మరో 2 కరోనా కేసులు
ABN, Publish Date - Dec 26 , 2023 | 01:13 AM
జిల్లాలో వరుసగా నాలుగో రోజూ కరోనా కేసులు నమోదయ్యాయి.
20కు చేరిన యాక్టివ్ కేసులు
కేజీహెచ్లో 100 ఆక్సిజన్, 40 వెంటిలేటర్ బెడ్స్తో వార్డులు ఏర్పాటు
విశాఖపట్నం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో వరుసగా నాలుగో రోజూ కరోనా కేసులు నమోదయ్యాయి. సోమవారం వంద మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్టు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జగదీశ్వరరావు తెలిపారు. ఆనందపురం మండలం పడుగుపాలెం ఒకటి, నగర పరిధిలోని రామ్నగర్ ప్రాంతంలో గల ప్రగతినగర్లో మరొకటి వెలుగుచూశాయి. జ్వరంతో పాటు ఇతర లక్షణాలు ఉండడంతో పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. వీరిద్దరూ హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. వీరి నుంచి నమూనాలు సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించినట్టు డాక్టర్ జగదీశ్వరరావు తెలి పారు. వీటితో జిల్లాలో యాక్టివ్ కేసుల సంఖ్య 20కు చేరింది. వీరిలో ఇద్దరు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందు తుండగా, మిగిలిన వారంతా హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు.
జిల్లాలో కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆస్పత్రిల్లో చేరాల్సి వచ్చిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అనుగుణంగా కేజీహెచ్లోని ఐసోలేషన్ వార్డు, ఓల్డ్ ఐఆర్సీయూ వార్డులో పడకలు ఏర్పాటుచేశారు. ఐఆర్సీయూ వార్డులో 40 వెంటిలేటర్ బెడ్స్, ఐసోలేషన్ వార్డులో వంద ఆక్సిజన్ బెడ్స్ను సిద్ధంచేశారు. ర్యాపిడ్ యాంటీ జెన్ పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారికి అక్కడే ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహిస్తున్నారు. నగర పరిధిలోని 62 అర్బన్ హెల్త్ సెంటర్స్తోపాటు గ్రామీణ జిల్లా పరిధిలోని తొమ్మిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ పరీక్షలు చేస్తున్నట్టు డీఎంహెచ్వో డాక్టర్ జగదీశ్వరరావు తెలిపారు. కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్న వారికి పరీక్షలు నిర్వహిస్తారని, అనుమానం ఉంటే ఆయా కేంద్రాలకు వెళ్లాలని ఆయన సూచించారు.
Updated Date - Dec 26 , 2023 | 01:13 AM