గోతిలో కూరుకుపోయిన లారీలు
ABN, First Publish Date - 2023-12-11T01:13:52+05:30
మండలంలో తాళ్లపాలెం నుంచి నర్సీపట్నం వెళ్లే రోడ్డులో తాళ్లపాలెం వారపు సంత సమీపంలో ఉన్న పోలవరం కాలువ వద్ద భారీ వాహనాలు కూరుకుపోతున్నాయి. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభిస్తున్నది. ఇక్కడ రోడ్డు పూర్తిగా ఛిద్రమై భారీ గొయ్యి ఏర్పడింది.
తాళ్లపాలెం- నర్సీపట్నం మార్గంలో పలుమార్లు స్తంభించిన ట్రాఫిక్
వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు
కశింకోట, డిసెంబరు 10: మండలంలో తాళ్లపాలెం నుంచి నర్సీపట్నం వెళ్లే రోడ్డులో తాళ్లపాలెం వారపు సంత సమీపంలో ఉన్న పోలవరం కాలువ వద్ద భారీ వాహనాలు కూరుకుపోతున్నాయి. దీంతో గంటల తరబడి ట్రాఫిక్ స్తంభిస్తున్నది. ఇక్కడ రోడ్డు పూర్తిగా ఛిద్రమై భారీ గొయ్యి ఏర్పడింది. ఆర్అండ్బీ అధికారులు ఈ గొయ్యిని మట్టితో తాత్కాలికంగా పూడ్చడంతో ఇటీవల కురిసిన వర్షాలకు చిత్తడి మారింది. అన్రాక్ కంపెనీకి ముడి సరకు తీసుకెళుతున్న భారీ టిప్పర్లు ఇక్కడ కూరుకుపోతున్నాయి. సోమవారం ఉదయం బొగ్గు లోడుతో వెళుతున్న లారీ ఒకటి గొయ్యిలో దిగబడిపోయింది. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 11 గంటల సమయంలో నర్సీపట్నం వెళుతున్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కారును.. లారీకి ఎడమ వైపు నుంచి పోనిస్తుండగా బురదలో కూరుకుపోయింది. స్థానికుల సహాయంతో కారును బయటకు తీసి 11.30 గంటలకు బయలదేరారు. తరువాత క్రేన్ను రప్పించి బొగ్గు లోడుతో వున్న లారీ కూడా బయటకు తీసి ట్రాఫిక్ను పునరుద్ధరించారు. మళ్లీ అరగంట వ్యవధిలోనే ఇంకో బొగ్గు డంపర్ అక్కడే గోతిలో కూరుకుపోయింది. సుమారు గంట తరువాత క్రేన్ సహాయంతో లారీని బయటకు తీశారు. మళ్లీ 2.30 గంటలకు అన్రాక్ కంపెనీకి సుమారు 40 టన్నుల బొగ్గు తీసుకెళుతున్న లారీ గోతిలో ఇరుక్కుపోయింది. క్రేన్ సహాయంతో బయటకు తీయడం సాధ్యం కాకపోవడంతో మరొక క్రేన్ను రప్పించారు. ఎట్టకేలకు సాయంత్రం ఐదు గంటలకు లారీని బయటకు తీశారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలుమార్లు ట్రాఫిక్ స్తంభించింది. అయినప్పటికీ ఆర్అండ్బీ అధికారులు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. గొయ్యిని పూడ్చడం లేదా వాహనాలు అటుగా వెళ్లకుండా రక్షణ చర్యలు చేపట్టడం వంటివి చేయలేదని అంటున్నారు.
Updated Date - 2023-12-11T01:13:53+05:30 IST