బరితెగింపు
ABN, Publish Date - Dec 31 , 2023 | 12:35 AM
పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో ఓ వైసీపీ కౌన్సిలర్ రెచ్చిపోయారు. తన అనుచరులతో కలిసి టీడీపీ కౌన్సిలర్పై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
పార్వతీపురం మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రికత్త
పార్వతీపురం టౌన్, డిసెంబరు 30: పార్వతీపురం మున్సిపల్ కార్యాలయంలో ఓ వైసీపీ కౌన్సిలర్ రెచ్చిపోయారు. తన అనుచరులతో కలిసి టీడీపీ కౌన్సిలర్పై విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో శనివారం సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ కౌన్సిలర్లు తాగునీరు, పారిశుధ్య నిర్వహణపై ప్రశ్నించారు. పట్టణాభివృద్ధిపై మున్సిపల్ చైర్పర్సన్ గౌరీశ్వరీ, ఎక్స్ అఫిషియో సభ్యులు, ఎమ్మెల్యే జోగారావు, వైసీపీ కౌన్సిలర్లను నిలదీశారు. దీంతో కొంతమంది వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కౌన్సిలర్లు డి.శ్రీదేవి, నారాయణరావు, వెంకటరావు, గౌరునాయుడు, సరితతో వాగ్వాదానికి దిగారు. అయితే వైసీపీ కౌన్సిలర్ల వ్యవహార శైలి నచ్చక సమావేశ మందిరం నుంచి టీడీపీ కౌన్సిలర్లు బయటకు వచ్చేశారు. మున్సిపల్ చైర్పర్సన్ చాంబర్ సమీపంలో విలేకరులతో వారు మాట్లాడుతుండగా.. ఇంతలో అధికార పార్టీకి చెందిన 25వ వార్డు వైసీపీ కౌన్సిలర్ ఎన్.సుధీర్ (నల్ల చొక్కా ధరించిన వ్యక్తి) సమావేశం నుంచి బయటకు వచ్చి. ‘నేను సారా వ్యాపారం చేస్తూన్నానంటూ ప్రచారం చేస్తావా’? అని తన అనుచరులతో కలిసి 8వ వార్డు టీడీపీ కౌన్సిలర్ నారాయణరావుపై ఇష్టారాజ్యంగా దాడి చేశారు. ఇద్దరిని చెరోవైపు తోటి కౌన్సిలర్లు, ఇతర నాయకులు పంపించారు. నారాయణరావు సమావేశ మందిరం మెట్లు దిగి కిందకు వెళ్తుండగా సుధీర్ తన అనుచరులతో నారాయణరావును పట్టుకుని దాడి చేసి కిందకు నెట్టారు. ఆ సమయంలో నారాయణరావు త్రుటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. మెట్లు మీద నుంచి తోసినప్పుడు అదుపుతప్పి కింద పడితే ప్రాణాపాయం జరిగేది. అయితే ఆ సమయంలో వారి మధ్య మళ్లీ తోపులాట, వాగ్వాదం జరిగింది. ఎవరెంత చెప్పినా నారాయణరావు షర్ట్ కాలర్ను సుధీర్ వదలలేదు. చివరకు అధికార, ప్రతిపక్ష కౌన్సిల్ సభ్యులంతా వచ్చి అడ్డుకోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇంతలో పట్టణ పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింపజేశారు. ఎమ్మెల్యే అలజంగి జోగారావు ముఖ్య అనుచరునిగా పేరొందిన కౌన్సిలర్ సుధీర్ టీడీపీ కౌన్సిలర్పై దాడి చేయడం రాజకీయ దుమారం రేపింది. కౌన్సిలర్ల మధ్య జరిగిన గొడవలో బయట వ్యక్తి సుధీర్ అనుచరుడు టీడీపీ కౌన్సిలర్పై దాడి చేసిన పరిస్థితి చూస్తే ముందస్తుగానే దాడి ప్రణాళిక రూపొందించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా ఇరు పక్షాలు పోలీస్ స్టేషన్లో పరస్పర ఫిర్యాదులు చేసుకున్నారు. 25వ వార్డు వైసీపీ కౌన్సిలర్ సుధీర్ తనపై దాడి చేశారని టీడీపీ కౌన్సిలర్ నారాయణరావు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తనపై 8వ వార్డు కౌన్సిలర్ నారాయణ రావు దాడి చేయడమే కాకుండా కులం పేరుతో దుషించాడంటూ మరోవైపు వైసీపీ కౌన్సిలర్ సుధీర్ ఫిర్యాదు చేయడం కొసమెరుపు.
