నేడు క్రిస్మస్
ABN, Publish Date - Dec 24 , 2023 | 11:48 PM
జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. పండగ సోమవారం అయినప్పటికీ ఆదివారం అర్ధరాత్రి నుంచి సంబరాలు మొదలయ్యాయి.
నేడు క్రిస్మస్
విద్యుత్ దీపాలతో శోభాయామానంగా చర్చిలు
విజయనగరం (ఆంధ్రజ్యోతి)/ కలెక్టరేట్
జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. పండగ సోమవారం అయినప్పటికీ ఆదివారం అర్ధరాత్రి నుంచి సంబరాలు మొదలయ్యాయి. విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబైన చర్చిల్లో ప్రార్థనలు చేసేందుకు క్రైస్తవులు బారులుతీరారు. ప్రార్థనా మందిరాలన్నీ కళకళలాడుతూ కనిపించాయి. అంతటా ఏసు గీతాలాపన వినిపించింది. బంధువులు, స్నేహితులతో సందడే సందడి నెలకొంది. వారం రోజుల నుంచే క్రైస్తవులు ఇళ్లతో పాటు చర్చిలను అందంగా అలంకరించారు. మరోవైపు మార్కెట్లు, మాల్స్, వస్త్ర దుకాణాలు కొత్త కళను అద్దుకున్నాయి. స్టార్స్ , క్రిస్మస్ ట్రీలు, ఇతర అలంకరణ వస్తువుల కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి. ఇప్పటికే మినీ, సెమి క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. విజయనగరంలోని సెయింట్జోషఫ్, సెయింట్మెరీస్, స్వీమ్స్ మెమోరియల్, కంటోన్మెంట్ బాప్టిస్ట్ చర్చి, లూథరన్ చర్చి విద్యుత్ దీపాలతో ఆకట్టుకుంటున్నాయి. సోమవారం జరిగే క్రిస్మస్ వేడుకలకు ప్రజాప్రతినిధులు, అధికారులను ప్రత్యేకంగా ఆహ్వానించారు.
అందరిలో సంతోషం నింపాలి: కలెక్టర్
ఈ క్రిస్మస్ ప్రజలందరి జీవితాల్లో సంతాషాన్ని నింపాలని, వారి కుటుంబాల్లో ఆనందకాంతులు విరాజిల్లాలని కలెక్టర్ నాగలక్ష్మి ఆకాంక్షించారు. క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సాటి మానవుల పట్ల దయా, ప్రేమ, కరుణ , క్షమాగుణం చూపడమే ఏసు బోధనలో ఆంతర్యమని పేర్కొన్నారు. శాంతి, సౌఖ్యాలు వర్ధిల్లాలని, ప్రజలంతా సోదరభావంతో మెలగాలని కోరారు.
Updated Date - Dec 24 , 2023 | 11:48 PM