నేడు క్రిస్మస్
ABN, Publish Date - Dec 24 , 2023 | 11:45 PM
జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి సంబరాలు మొదలయ్యాయి. విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబైన చర్చిల్లో ప్రార్థనలు చేసేందుకు క్రైస్తవులు బారులుతీరారు. ప్రార్థనా మందిరాలన్నీ కళకళలాడుతూ కనిపించాయి. జిల్లా అంతటా సందడి వాతావరణం నెలకొంది.
అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు
సాలూరు రూరల్/పాలకొండ/భామిని, డిసెంబరు 24: జిల్లాలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి సంబరాలు మొదలయ్యాయి. విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబైన చర్చిల్లో ప్రార్థనలు చేసేందుకు క్రైస్తవులు బారులుతీరారు. ప్రార్థనా మందిరాలన్నీ కళకళలాడుతూ కనిపించాయి. జిల్లా అంతటా సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు మార్కెట్లు, మాల్స్, వస్త్ర దుకాణాలు కిటకిటలాడాయి. స్టార్స్ , క్రిస్మస్ ట్రీలు, ఇతర అలంకరణ వస్తువుల కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి. ఇప్పటికే మినీ, సెమి క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కాగా సోమవారం పండగ ఘనంగా నిర్వహించేందుకు క్రైస్తవులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. జిల్లాలో నాలుగు నియోజక వర్గాలతో పాటు 15 మండలాల్లోని క్రైస్తవ మందిరాల్లో క్రిస్మస్ శోభ సంతరించుకుంది. పాలకొండలో వందేళ్ల చరిత్ర ఉన్న ఆర్సీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి బాలయేసును ఆహ్వానించారు. సాలూరు పట్టణం, మండలంలో చర్చిల్లో సోమవారం వేకువ వరకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పట్టణంలో లూథరన్ చర్చి విద్యుత్ దీపాలంకరణలో అందర్నీ ఆకట్టుకుంటుంది. భామిని మండలం బత్తిలిలోని ఆర్సీఎం చర్చిని విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. నులకజోడు, భామిని, నేరడి, నల్లరాయిగూడ లివిరి తదితర గ్రామాల్లోని చర్చిలను క్రిస్మస్ వేడుకలకు సిద్ధం చేశారు.
Updated Date - Dec 24 , 2023 | 11:45 PM