ.జగన్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 11:52 PM