పీవీటీజీల అభ్యున్నతికి పీఎం జన్మన్ దోహదం
ABN, Publish Date - Dec 31 , 2023 | 12:26 AM
ఆదిమ జాతి గిరిజనుల(పీవీటీజీ) అభ్యున్నతికి పీఎం జన్మన్ యోజన(ప్రధానమంత్రి జన జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్) ఎంతగానో దోహదపడుతుందని ఐటీడీఏ పీవో వి.అభిషేక్ అన్నారు.
ఐటీడీఏ పీవో వి.అభిషేక్
గుర్రగరువు గ్రామంలో పీఎం జన్మన్ యోజన నమోదు ప్రారంభం
పాడేరు, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఆదిమ జాతి గిరిజనుల(పీవీటీజీ) అభ్యున్నతికి పీఎం జన్మన్ యోజన(ప్రధానమంత్రి జన జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్) ఎంతగానో దోహదపడుతుందని ఐటీడీఏ పీవో వి.అభిషేక్ అన్నారు. మండలంలో మోదాపల్లి పంచాయతీ పరిధి ఆదిమజాతి గిరిజన గ్రామం గుర్రుగరువులో శనివారం నిర్వహించిన ప్రధానమంత్రి జన్మన్ యోజన అవగాహన, లబ్ధిదారుల నమోదు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పీఎం జన్మన్ యోజనలో ప్రతి ఆదిమ జాతి గిరిజన కుటుంబానికి పక్కా గృహాలు, ఆధార్ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డులు, సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలు, పీఎం ఉజ్వల్ ఉచిత గ్యాస్ కనెక్షన్లు, విద్యుత్ సదుపాయం, జీవనోపాధి మెరుగుపరిచే కార్యక్రమాలు చేపడతామన్నారు. ఇప్పటి నుంచి వచ్చే జనవరి 15 వరకు ఐటీడీఏ పరిధిలో 1,597 ఆదిమజాతి గిరిజన గ్రామాల్లో సమగ్ర సర్వే చేపట్టి లబ్ధిదారుల నమోదు జరుగుతుందన్నారు. ఆయా గ్రామాల్లో సామాజిక, వ్యక్తిగత అవసరాలు, మౌలిక సదుపాయాల కల్పనపై వివరాలు నమోదు చేస్తారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందరికీనాణ్యమైన విద్య, పౌష్టికాహారం అందించేందుకు ప్రతిష్ఠాత్మకంగా పథకాలను అమలు చేస్తున్నాయన్నారు. గ్యాస్ కనెక్షన్లు లేని ఆదిమ జాతి గిరిజనులకు ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజనలో ఉచిత గ్యాస్ కనెక్షన్లు, ఉచిత వైద్యం పొందడానికి ఆయుష్మాన్ భారత్ కార్డులను అందిస్తారన్నారు. అర్హత కలిగిన లబ్ధిదారులందరూ ఆయా పథకాలు పొంచేందుకు రిజిస్ర్టేషన్ చేయించుకోవాలని ఐటీడీఏ పీవో సూచించారు. ఈ సందర్భంగా గుర్రగరువు గ్రామంలోని గిరిజనులకు ఆయుష్మాన్ భారత్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ఏపీవోలు వీఎస్.ప్రభాకరావు, ఎం.వెంకటేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ వి.మురళి, హౌసింగ్ పీడీ బి.బాబు, ఐసీడీఎస్ పీడీ సూర్యలక్ష్మి, ఎల్డీఎం రవితేజ, పీఎంయూ ప్రోగ్రామ్ ఆఫీసర్ రాంగోపాల్, ఏటీడబ్ల్యూవో ఎల్.రజని, తహసీల్దార్ వి.త్రినాథరావునాయుడు, ఎంపీడీవో సాయినవీన్, సీడీపీవో ఝాన్సీ, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 31 , 2023 | 12:26 AM