వినూత్నంగా అంగన్వాడీల నిరసన
ABN, Publish Date - Dec 26 , 2023 | 01:01 AM
డిమాండ్ల పరిష్కారం కోసం 14 రోజులుగా అంగన్వాడీల సమ్మెకొనసాగుతోంది. సోమవారం కార్యకర్తలు చెవిలో పువ్వు పెట్టుకొని వినూత్నంగా నిరసన తెలిపారు.
గిద్దలూరు, డిసెంబరు 25 : డిమాండ్ల పరిష్కారం కోసం 14 రోజులుగా అంగన్వాడీల సమ్మెకొనసాగుతోంది. సోమవారం కార్యకర్తలు చెవిలో పువ్వు పెట్టుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. అంగన్వాడీల సమ్మెకు జనవిజ్ఞాన వేదిక మద్దతు ప్రకటించింది. జేవీవీ జిల్లా అధ్యక్షులు ఎం.శ్రీనివాసులు పి.స్వరూపారెడ్డి, మండలశాఖ కార్యదర్శి విశ్వరూపం, గౌరవాధ్యక్షులు వెంకటేశ్వర్లు శిబిరం వద్దకు వచ్చి అంగన్వాడిలకు మద్దతు ప్రకటించారు. చిన్నారులకు ఆటపాటలు నేర్పుతున్న అంగన్వాడీలను రోడ్డుపాలు చేయడం సరికాదని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్ యూని యన్ ప్రతినిధులు స్వర్ణకుమారి, వరలక్ష్మి, కొండమ్మ, రమణమ్మ, ఆవులయ్య పాల్గొన్నారు.
ఎర్రగొండపాలెం : జీతాలు పెంచాలని అంగన్వాడీ కేంద్రాలకు రావాల్సిన బిల్లులు సకాలంలో చెల్లించాలని ఎర్రగొండపాలెంలో ఒంటికాలిపై నిల్చొని కార్యకర్తలు నిరసన తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలకు రావాల్సిన కూరగాయలు బిల్లులు, ఇంటి అద్దెలు, గ్యాస్ సిలిండరు, విద్యుత్తు చార్జీల బిల్లులు సంవత్సరాల తరబడి చెల్లించకుంటే తాము ఎక్కడ నుంచి తెచ్చి బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బలవంతంగా అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగగొట్టించిన ప్రభుత్వం పిల్లలను కేంద్రాలకు తీసుకురాలేక పోయిందన్నారు. ఈ ధర్నాలో అంగన్వాడీ యూనియన్ నాయకులు జి.మల్లేశ్వరి, పి.సుబాషిణి, నాగరాజకుమారి, రామసుబ్బమ్మ, అరుణ, సునీత, తలపాటి సుబ్బమ్మ, సుజాత, పాల్గొని మాట్లాడారు. ఎర్రగొండపాలెం, త్రిపురాంతకం, పుల్లలచెరువు మండలాలనుంచి వచ్చినకార్యకర్తలు, ఆయాలు ధర్నాలో పాల్గొన్నారు.
మార్కాపురం వన్టౌన్ : అంగన్వాడీల సమస్యలు ఎటువంటి షరతులు లేకుండా పరిష్కరించాలని రైతు సంఘం జిల్లా నాయకులు గుమ్మా బాలనాగయ్య అన్నారు. సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 14వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసి కోలాటాలు ప్రదర్శించారు. కార్యక్రమంలో వెంకటరత్నం, ధనలక్ష్మీ, కాశింబీ, పద్మావతి, రజని, గోవిందమ్మ, కోటమ్మ, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న ఆందోళన
పెద్ద దోర్నాల : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని పద్నాలుగు రోజులుగా అంగన్వాడీలు చేపట్టిన ఆందోళన సోమవారం కూడా నిర్వహించారు. ప్రభుత్వం స్పందించాలని తమకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో వెంకటలక్ష్మీ, సుబ్బమ్మ, ముంతాజ్బేగం, భారతి తదితరులు పాల్గొన్నారు.
మాట ఇచ్చి తప్పావు
కంభం :‘జగనన్న మాట ఇచ్చావు. ఇచ్చిన మాట తప్పావు, నీకు మనసు లేదా..?’ అంటూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు మోకాళ్లపై నిలుచొని రిలే నిరాహార దీక్షలో ఆవేదన వ్యక్తం చేశారు. అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాల సమ్మె 14వ రోజు కందులాపురం కూడలిలో నిర్వహించారు. అంగన్వాడిల న్యాయమైన సమస్యలు తీర్చలేరా, ప్రభుత్వం నిద్రావస్థలో ఉన్నట్లుగా ఉందని ఏఐటీయూసీ అధ్యక్షులు మహమ్మద్ ఇబ్రహీం అన్నారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు షేక్ అన్వర్భాషా, ఎఐటియుసి అధ్యక్షురాలు సరళ, ఉపాధ్యక్షులు రాజేశ్వరి, శ్రీదేవి, ఆదిలక్ష్మి, శారద, సుబ్బమ్మ, మాధవి, తిరుపతమ్మ, అంగన్వాడి కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.
Updated Date - Dec 26 , 2023 | 01:01 AM