ఈ చలానాలకు విరామం?
ABN, First Publish Date - 2023-12-11T01:14:11+05:30
ఇటీవల వరకూ ప్రతీ జంక్షన్లోనూ ట్రాఫిక్ పోలీసులు సెల్ఫోన్లు పట్టుకుని ఫొటోగ్రాఫర్ల అవతారంలో కనిపించేవారు.
ట్రాఫిక్ ఉల్లంఘనలను పట్టించుకోని పోలీసులు
చూసీ చూడనట్టు వదిలేస్తున్న వైనం
ప్రభుత్వ ఆదేశాలతోనే అంటున్న సిబ్బంది
రహదారుల దుస్థితే కారణమనే వాదన
జరిమానాలతో వ్యతిరేకత వస్తుందనే భయం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
ఇటీవల వరకూ ప్రతీ జంక్షన్లోనూ ట్రాఫిక్ పోలీసులు సెల్ఫోన్లు పట్టుకుని ఫొటోగ్రాఫర్ల అవతారంలో కనిపించేవారు. ట్రిపుల్ రైడింగ్... సెల్ఫోన్ మాట్లాడుతూ, హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్నవారు కనిపించగానే సెల్ఫోన్లో ఫొటోలు తీసి ఈ చలానాలు జారీచేసేవారు. కానీ ఇప్పుడు వారి వైఖరి భిన్నంగా కనిపిస్తోంది. కళ్లముందు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినా చూసీ చూడనట్టు వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పోలీసులు కొన్నేళ్లుగా కఠినచర్యలు తీసుకుంటున్నారు. అందులోభాగంగా వాహనచోదకులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించినా, నిర్లక్ష్యంగా వాహనాలను నడిపినాసెల్ఫోన్లో ఫొటోలు తీసి ఈ చలానాలు జారీచేసి జరిమానా కట్టించేవారు. దీంతో వాహనచోదకులు నిబంధనల మేరకు నడుచుకునేవారు. అయినప్పటికీ కమిషనరేట్ పరిధిలో ప్రతీరోజూ సగటున రూ.ఐదు లక్షల వరకూ ఈ చలానాల రూపంలో జరిమానాలు జమయ్యేవి. ప్రభుత్వానికి ఇది ఆదాయ వనరుగా మారడంతో పోలీసులకు రోజువారి లక్ష్యాలను కూడా నిర్దేశించేది. పోలీసులు విధులను పక్కనపెట్టి మరీ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే వాహనాలకు ఫొటోలు తీయడమే పనిగా వ్యవహరించేవారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తినా వెనక్కి తగ్గలేదు. అయితే కొద్దిరోజులుగా నగరంలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు ఈచాలానాల జారీచేయడం నిలిపివేయడం చర్చనీయాంశంగా మారింది. కొంతమంది పోలీసులు నిబంధనలు పాటించని వాహన చోదకులను నిలుపుదల చేసి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించేస్తున్నారు. జరిమానా విధించడం లేదు. దీనిపై పోలీస్ సిబ్బంది వద్ద ప్రస్తావించగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకే ఉన్నతాధికారులు ఈ చలానాల జారీ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేయాలని మౌఖిక ఆదేశాలు జారీచేసినట్టు చెబుతున్నారు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్నందున, ఆ సమస్యను పరిష్కరించకుండా వాహనచోదకులకు జరిమానాలు విధిస్తే ప్రజల్లో వ్యతిరేకత పెరిగి, వచ్చే ఎన్నికల్లో తీవ్ర ప్రభావం పడుతందనే భయంతోనే ప్రభుత్వం తాజా నిరయం తీసుకుందనే ప్రచారం జరుగుతోంది.
Updated Date - 2023-12-11T01:14:12+05:30 IST