కిరణ్ కృష్ణ మోసాలు ఇన్నన్ని కాదయా!!
ABN, Publish Date - Dec 17 , 2023 | 01:17 AM
కిరణ్ కృష్ణా రియల్ ఎస్టేట్ అలియాస్ వల్లభ ప్రాజెక్ట్స్పై లెక్కలేనన్ని చీటింగ్ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదై ఉన్నాయి.
ఫోర్త్ టౌన్లోనే మూడు కేసులు
భీమిలి, ఆనందపురం స్టేషన్లతో పాటు శ్రీకాకుళం, కృష్ణా జిల్లాలోను కేసులు
గండిగుండం లేఅవుట్లో సర్వే నంబరు మార్చి డబుల్ రిజిస్ట్రేషన్
విశాఖపట్నం, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి):
కిరణ్ కృష్ణా రియల్ ఎస్టేట్ అలియాస్ వల్లభ ప్రాజెక్ట్స్పై లెక్కలేనన్ని చీటింగ్ కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదై ఉన్నాయి. మూడు దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన ఇళ్ల స్థలాలను ఇప్పటికి కూడా రిజిస్టర్ చేయకుండా, ఆ స్థలం ఎక్కడుందో చూపించకుండా అనేక మందిని మోసం చేశారు. తొలుత కిరణ్ కృష్ణా పేరుతో టీపీటీ కాలనీలో కార్యాలయం నిర్వహించిన ఈ సంస్థ మరింత మందిని మోసం చేయడానికి వల్లభ ప్రాజెక్ట్స్గా పేర్చు మార్చుకొని కార్యాలయాన్ని కేఆర్ఎం కాలనీకి మార్చింది. ఆనందపురం సబ్ రిజిస్ట్రార్ తన ప్లాట్లను రిజిస్టర్ చేయడానికి ఇబ్బంది పెడుతున్నారంటూ ఏసీబీకి ఫిర్యాదు చేసిన సదరు సంస్థ ఎండీ కృష్ణప్రసాద్ తమను మోసం చేశాడంటూ అనేకమంది ‘ఆంధ్రజ్యోతి’కి ఫోన్లు చేస్తున్నారు. హెచ్పీసీఎల్ ఉద్యోగి జయరాజ్ నెలసరి వాయిదాలు కట్టి ఈ సంస్థ వద్ద 300 గజాల స్థలాన్ని 1995లో కొనుగోలు చేశారు. ఆనందపురం మండలం గండిగుండం సర్వే నంబరు 105/29లో 272వ నంబరు ప్లాటును ఆయనకు 1995లో 795 డాక్యుమెంట్ ద్వారా రిజిస్టర్ చేశారు. ఇప్పటివరకు దానిని స్వాధీనం చేయలేదు. ఇటీవల దీనిపై విచారణ చేయగా ఇదే ప్లాటును డాబాగార్డెన్స్కు చెందిన పల్లా శేషు రమణికి 2011లో 364 నంబరు డాక్యుమెంట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసినట్టు గుర్తించారు. ఈ విషయాన్ని ఆనందపురం సబ్ రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేయగా రెండు డాక్యుమెంట్లు పరిశీలించారు. శేషు రమణికి రిజిస్ట్రేషన్ చేసినప్పుడు అధికారులను తప్పుదోవ పట్టిస్తూ సర్వే నంబరు 105/29లో 2 నంబరు తీసేసి 105/9గా రిజిస్టర్ చేశారు. ఈ సర్వే నంబరులో ప్రైవేటు భూమి లేదు. అది ప్రభుత్వ భూమి. రిజిస్టర్ చేయడానికి వీల్లేదు. అప్పట్లో అధికారులను బురిడీ కొట్టించి ఒకసారి అమ్మిన ప్లాటునే ఇంకొకరికి విక్రయించారు. గండిగుండంలో మొత్తం 130 మందిని మోసం చేశారని, ఈ వివరాలతో సోమవారం పత్రికల వారిని కలుస్తామని ఆ బృందం సభ్యులు తెలిపారు. ఇలాంటివి ఆయన చాలా చేశారని ఆనందపురం సబ్ రిజిస్ట్రార్ ఆరోపించారు. తాను అడ్డుకుంటున్నానని లంచాలు అడిగినట్టు ఏసీబీకి ఫిర్యాదు చేశారని వివరించారు. ఈ విషయమై తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్టు జయరాజ్ ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు.
కిరణ్ కృష్ణా ఎండీపై నమోదైన కేసుల్లో కొన్ని
కిరణ్ కృష్ణా ఎండీ వల్లభనేని కృష్ణప్రసాద్పై అనేక పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నాయి. మోసం, ఆక్రమణలు, బెదిరించడం, హత్యాయత్నం, కులం పేరుతో దూషణ వంటి కేసులు నమోదయ్యాయి.
- విశాఖపట్నం నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లోనే 159/2004, 10/2005, 359/2009 కేసులు ఉన్నాయి.
- ద్వారకా పోలీస్ స్టేషన్లో 53/2020, భీమిలి స్టేషన్లో 81/2020, ఆనందపురం స్టేషన్లో 25/2017 (ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు), పీఎం పాలెం స్టేషన్లో 513/2006 నంబర్లతో కేసులు ఉన్నాయి.
- శ్రీకాకుళం టూ టౌన్ స్టేషన్లో 148/2007, విజయవాడ కృష్ణలంక స్టేషన్లో 641/2003 నంబరుతో కేసులు ఉన్నాయి.
Updated Date - Dec 17 , 2023 | 01:17 AM