ప్రభుత్వానికి బుద్ధి రావాలని...
ABN, Publish Date - Dec 31 , 2023 | 11:08 PM
తమ సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తోన్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి రావాలని పారిశుధ్య కార్మికులు నినదించారు. ఈ మేరకు ఆదివారం పార్వతీపురంలో వారు ఇంజనీరింగ్ విభాగం కార్మికులతో కలిసి అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు.
పార్వతీపురం టౌన్/సాలూరు రూరల్/పాలకొండ, డిసెంబరు 31: తమ సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తోన్న వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి రావాలని పారిశుధ్య కార్మికులు నినదించారు. ఈ మేరకు ఆదివారం పార్వతీపురంలో వారు ఇంజనీరింగ్ విభాగం కార్మికులతో కలిసి అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. స్థానిక పాతబస్టాండ్ కూడలి నుంచి నాలుగురోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కొద్దిరోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. పాదయాత్ర సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే సమ్మె ఉధృతం చేస్తామన్నారు. సాలూరులోనూ మున్సిపల్ కార్మికులు అర్థనగ్న ప్రదర్శనతో ర్యాలీ చేశారు. వేతనాలు పెంచాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. పాలకొండలో పారిశుధ్య కార్మికులు ఒంటికాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. సీఐటియూ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేతలు పాల్గొన్నారు.
Updated Date - Dec 31 , 2023 | 11:08 PM