చెవిలో పువ్వులతో నిరసన
ABN, Publish Date - Dec 17 , 2023 | 10:58 PM
సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు తలపెట్టిన సమ్మె ఆదివారానికి ఆరో రోజుకు చేరింది. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ కార్యకర్తలు, ఆయాలు ఆదివారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చెవిలో పువ్వులు పెట్టుకొని ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి ర్యాలీ నిర్వహించారు.
ఆరో రోజుకు చేరిన అంగన్వాడీల సమ్మె
ఒంగోలు నగరం, డిసెంబరు 17 : సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు తలపెట్టిన సమ్మె ఆదివారానికి ఆరో రోజుకు చేరింది. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ కార్యకర్తలు, ఆయాలు ఆదివారం వినూత్న రీతిలో నిరసన తెలిపారు. చెవిలో పువ్వులు పెట్టుకొని ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం అద్దంకి బస్టాండ్ వద్దకు చేరుకొని నిరసనను కొనసాగించారు. ఈసందర్భంగా యూనియన్ నాయకురాలు కె.వి.సుబ్బమ్మ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంలో పూర్తిగా విఫలమైందన్నారు. ఇచ్చిన హామీలను కూడా అమలుచేయలేని స్థితిలో ఉన్నదన్నారు. వాటిని నెరవేర్చేవరకు ఆందోళనను విరమించే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం మొండివైఖరిని విడనాడకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. సీఐటీయూ నాయకుడు తంగిరాల మహేష్ మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్నారు. కేంద్రాల తాళాలను పగులగొట్టి లోపలికి ప్రవేశించడం వంటి చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేపడుతూ ఆందోళనను అణచివేయాలని ప్రయత్నిస్తే తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. యూనియన్ నాయకురాలు ప్రశాంతి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు సిహెచ్.జ్యోతి, హెమిమో, కె.సంఽధ్యారాణి, పద్మ, శేషమ్మ, నిర్మల, శ్రీదేవి, కృష్టకుమార్తి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 10:58 PM