గాజువాకలో లోకేశ్ పాదయాత్ర రేపు
ABN, Publish Date - Dec 17 , 2023 | 01:00 AM
అబద్ద వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ చేతిలో దగాపడిన నవ్యాంధ్రను పరిరక్షించుకోవడంలో భాగంగా భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ఆదివారం గాజువాక నియోజకవర్గానికి చేరుకుంటుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.
కూర్మన్నపాలెంలోని పైలాన్ వద్ద ముగియనున్న ‘యువగళం’
టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు
గాజువాక, డిసెంబరు 16: అబద్ద వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ చేతిలో దగాపడిన నవ్యాంధ్రను పరిరక్షించుకోవడంలో భాగంగా భాగంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర ఆదివారం గాజువాక నియోజకవర్గానికి చేరుకుంటుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం గాజువాక పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం రాత్రికి స్టీల్ప్లాంట్ టౌన్షిప్ సెక్టార్-5లోని సీడబ్ల్యూసీ వద్దకు లోకేశ్ పాదయాత్ర చేరుకుంటుందన్నారు. సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు లోకేశ్ పాదయాత్ర తెలుగుతల్లి విగ్రహం, స్టీల్ప్లాంట్ పోలీస్ స్టేషన్ మార్గంలో జగ్గు జంక్షన్ మీదగా పాతగాజువాకకు చేరుకుంటుందన్నారు. అక్కడ నుంచి శ్రీనగర్, వడ్లపూడి మీదగా కూర్మన్నపాలెం చేరుకుని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ దీక్ష శిబిరాన్ని లోకేశ్ సందర్శించి కార్మిక నాయకులతో మాట్లాడతారని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అనంతరం కూర్మన్నపాలెం టోల్గేటు సమీపంలోని పైలాన్ వద్దకు చేరుకోవడంతో లోకేశ్ పాదయాత్ర ముగుస్తుందన్నారు. కాగా ఈ నెల 20న విజయనగరం జిల్లా భోగాపురంలోని సారిపల్లి వద్ద ఎన్నికల శంఖారావం సభ జరుగుతుందని వివరించారు. గాజువాకలో ఎంతో ప్రతిష్టాత్మకంగా లోకేశ్ కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నామని, భారీ ఎత్తున ప్రజలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా అందరూ ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, కార్పొరేటర్లు బొండా జగన్, పల్లా శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాసరావు, నాయకులు పులి వెంకటరమణారెడ్డి, బలగ బాలునాయుడు, పెంటయ్య, అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
లోకేశ్ పాదయాత్రకు తరలిరండి
పెందుర్తి: పెందుర్తి నియోజకవర్గ పరిధి పరవాడ మండలం భరిణికంలో ఆదివారం జరగున్న లోకేశ్ యువగళం పాదయాత్రలో నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా టీడీపీ మండల అధ్యక్షుడు కరక దేవుడు కోరారు. ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైసీపీకి చరమగీతం పాడాలన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 01:00 AM