అరాచక పాలనకు నిదర్శనం..
మున్సిపల్ కార్యాలయంలో ఒక టీడీపీ కౌన్సిలర్పై వైసీపీ కౌన్సిలర్తో పాటు ఆయన అనుచరులు దాడి చేయడాన్ని టీడీపీ నేతలు ఖండించారు. వైసీపీ అరాచక పాలనకు ఇది నిదర్శనమన్నారు. పార్వతీపురం పట్టణాభివృద్ధిపై ప్రశ్నిస్తే దాడి చేయడం ఎంతవరకు సమంసజమని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ శ్రీదేవి, ఇతర టీడీపీ కౌన్సిలర్లు, నేతలు ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వైసీపీ కౌన్సిలర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తీవ్రంగా ఖండిస్తున్నాం..
ప్రశాంతతకు నిలయమైన పార్వతీపురాన్ని వైసీపీ నేతలు రౌడీ రాజ్యంగా మారుస్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బోనెల విజయచంద్ర ఆరోపించారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన తెలిపారు. శనివారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జోగారావు సమావేశ మందిరంలో ఉంటుండగానే వైసీపీ కౌన్సిలర్ సుధీర్.. టీడీపీ కౌన్సిలర్పై దాడి చేయడం దారుణమన్నారు. ప్రణాళిక ప్రకారమే ఇదంతా చేసినట్లుగా తెలుస్తోందన్నారు. టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్న కౌన్సిలర్ నారాయణరావుపై వైసీపీ నాయకులు కక్ష కట్టారని తెలిపారు. ఎమ్మెల్యే జోగారావు, వైసీపీ కౌన్సిలర్ సుఽధీర్ వల్ల టీడీపీ కౌన్సిలర్ నారాయణరావుకు ప్రాణహాని ఉందని ఆయన ఆరోపించారు. వైసీపీకి ఓట్లు వేయకపోతే ప్రజలనకు కూడా కొడతారా? అని ప్రశ్నించారు. తమ పార్టీ నేతలకు ఏం జరిగినా వైసీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. వైసీపీ కౌన్సిలర్ సుధీర్పై గతంలోనే కేసులు ఉన్నాయని వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు, కార్యకర్తల జోలికి వస్తే సహించేది లేదన్నారు. కౌన్సిలర్ నారాయణరావుపై జరిగిన దాడిని ఆధారాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. మాజీ సైనికుడు, టీడీపీ కౌన్సిలర్కు నారాయణరావుకు న్యాయం చేయాలని కోరారు.
దాడి అప్రజాస్వామికం
పార్వతీపురంటౌన్: పట్టణాభివృద్దిపై మున్సిపల్ సాధారణ సమావేశంలో ప్రశ్నించిన 8వ వార్డు టీడీపీ కౌన్సిలర్ కోరాడ నారాయణరావుపై అధికార పార్టీకి చెందిన 25వ వార్డు కౌన్సిలర్ ఎన్.సుధీర్ దాడికి పాల్పడడం అప్రజాస్వామికమని కాపు సంఘం నాయకులు అన్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇందుకు నిరసనగా శనివారం రాత్రి పార్వతీపురంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఆ సంఘం నాయకులు సీతారాం, వెంకటేష్, ఆర్.శివకుమార్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యలు, అభివృద్ధిపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులను ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నించడం సహజమన్నారు. అంతమాత్రాన ప్రశ్నించే పాలకవర్గ సభ్యులపై దాడులకు పాల్పడడం ఎంతవరకు సమంజసమన్నారు. నారాయణరావుపై దాడి చేసిన సుధీర్, అతని అనుచరులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
రాజీనామా చేస్తా..
ఈ రోజు తన తోటి పాలకవర్గ సభ్యుడిపై దాడి చేశారని, రేపు తనపై దాడి జరిగితే ఎవరూ పట్టించుకోరనే అనుమానంతో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఒకటో వార్డు కౌన్సిలర్ రణభేరి శివకుమార్ విలేకరుల ముందు స్పష్టం చేశారు.
Updated Date - Dec 31 , 2023 | 12:35 AM