దగా ప్రభుత్వం
ABN, Publish Date - Dec 14 , 2023 | 11:36 PM
‘మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీ సిబ్బందికి తెలంగాణకంటే జీతం రూ.వెయ్యి అదనంగా ఇస్తా’మని 2019లో పాద యాత్ర సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో సీఎం జగన్ హామీ ఇచ్చారు.
- వేతనాలు పెంచుతామని అంగన్వాడీలకు మోసం
- నాలుగున్నరేళ్లయినా పట్టించుకోని సర్కారు
- టీడీపీ హయాంలోనే వారి జీతాల పెంపు
పార్వతీపురం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ‘మేము అధికారంలోకి వస్తే అంగన్వాడీ సిబ్బందికి తెలంగాణకంటే జీతం రూ.వెయ్యి అదనంగా ఇస్తా’మని 2019లో పాద యాత్ర సమయంలో ప్రతిపక్ష నేత హోదాలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఆయన హామీని నమ్మి చాలామంది అంగన్ వాడీ సిబ్బంది గత ఎన్నికల్లో వైసీపీకి మద్దతు పలికారు. అయితే, గెలిచిన తరువాత వైసీపీ ప్రభుత్వం తమను దగా చేసిందని అంగన్వాడీలు ఆవేదన చెందుతున్నారు. నాలుగున్నరేళ్లుగా వేతనాలు పెంచడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కంటి తుడుపుగా రూ.వెయ్యి పెంచి చే తులు దులుపుకొందని, తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరం చేసిందని మండిపడుతున్నారు. ప్రస్తుతం అంగన్వాడీ సిబ్బంది రూ.11,500 వేతనం అందుకుంటున్నారు. అయితే, ఈ వేతనం దేనికీ సరిపోవడం లేదని, కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోతున్నారు. వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వస్తే తెలంగాణలోని అంగన్వాడీల మాదిరిగా తమకు రూ.15 వేల వేతనం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయని ఆశపడ్డామని, కానీ ఈ ప్రభుత్వం మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీతాలకు బదులు యాప్ల ద్వారా పని ఒత్తిడి పెంచిందని మండిపడుతున్నారు. దీంతో నిరవధిక సమ్మెకు దిగినట్లు చెబుతున్నారు.
టీడీపీ హయాంలో ఎంతో లబ్ధి
టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే అంగన్వాడీ సిబ్బందికి వేతనాలు పెరిగాయి. 2012లో రూ.3700 జీతానానికి అంగన్ వాడీ కార్యకర్తలు విధుల్లో చేరారు. 2014 టీడీపీ అధికారం చేపట్టిన తర్వాత వారికి రూ.4,200 వేతనం చేసింది. ఆ తరువాత 2016లో రూ.7వేలు, 2017లో రూ.10,500 వేతనం పెంచింది. అలాగే, అంగన్వాడీ సహాయకులకు కూడా జీతాలు పెరిగాయి. వీరు 2014లో రూ.2250 వేతనాన్ని అందుకునే వారు. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 2016లో రూ.4,500, 2017లో రూ.6వేలకు వేతనాలు పెంచారు. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలకు అర్హులుగా గుర్తించింది. అర్హతను బట్టి వారు పథకాలు పొందేవారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ సిబ్బందికి ఎంతో లబ్ధిచేకూరింది. కానీ, 2019లో వైసీపీ ప్రభుత్వ వచ్చిన తర్వాత కేవలం రూ.వెయ్యి మాత్రమే జీతం పెంచిందని, సంక్షేమ పథకాలకు కోత పెట్టిందని ఆవేదన చెందుతున్నారు.
మూడో రోజూ కొనసాగిన సమ్మె
జిల్లాలో అంగన్వాడీ సిబ్బంది మూడో రోజు గురువారం కూడా సమ్మెను కొనసాగించారు. జిల్లా కేంద్రం పార్వతీపురం తో పాటు సాలూరు, పాలకొండ, కురుపాం నియోజకవర్గాల్లో సమ్మె చేట్టారు. వీరికి టీడీపీ నియోజకవర్గాల ఇన్చార్జిలు బోనెల విజయ్చంద్ర, గుమ్మిడి సంధ్యారాణి, నిమ్మక జయకృష్ణ, తోయక జగదీశ్వరి మద్దతు తెలిపారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ వలంటీర్లు సచివాలయ సిబ్బంది, మహిళ సంఘాల ద్వారా అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగులగొట్టి కేంద్రాలను తెర వడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మంచి పద్ధతి కాదన్నారు. ప్రభుత్వం రెచ్చగొట్టే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీఐటీయూ నాయకుడు జి.సన్యాసి తదితరులు, తెలిపారు.
బలవంతంగా తెరుస్తున్న కేంద్రాలు
జిల్లాలో పలు అంగన్వాడీ కేంద్రాలను సచివాలయ సిబ్బంది, మహిళ సంఘాల ప్రతినిధులు, పోలీసులు, వలంటీర్లతో బలవంతంగా తెరుస్తున్నారు. జిల్లాలో 1412 మెయిన్, 617 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. గురువారం 532 మెయిన్, 240 మినీ అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగులగొట్టి తెరిచారు. సాలూరు మండలం కురుకూటి సెక్టార్ రావివలసలో మహిళా సంఘ నేతలు అంగన్వాడీ కేంద్రం తెరవడం సరికాదని గ్రామస్థులు నిరసన తెలిపారు. ప్రభుత్వ బెదిరింపులకు భయపడబోమని, ఉద్యమం తీవ్రతరం చేస్తామని జిల్లా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి బలగ రాధ అన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
మేము గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. ప్రస్తుతం నిత్యావసరాలు, గ్యాస్ ధరలు ఏ విధంగా ఉన్నాయో ప్రభుత్వానికి తెలుసు. మేము కుటుంబముతో బతకాలంటే కనీసం రూ.25 వేల వేతనం చెల్లించాలి. మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించాలి.
-సాలూరు గౌరి మణి, అంగన్వాడీ యూనియన్ ప్రతినిధి
సమ్మె కొనసాగిస్తాం
మా న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. మా సమస్యలు పరిష్కరిస్తేనే సమ్మె విరమిస్తాం. లేని పక్షంలో సమ్మె కొనసాగిస్తాం.
-కోలా రాజేశ్వరి, పార్వతీపురం అంగన్వాడీ యూనియన్ ప్రతినిధి
Updated Date - Dec 14 , 2023 | 11:36 PM