కూలి పనికెళ్లి..
ABN, Publish Date - Dec 28 , 2023 | 12:07 AM
వారిద్దరివి రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. రోజూ కూలి పనికి వెళ్లకపోతే ఇల్లు గడవని పరిస్థితి. దినచర్యలో భాగంగా బుధవారం గ్రామంలోనే వరిచేను నూర్పు పనులకు తోటి కూలీలతో వెళ్లారు. అక్కడ పూర్తయ్యాక మరో పొలానికి బయలుదేరారు.
కూలి పనికెళ్లి..
వరినూర్పిడి యంత్రం బోల్తా
ఇద్దరు మహిళలు మృతి
మరో నలుగురుకి గాయాలు
తెర్లాం, డిసెంబరు 27: వారిద్దరివి రెక్కాడితే కానీ డొక్కాడని బతుకులు. రోజూ కూలి పనికి వెళ్లకపోతే ఇల్లు గడవని పరిస్థితి. దినచర్యలో భాగంగా బుధవారం గ్రామంలోనే వరిచేను నూర్పు పనులకు తోటి కూలీలతో వెళ్లారు. అక్కడ పూర్తయ్యాక మరో పొలానికి బయలుదేరారు. అలా వెళ్తున్న క్రమంలో నూర్పిడి యంత్రంపై ఆరుగురు కూర్చొన్నారు. ఓ గట్టు వద్ద వాహనం అదుపు తప్పి నూర్పిడియంత్రం బోల్తా పడింది. కింది ఉండిపోవడంతో భీమసింగి శాంతమ్మ (38), రమణమ్మ (40) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు గాయాలతో బయటపడ్డారు. ఈ దుర్ఘటన అంట్లవార గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
అంట్లవార గ్రామానికి చెందిన శాంతమ్మ, రమణమ్మతో పాటు గొంగాడ ఆదిలక్ష్మి, మూడడ్ల లక్ష్మి, కోట సత్యవతి, బోను లక్ష్మి కలిసి బుధవారం ఉదయం వరి నూర్పు పనులకు హాజరయ్యారు. గ్రామంలోనే కావడంతో తొందరగానే పొలం వద్దకు చేరుకున్నారు. మాట్లాడుకుంటూ పనిలో నిమగ్నమయ్యారు. ఒకపొలంలోని చేనంతా నూర్పిడి చేశారు. మరో పొలానికి బయలుదేరారు. ఆరుగురు మహిళలు నూర్పిడియంత్రంపై కూర్చొన్నారు. కొద్ది సెకెన్లలో దిగిపోనుండగా ఓ పెద్ద గట్టు అడ్డు వచ్చింది. గట్టు పైనుంచి కిందికి దిగుతున్న సమయంలో ట్రాక్టర్ అదుపుతప్పింది. వెనకున్న యంత్రం బోల్తా కొట్టింది. కింద చిక్కుకున్న శాంతమ్మ, రమణమ్మ ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. శాంతమ్మకు భర్తతో పాటు 9వ తరగతి చదువుతున్న కుమారుడు మణికంట, ట్రిపుల్ఐటీలో 2వ సంవత్సరం చదువుతున్న కుమార్తె స్నేహ ఉన్నారు. రమణమ్మకు భర్తతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం బాడంగి సీహెచ్సీకి తరలించారు. క్షతగాత్రు లను మెరుగైన వైద్యం కోసం రాజాం కేర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ట్రాక్టర్ యజమానిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆర్.రమేష్ తెలిపారు.
అన్నీ మాకు అమ్మే...
రోజూ అమ్మే అన్ని పనులూ చేసిపెడుతుంది. ఈ రోజు కూడా ‘నాన్న నువ్వు స్కూల్కు వెళ్లు.. నేను పనికివెళ్లి వస్తానని’ చెప్పింది. డబ్బులు సమకూరాక ఫీజులు, దుస్తులు కొనుక్కుందామని చెప్పింది. అమ్మ చనిపోవడంతో చాలా బాధగా ఉంది.
- మణికంఠ, శాంతమ్మ కుమారుడు
నాకు దిక్కు ఎవరో
తెల్లవారి అయ్యాక అమ్మే స్కూల్కు రెడీ చేస్తుంది. బాగా చదువుతున్నావా అని రోజూ అడుగుతుంది. ‘బాగా చదవాలి... నీ గురించే మేము కష్టపడుతున్నాం’ అని చెబుతుంటుంది. ఇప్పుడు నాకు ఎవరు దిక్కో.. ఏం చేయాలో అర్థం కావడం లేదు.
- హరిప్రియ, రమణమ్మ కుమార్తె
Updated Date - Dec 28 , 2023 | 12:08 AM