RozGar Mela: విజయవాడలో రోజ్ గార్ మేళా.. ముఖ్య అతిథిగా కౌశల్ కిషోర్
ABN, First Publish Date - 2023-05-16T10:20:39+05:30
నగరంలోని రైల్వే ఆడిటోరియంలో ఐదవ రోజు రోజ్ గార్ మేళా కొనసాగుతోంది.
విజయవాడ: నగరంలోని రైల్వే ఆడిటోరియంలో ఐదవ రోజు రోజ్ గార్ మేళా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ (Union Minister of State for Housing and Urban Development Kaushal Kishore) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ డివిజన్ పరిధిలో వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో 300 మందికి ఉద్యోగాలు లభించగా.. వారందరికీ కేంద్ర మంత్రి నియామక పత్రాలు అందజేశారు. రోజ్ గార్ కింద దేశ వ్యాప్తంగా పది లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి కల్పిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక సమావేశాలతో కేంద్ర మంత్రులు నియామక పత్రాలు అందజేస్తున్నారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కౌశల్ కిషోర్ మాట్లాడుతూ... రాజకీయ, వాణిజ్య రాజధాని విజయవాడకు తొలిసారిగా రావడం ఆనందంగా ఉందన్నారు. రోజ్ గార్ మేళాలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ప్రభుత్వ విభాగాలలో కొత్తగా నియమితులైన సుమారు 71,000 మంది యువతకు ఆన్లైన్ ద్వారా నియామక పత్రాలు ఇచ్చారని తెలిపారు. ఈ రోజ్ గార్ మేళా దేశవ్యాప్తంగా 45 ప్రాంతాలలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సంకల్పానికి మద్దతిస్తూ కేంద్ర ప్రభుత్వ విభాగాలు , ప్రభుత్వ రంగ సంస్థలలో నియామకాలు చేశారన్నారు. దేశ వ్యాప్తంగా పది లక్షలమందికి కొత్తగా అవకాశం కల్పించడం గొప్ప విషయమని చెప్పుకొచ్చారు. భవిష్యత్తులో ఉద్యోగ కల్పనకు ఈ ఉద్యోగ మేళా ఆదర్శంగా నిలుస్తుందన్నారు. దేశాభివృద్ధిలో యువత భాగస్వాములవడానికి ఇదొక మంచి అవకాశమని తెలిపారు. విభిన్న ప్రభుత్వ విభాగాలలో కొత్తగా నియమితులైన వారు ఆన్లైన్ ఓరియెంటేషన్ కోర్సు కర్మయోగి ప్రారంభ్ ద్వారా శిక్షణ తీసుకుని వస్తారని కేంద్రమంత్రి కౌశల్ కిషోల్ పేర్కొన్నారు.
Updated Date - 2023-05-16T10:26:54+05:30 IST