ఒకటిన వేతనం కష్టమే
ABN, Publish Date - Dec 28 , 2023 | 11:34 PM
రాజాం మున్సిపల్ కమిషనర్ డీటీవీ.కృష్ణారావు సెలవుపై వెళ్లడం, ఎఫ్ఏసీ (పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు) ఎవ్వరికీ ఇవ్వకపోవడంతో మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటు పర్మినెంట్ ఉద్యోగులు, సచివాలయాల సిబ్బంది, వార్డు వలంటీర్లు అగమ్యగోచరంలో పడ్డారు.
ఒకటిన వేతనం కష్టమే
సెలవులో రాజాం మున్సిపల్ కమిషనర్
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయని యంత్రాంగం
బిల్లులు అప్లోడ్ కాక జీతాలకు నోచుకోని ఉద్యోగులు
రాజాం రూరల్, డిసెంబరు 28: రాజాం మున్సిపల్ కమిషనర్ డీటీవీ.కృష్ణారావు సెలవుపై వెళ్లడం, ఎఫ్ఏసీ (పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు) ఎవ్వరికీ ఇవ్వకపోవడంతో మున్సిపల్ కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటు పర్మినెంట్ ఉద్యోగులు, సచివాలయాల సిబ్బంది, వార్డు వలంటీర్లు అగమ్యగోచరంలో పడ్డారు. వీరికి వచ్చే నెల ఒకటిన జీతాలు అందడం దాదాపు కష్టమే. తొలుత మూడు రోజులు సెలవు పెట్టిన కమిషనర్ ఇన్చార్జి బాధ్యతలను ఏఈ వెంకట్కు అప్పగించారు. ఆపై మరో 12రోజులు సెలవును పొడిగించిన నేపధ్యంలో ఈ పరిస్థితి నెలకొంది.
వ్యక్తిగత అవసరాలపై ఈనెల 19 నుంచి 21 వరకు కమిషనర్ సెలవుపై వెళ్లారు. ఏఈ వెంకట్కు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆపై వచ్చే ఏడాది జనవరి 3 వరకు సెలవును పొడిగిస్తూ కమిషనర్ అమరావతిలో దరఖాస్తు చేసుకున్నారు. దీంతో 118 మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో పాటు 28 మంది పర్మినెంట్ ఉద్యోగులు, 11 సచివాలయాల పరిధిలో సుమారు 100 మంది ఉద్యోగులు, మున్సిపాలిటీ పరిధిలోని ఐదు గ్రామాల్లోని సుమారు 250 మంది వార్డువలంటీర్ల జీతాల బిల్లును అప్లోడ్ చేయలేని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి ప్రతినెలా 20 నుంచి కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల బిల్లును కమిషనర్ ప్రభుత్వ లాగిన్లో అప్లోడ్ చేయాలి. అమరావతి నుంచి అనుమతి వచ్చాక పర్మినెంట్ ఉద్యోగులకు సంబంధించిన జీతాల బిల్లులు లాగిన్ కావాల్సి ఉంది. ఈ ప్రక్రియ అంతా ప్రతినెలా 26తో ముగియాల్సి ఉంది. అయితే ఏఈ వెంకట్కు ఇన్చార్జి కమిషనర్ బాధ్యతలు అప్పగించిన కమిషనర్ కృష్ణారావు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించకపోవడంతో ఏఈ వెంకట్ ఆర్థిక పరమైన లావాదేవీలు నిర్వహించేందుకు వీలుకాలేదు. దీంతో జనవరి మొదటివారంలో జీతాలు పొందే అవకాశాన్ని మున్సిపల్ ఉద్యోగులు కోల్పోయారు. ఇదిలా ఉంటే 2005 అక్టోబరులో రాజాం నగర పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి నేటివరకూ ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ తలెత్తలేదు. తొలిసారి ఉద్యోగులకు ఎదురుకావడంతో విమర్శలు గుప్పుమంటున్నాయి. కమిషనర్పై సిబ్బంది మండిపడుతున్నారు.
రాజాం మున్సిపాలిటీ కార్యాలయం
Updated Date - Dec 28 , 2023 | 11:34 PM