ఇవి తింటారా ?
ABN, First Publish Date - 2023-11-06T23:48:02+05:30
అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నామని చెబుతున్న వైసీపీ సర్కారు ప్రకటలనకే పరిమితమవుతోంది. కాంట్రాక్టర్ల ద్వారా అంగన్వాడీలకు ఎటువంటి గుడ్లు సరఫరా అవుతున్నాయానే విషయాన్ని పట్టించుకోవడం లేదు.
వాటినే లబ్ధిదారులకు అందజేస్తున్న వైనం
కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ
కాంట్రాక్టర్లపై చర్యలు శూన్యం
(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి)
గుడ్డు.. పౌష్టికాహారంలో ఎంతో కీలకం.. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఇది ఎంతగానో మేలు చేస్తోంది. శరీరానికి కావాల్సిన పోషకాలను అందించి.. శక్తిని అందిస్తుంది. వారంలో అన్ని రోజులు తింటే చాలా మంచిదని వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఆరోగ్య రక్షణకు అన్ని విధాలుగా దోహదపడే గుడ్లు సరఫరాపై మాత్రం ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నామని చెబుతున్న వైసీపీ సర్కారు ప్రకటలనకే పరిమితమవుతోంది. కాంట్రాక్టర్ల ద్వారా అంగన్వాడీలకు ఎటువంటి గుడ్లు సరఫరా అవుతున్నాయానే విషయాన్ని పట్టించుకోవడం లేదు. దీనిపై అధికార యంత్రాంగం పర్యవేక్షణ సైతం కొరవడింది. దీంతో జిల్లాలో కొన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు నాణ్యత లేని గుడ్లు అందుతున్నాయి. కుళ్లిన, పాడైన గుడ్లు పంపిణీపై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతుండగా.. మరోవైపు అంగన్వాడీ సిబ్బంది కూడా మాటలు పడాల్సి వస్తోంది. జిల్లాలో నెలకొన్న పరిస్థితిని ఇప్పుడు తెలుసుకుందాం.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 1,425 ప్రధాన, 639 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో గర్భిణులు 5,690 మంది, బాలింతలు 6,390 మంది ఉన్నారు. ఆరు నెలల నుంచి 12 నెలల వయసు ఉన్న చిన్నారులు 7,761 మంది, ఏడాది నుంచి మూడేళ్లు వయసున్న చిన్నారులు 22,839 మంది, మూడు సంవత్సరాల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారులు 21,319 మంది ఉన్నారు. అయితే వారందరికీ అంగన్వాడీ కేంద్రాల ద్వారా నెలకు రెండు విడతల్లో 25 చొప్పున గుడ్లు అందిస్తున్నారు. మొదటి విడతగా 13, ఆ తర్వాత12 గుడ్లు సరఫరా చేస్తున్నారు. కాగా చాలాచోట్ల లబ్ధిదారులకు కుళ్లిన, పాడైన నిల్వ ఉన్న గుడ్లు అందుతున్నాయి. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటువంటివి తింటే ఆరోగ్యం పాడైపోదా? అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సంపూర్ణ పౌష్టకాహారం అని చెప్పి ఇలాంటివి అందిస్తారా? అని మండిపడుతున్నారు. వాటిని తిన్న తర్వాత ఏమైనా జరిగితే.. ఎవరు బాధ్యత వహిస్తారని, చిన్నారులు, గర్భిణులు, బాలింతల పరిస్థితిని ఆలోచించరా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తప్పు ఎవరిది?
వాస్తవంగా జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు కాంట్రాక్టర్ల ద్వారా ప్రతినెలా గుడ్లు సరఫరా అవుతుంటాయి. వాటిని కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు అందిస్తుంటారు. కాగా పార్వతీపురం మన్యం జిల్లాకు విజయనగరం జిల్లాకు చెందిన ఒక ప్రైవేట్ పౌల్ర్టీ ద్వారా గుడ్లు సరఫరా అవుతున్నాయి. అయితే కాంట్రాక్టర్లు పంపిణీ చేస్తున్న గుడ్లులోనే నాణ్యత లోపం ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వారు అందించే గుడ్లులో కుళ్లిన, పాడైన, నిల్వ ఉన్నవి ఉంటే.. అటువంటి వాటిని తీసుకోవద్దని ఉన్నతాధి కారులు అంగన్వాడీ సిబ్బందికి చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. కాంట్రాక్టర్లు గడ్లు సరఫరా చేసిన వెంటనే కేంద్రాల వద్ద సంతకాలు చేసుకుని వెళ్లిపోతున్నారని, తాము పరిశీలించే సమయం కూడా ఇవ్వడం లేదని కొంతమంది అంగన్వాడీ సిబ్బంది చెబుతున్నారు. అయితే ఉన్నతాధికారుల తనిఖీల సమయాల్లో అంగన్వాడీ సిబ్బంది బలైపోతున్నారు. కుళ్లిన , పాడైన గుడ్లు చూసి వారికి నోటీసులు ఇస్తున్నారు. కాంట్రాక్టర్లపై మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లుతుతున్నాయి. ఏదేమైనా జిల్లాలో కొన్ని కేంద్రాల నుంచి లబ్ధిదారులకు కుళ్లిపోయిన గుడ్లు సరఫరా అవుతున్నాయి. పొరపాటున వాటిని చిన్నారులు, బాలింతలు, గర్భిణులు తింటే.. ఏదైనా జరిగితే ఏమిటి పరిస్థితి అన్నది ఎవరికీ పట్టడం లేదు. ఇప్పటికే జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా సరఫరా జరుగుతున్న గుడ్లును కొంతమంది లబ్ధిదారులు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. వాటిని తినాలా? వద్దా! అన్న సందేహంలో ఉన్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం ఈ అంశంపై పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించాల్సి ఉంది. గుడ్లు సరఫరాలో బహిర్గతమవుతున్న లోపాలను సరిచేయాల్సిన అవసరం ఉంది. ప్రతినెలా విచారణ చేపట్టి, గుడ్లు సరఫరా చేస్తున్న తేదీలు ముందుగా తెలుసుకోవాలి. నాణ్యతమైనవి సరఫరా అవుతున్నాయా.. లేదా అన్నది పర్యవేక్షించాలని జిల్లావాసులు కోరుతున్నారు.
నోటీసు ఇచ్చాం..
జిల్లాలోని వివిధ అంగన్వాడీ కేంద్రాలకు పాడైన గుడ్లు వస్తున్న మాట వాస్తవమే. దీనిపై సంబంధిత కాంట్రాక్టర్కు నోటీసు అందించాం. వాస్తవంగా కాంట్రాక్టర్ల ద్వారా కేంద్రాలకు గుడ్లు సరఫరా జరిగినప్పుడే వాటిని అంగన్వాడీ సిబ్బంది పూర్తిగా పరిశీలించాల్సి ఉంది. బాగోలేని గుడ్లు ఉంటే తీసుకోకూడదని నిబంధన పెట్టాం. ఏదేమైనా ఎక్కడ పొరపాటు జరిగినా చర్యలు తీసుకుంటాం.
ఎంఎన్ రాణి, జిల్లా ఐసీడీఎస్ అధికారి, పార్వతీపురం మన్యం
Updated Date - 2023-11-06T23:48:03+05:30 IST