ఆటలు ఎలా?
ABN, Publish Date - Dec 24 , 2023 | 12:05 AM
‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీల నిర్వహణ అధికారులకు కత్తిమీద సాములా మారింది. తొలుత అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల్లో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరిట ఐదు రకాల క్రీడా పోటీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
-ఈ నెల 26 నుంచి ‘ఆడుదాం ఆంధ్ర’
- క్రీడాకారుల నుంచి స్పందన కరువు
- కానరాని మైదానాలు
- అవగాహన కార్యక్రమాల కోసం అధికారుల తంటాలు
- విద్యార్థులతో ప్రచారం చేయిస్తున్న వైనం
-రాజాం ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు వీరు. ‘ఆడుదాం-ఆంధ్ర’ కార్యక్రమంపై శనివారం అవగాహన ర్యాలీ చేపట్టారు. తొలుత ఈ ర్యాలీ చేయాలని పాఠశాల విద్యాశాఖ నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. దీంతో ర్యాలీకి విద్యార్థులను పంపించేందుకు హెచ్ఎం అనుమతించలేదు. ఈ కార్యక్రమానికి విద్యార్థులతో సంబంధం లేదు. ఎక్కడికక్కడే సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లతో అవగాహన చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకే హెచ్ఎం సమ్మతించలేదు. చివరకు మండల ప్రత్యేకాధికారి ఆదేశాలతో విద్యార్థులను ర్యాలీకి పంపించాల్సి వచ్చింది.
రాజాం, డిసెంబరు 23: ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీల నిర్వహణ అధికారులకు కత్తిమీద సాములా మారింది. తొలుత అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సచివాలయాల్లో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరిట ఐదు రకాల క్రీడా పోటీలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 17 సంవత్సరాలు నిండిన వారు అర్హులు. జూనియర్, డిగ్రీ కాలేజీ విద్యార్థులను ప్రోత్సహించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ, వివిధ కారణాలు చూపుతూ ఈ నెల 15వ తేదీకి పోటీలను వాయిదా వేసింది. అయితే, వర్షాలను కారణంగా చూపుతూ ఈ నెల 26కు మరోసారి పోటీలను వాయిదా వేసింది. ఆశించిన స్థాయిలో క్రీడాకారుల నుంచి స్పందన రాకపోవడంతోనే పోటీలను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం ఐదు క్రీడాంశాలకు సంబంధించి దాదాపు 228 మంది క్రీడాకారుల పేర్లను నమోదు చేయాలి. కానీ క్రీడాకారులు రాకపోవడంతో పంచాయతీ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇంతవరకూ అటువంటి సన్నాహాలేవీ సచివాలయాల్లో ప్రారంభం కాలేదు. అసలు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు కూడా ఎవరికీ తెలియదు.
ఏదీ నాటి వైభవం?
జిల్లా క్రీడాకారుల ఖిల్లా. ఎంతో మంది అంతర్జాతీయ క్రీడాకారులను జాతికి అందించింది ఈ జిల్లా. నెల్లిమర్ల మండలం నుంచి పదుల సంఖ్యలో క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించారు. అంతటి ఘన చరిత్ర కలిగిన జిల్లాలో క్రీడల పురోగతి లేకుండా పోయింది. నైపుణ్యం కలిగిన క్రీడాకారులు ఉన్నా వారికి ప్రోత్సాహం కరువవుతోంది. ముఖ్యంగా క్రీడా ప్రాంగణాలు లేకుండా పోయాయి. జిల్లాలో మునిసిపాల్టీలు, పట్టణాల్లో తప్ప ఎక్కడా క్రీడా మైదానాలు లేవు. మండల కేంద్రాల్లో సైతం కానరావడం లేదు. ప్రభుత్వ భవనాల నిర్మాణం, జగనన్న కాలనీ లేఅవుట్ల పేరిట ఎక్కడికక్కడే ఖాళీ స్థలాలను కేటాయించారు. దీంతో క్రీడా మైదానాలు కూడా దొరకని దుస్థితి. జిల్లా వ్యాప్తంగా 560 సచివాలయాలు ఉండగా.. దాదాపు అన్నింటా క్రీడా మైదానాలు లేని పరిస్థితి. దీంతో ఆడుదాం-ఆంధ్ర పోటీల నిర్వహణకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
కానరాని నమోదు ప్రక్రియ
ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలకు ఈ నెల 17 వరకూ నమోదు ప్రక్రియకు అవకాశమిచ్చారు. కానీ ఏ సచివాల యంలో కూడా క్రీడాకారుల నమోదు ప్రక్రియ పూర్తికాలేదు. క్రీడా పోటీలపై ఎటువంటి అవగాహన లేకపోవడంతో అరకొరగానే నమోదు జరుగుతోంది. అయితే ఈ క్రీడా పోటీలకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు మంజూరు చేపట్టలేదు. దీంతో అధికారులు ఆందోళనకు గురవుతున్నారు.
మండల స్థాయి విజేతలకు బహుమతుల్లేవ్
ఈ నెల 26 నుంచి దాదాపు 38 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు కొనసాగనున్నాయి. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, షటిల్ బ్యాడ్మింటన్, క్రికెట్ తదితర ఐదు క్రీడాంశాల్లో పోటీలు జరగనున్నాయి. తొలుత సచివాలయం వారీగా పోటీలు నిర్వహించనున్నారు. అందులో విజేతలుగా నిలిచిన వారిని మండల స్థాయిలో, ఆ తరువాత ప్రతిభనబట్టి నియోజకవర్గ, జిల్లాస్థాయిలో ఆడిస్తారు. అక్కడ గెలుపొందిన వారికి విశాఖలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ఆడిస్తారు. అయితే, సచివాలయ, మండల స్థాయి విజేతలకు ప్రభుత్వం ఎటువంటి నగదు బహుమతులు ప్రకటించలేదు. కేవలం వారికి క్రీడా దుస్తులతో పాటు కిట్లను మాత్రమే సమకూర్చుతుంది. నియోజకవర్గస్థాయిలో ఐదు క్రీడాంశాలకు సంబంధించి ప్రథమ, ద్వితీయ విజేతలకు రూ.20 వేలు, రూ.10 వేలు, జిల్లాస్థాయికి సంబంధించి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థాయి విజేతలకు వరుసగా రూ.50 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు ప్రకటించారు.
Updated Date - Dec 24 , 2023 | 12:05 AM