మన్యంలో కొనసాగుతున్న చలి తీవ్రత
ABN, Publish Date - Dec 26 , 2023 | 12:07 AM
మన్యంలో సోమవారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు దిగజారాయి. దీంతో చలి ప్రభావం పెరిగి ఏజెన్సీ వాసులు వణుకుతున్నారు. జి.మాడుగులలో 7.1, హుకుంపేటలో 9.3, జీకేవీఽధిలో 9.5, పెదబయలులో 10.3, అరకులోయ, ముంచంగిపుట్టులో 10.5, పాడేరు, అనంతగిరిలో 10.7, చింతపల్లిలో 11.5, కొయ్యూరులో 15.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సోమవారం నమోదయ్యాయి.
- జి.మాడుగుల 7.1, అరకులోయలో 10.5, పాడేరులో 10.7 డిగ్రీలు
పాడేరు, డిసెంబరు 25(ఆంధ్రజ్యోతి): మన్యంలో సోమవారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు దిగజారాయి. దీంతో చలి ప్రభావం పెరిగి ఏజెన్సీ వాసులు వణుకుతున్నారు. జి.మాడుగులలో 7.1, హుకుంపేటలో 9.3, జీకేవీఽధిలో 9.5, పెదబయలులో 10.3, అరకులోయ, ముంచంగిపుట్టులో 10.5, పాడేరు, అనంతగిరిలో 10.7, చింతపల్లిలో 11.5, కొయ్యూరులో 15.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు సోమవారం నమోదయ్యాయి. గత 24 గంటలతో పోలిస్తే కనిష్ఠ ఉష్ణోగ్రతలు కాస్త దిగజారాయి. ప్రస్తుతం శీతాకాలం కావడంతో పాటు నైబీరేయా నుంచి ఉత్తరాది మీదుగా చలిగాలులు వీస్తుండడంతో చలి తీవ్ర కొనసాగుతున్నది. ఏజెన్సీలో తెల్లవారుజాము నుంచి ఉదయం పది గంటల వరకు దట్టంగా పొగ మంచు కమ్మేస్తుంది. దీంతో లైట్లు వేసుకుని వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే రాత్రి, పగలు తేడా లేకుండా చలి వేస్తుండగా, రాత్రి వేళల్లో తీవ్రత అధికంగా ఉంటున్నది. దీంతో మన్యంవాసులు చలి మంటలు కాగుతూ, ఉన్ని దుస్తులు ధరించి చలి నుంచి రక్షణ పొందుతున్నారు.
జీకేవీధి, చింతపల్లిలో..
చింతపల్లి: మన్యంలో స్థిరంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి వణికిస్తున్నది. సోమవారం జీకేవీధిలో 9.5, చింతపల్లిలో 11.5డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. జనవరి మొదటి పక్షం వరకు గిరిజన ప్రాంతంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని స్థానిక ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్, వాతావరణ విభాగం నోడల్ అధికారి డాక్టర్ ఎం.సురేశ్కుమార్ తెలిపారు. చలితో పాటు మంచు దట్టంగా కురుస్తున్నది. అర్థరాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం పదిన్నర గంటల వరకు మంచు కురుస్తున్నది. మంచు వల్ల వాహన చోదకులు లైట్లు వేసుకుని నెమ్మదిగా వెళుతున్నారు. కాగా లంబసింగి, చింతపల్లి, చెరువులవేనం మంచు అందాలను వీక్షించేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు.
ఎక్కడ చూసినా చలి మంటలు
పాడేరురూరల్: చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో పాడేరులో ఏ వీధిలో చూసినా చలి మంటలు కనిపిస్తున్నాయి. మన్యంలోని ప్రకృతి అందాలను తిలకించేందుకు వచ్చే పర్యాటకులకు లాడ్జీల్లో రూమ్లు దొరకకపోవడంతో ఆదివారం రాత్రి ప్రధాన రహదారిపై చలి మంటలు వేసుకుని కాలక్షేపం చేశారు.
Updated Date - Dec 26 , 2023 | 12:07 AM