ఆ ఇద్దరి కోసం గాలింపు
ABN, First Publish Date - 2023-12-05T23:57:26+05:30
గార ఎస్బీఐలో బంగారు ఆభరణాల మాయమైన ఘటనలో విచారణ కొనసాగుతోంది. తాకట్టు పెట్టిన బంగారం ఇస్తారో లేదోనని ఖాతాదారుల్లో ఆందోళన పెరిగిపోతోంది. అధికారులు మాత్రం సోమ, మంగళవారాల్లో కొద్దిమందికి నగలు అందజేశారు.
- పరారీలో ఏ-2, క్యాషియర్
- ఓ బ్రాంచ్ అధికారిని విచారించిన పోలీసులు
- గతంలో అక్కడి నుంచే బ్యాగుల రికవరీ
శ్రీకాకుళం క్రైం, డిసెంబరు 5: గార ఎస్బీఐలో బంగారు ఆభరణాల మాయమైన ఘటనలో విచారణ కొనసాగుతోంది. తాకట్టు పెట్టిన బంగారం ఇస్తారో లేదోనని ఖాతాదారుల్లో ఆందోళన పెరిగిపోతోంది. అధికారులు మాత్రం సోమ, మంగళవారాల్లో కొద్దిమందికి నగలు అందజేశారు. బ్యాంకు నుంచి మాయమైన 86 బ్యాగులకు గాను 26 బ్యాగులను పోలీసులు రికవరీ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఏ-1 ముద్దాయిగా ఉన్న డిప్యూటీ మేనేజర్ స్వప్నప్రియ ఆత్మహత్య చేసుకోవడంతో మిగిలిన బంగారాన్ని రికవరీ చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. శ్రీకాకుళం ఇన్చార్జి డీఎస్పీ విజయకుమార్ ఆధ్వర్యంలో గార పోలీసులు, సీసీఎస్ పోలీసులు విచారణ చేపట్టారు. సోమవారం స్వప్నప్రియ సోదరుడు కిరణ్బాబు ఇచ్చిన సమాచారం మేరకు దర్యాప్తు కొనసాగింది. మంగళవారం ఆమదాలవలసలోని ఎస్బీఐలో పనిచేస్తున్న ఓ అధికారిని విచారించారు. గతంలో స్వప్నప్రియ నుంచి రికవరీ చేసిన 26 బ్యాగుల్లో సగం ఆమదాలవలస బ్రాంచ్ నుంచే కావడం గమనార్హం. మిగిలిన బంగారం బ్యాగుల సంగతి ఆ అధికారికి తెలిసే ఉంటుందన్న అనుమానంతో పోలీసులు విచారించారు.
పరారీలో ఉన్న ఇద్దరే కీలకం
బంగారం మాయమైన కేసులో ఏ-2గా ఉన్న పొన్నాడ తిరుమలరావుతో పాటు ఎఫ్ఐఆర్లో ఉన్న మరో వ్యక్తి గార ఎస్బీఐ బ్రాంచ్ క్యాషియర్ సురేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. తొలుత తమకు సంబంధం లేదని, తనపై కావాలనే గ్రామస్థులు దాడి చేశారని చెప్పిన క్యాషియర్ సురేష్.. కేసు నమోదై విచారణ మొదలయ్యాక పరారయ్యారు. అలాగే బ్యాంకులో బంగారాన్ని వేరేచోట తాకట్టు పెట్టడంలో కీలకపాత్ర వహించింది తిరుమలరావు అని విచారణలో తేలడంతో అతను కూడా పరారీలో ఉన్నారు. వీరిద్దరూ దొరికితే కేసు ఓ కొలిక్కి వచ్చినట్లే. దీంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. అసలు ఈ కేసు విచారణ ప్రారంభంలో క్యాషియర్ సురేష్ నిజాయితీకి మారుపేరని, అతనిపై అనుమానం అక్కర్లేదని బ్యాంక్ అధికారులు వెనకేసుకుని వచ్చినట్లు తెలిసింది. అయితే డీఎస్పీ కేసును క్షుణ్ణంగా విచారిస్తే క్యాషియర్ పాత్ర ఉన్నట్లు గుర్తించారు. దీంతో సురేష్ను ఎఫ్ఐఆర్లో చేర్చారు.
మాకు న్యాయం చేయండి: సీఐకి బాధితుల విజ్ఞప్తి
గార : గార స్టేట్బ్యాంక్లో బంగారు ఆభరణాలు కుదువ పెట్టి జాబితాల్లో పేర్లు లేకపోవడంతో ఆందోళన చెందుతున్న పలువురు ఖాతాదారులు మంగళవారం పోలీసులను ఆశ్రయించారు. సీఐ ఎస్.కామేశ్వరరావును కలిసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయం, ఇంటి అవసరాల కోసం బంగారం ఆభరణాలు కుదువ పెట్టామని, ఇలా మోసపోతామని అనుకోలేదని వారంతా వాపోయారు. దీనిపై సీఐ స్పందిస్తూ.. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉందని, ఖాతాదారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Updated Date - 2023-12-05T23:57:28+05:30 IST