గుండ్లకమ్మ ఖాళీ!
ABN, First Publish Date - 2023-12-10T23:09:09+05:30
మిచౌంగ్ తుఫాన్తో కురిసిన వర్షాలతో మూడు రోజుల క్రితం నిండుకుండలా ఉన్న గుండ్లకమ్మ జలాశయం ప్రస్తుతం ఖాళీ అయ్యింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొట్టుకుపోయిన రెండో గేటు వద్ద స్టాప్ లాక్లను ఆదివారం మధ్యాహ్నానికి అమర్చినా లీకేజీతో కొంత నీరు పోతోంది. ఇప్పటికే ప్రాజెక్టులో ఉన్న నీటిలో ఇంచుమించు రెండు టీఎంసీలు సముద్రం పాలైంది. ప్రస్తుతం కేవలం 0.80 టీఎంసీలు మాత్రమే ఉంది. డెడ్ స్టోరేజీ పోను నికరంగా అర టీఎంసీ మాత్రమే రిజర్వాయర్లో అందుబాటులో ఉండనుంది. దీంతో ఆయకట్టుకు నీరందే అవకాశం లేకుండాపోయింది. సుమారు 60వేల ఎకరాలలో గుండ్లకమ్మ ఆయకట్టులో పంటలు ఉన్నాయి. వాటికి మరో నెల తర్వాత కనీసం రెండు తడుల నీరు అవసరం. అయితే ప్రస్తుతం రిజర్వాయర్లో ఉన్న నీటి మట్టం చూస్తే చుక్కనీరు కూడా కాలువలకు ఎక్కే అవకాశం లేదు. దీంతో పంటల పరిస్థితిపై ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
2టీఎంసీల నీరు సముద్రం పాలు
ప్రాజెక్ట్లో ఉన్నది 0.80 టీఎంసీలే
డెడ్ స్టోరేజీ పోను అందుబాటులో అర టీఎంసీ మాత్రమే
ఆయకట్టుకు చుక్కనీరు ఇవ్వలేని పరిస్థితి
60వేల ఎకరాల్లో పంటలపై ప్రభావం
ఆందోళనలో ఆయకట్టు రైతులు
స్టాప్లాక్ గేట్లు పెట్టినా లీకవుతున్న నీరు
మిచౌంగ్ తుఫాన్తో కురిసిన వర్షాలతో మూడు రోజుల క్రితం నిండుకుండలా ఉన్న గుండ్లకమ్మ జలాశయం ప్రస్తుతం ఖాళీ అయ్యింది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా కొట్టుకుపోయిన రెండో గేటు వద్ద స్టాప్ లాక్లను ఆదివారం మధ్యాహ్నానికి అమర్చినా లీకేజీతో కొంత నీరు పోతోంది. ఇప్పటికే ప్రాజెక్టులో ఉన్న నీటిలో ఇంచుమించు రెండు టీఎంసీలు సముద్రం పాలైంది. ప్రస్తుతం కేవలం 0.80 టీఎంసీలు మాత్రమే ఉంది. డెడ్ స్టోరేజీ పోను నికరంగా అర టీఎంసీ మాత్రమే రిజర్వాయర్లో అందుబాటులో ఉండనుంది. దీంతో ఆయకట్టుకు నీరందే అవకాశం లేకుండాపోయింది. సుమారు 60వేల ఎకరాలలో గుండ్లకమ్మ ఆయకట్టులో పంటలు ఉన్నాయి. వాటికి మరో నెల తర్వాత కనీసం రెండు తడుల నీరు అవసరం. అయితే ప్రస్తుతం రిజర్వాయర్లో ఉన్న నీటి మట్టం చూస్తే చుక్కనీరు కూడా కాలువలకు ఎక్కే అవకాశం లేదు. దీంతో పంటల పరిస్థితిపై ఆయకట్టు రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
ఒంగోలు, డిసెంబరు 10 (ఆంఽధ్రజ్యోతి) : మద్దిపాడు మండలం మల్లవరం వద్ద గుండ్లకమ్మ ప్రాజెక్టును దాదాపు 15 ఏళ్ల క్రితం ప్రారంభించారు. దీని కింద 80వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అందులో 40వేల ఎకరాలకు నేరుగా కాలువల ద్వారా, మరో 20వేల ఎకరాలకు ఎత్తిపోతలు, ఇతర రూపాలలో నీరు అందుతోంది. ప్రత్యేకించి వర్షాలు వెనుకపట్టుపట్టే డిసెంబరు రెండో వారం నుంచి మార్చి రెండో పక్షం లోపు రెండు, మూడు తడులు నీరు అందితేనే పంటలు చేతికి వస్తాయి. ప్రధానంగా పొగాకు, శనగ, మిర్చి అధికంగా సాగవుతున్నందున అలా నీరు ఇవ్వగలిగితేనే రైతులకు ఉపయుక్తంగా ఉండేది. అయితే ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టు నిర్వహణను పట్టించుకోకపోవడం రైతులకు శాపంగా మారింది. ప్రాజెక్టు గేట్లు సరిలేక గత ఏడాది మూడో గేటు కొట్టుకుపోయింది. ఇప్పటి వరకూ మరమ్మతులు చేయకపోగా, దానికి స్టాప్లాక్ గేటు ఏర్పాటు కోసం ఆ సమయంలో రిజర్వాయర్లోని నీరంతా దిగువకు వదిలేశారు. అప్పటికే 6,7 గేట్లు దెబ్బతిని ఉండటంతో స్టాప్లాక్ గేటు ఎలిమెంట్లు కొన్ని పెట్టి అనంతరం వాటికి మరమ్మతులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో కాదు కదా సగం కూడా నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఫలితంగా ఆయకట్టుకు గత ఏడాది నీరు ఇవ్వలేదు.
వృథాగాపోయిన 2 టీఎంసీల నీరు
తుఫాన్ ముందు వరకు రిజర్వాయర్లో 1.30 టీఎంసీల నీరు ఉండగా మిచౌంగ్ ప్రభావంతో కురిసిన వర్షాలకు భారీగా నీరు వచ్చింది. అధికారులు కొంత దిగువకు వదులుతూ మరికొంత నిల్వ చేస్తూ వచ్చారు. ఇలా శుక్రవారం గేటు కొట్టుకుపోయే సమయానికి సుమారు 2.75 టీఎంసీల నీరు ప్రాజెక్టులో ఉంది. ఆ సమయంలో గేటు కొట్టుపోయి భారీగా నీరు దిగువకు వెళ్లిపోయింది. దాన్ని కట్టడి చేసేందుకు స్టాప్లాక్గేట్ల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా మరింత నీటిని మరో 3 గేట్లు ఎత్తి అధికారులు వదిలేశారు. చివరకు ఆదివారం మధ్యాహ్నానికి స్ట్టాప్లాక్ గేటును అధికారులు పెట్టగలిగారు. అయినప్పటికీ అడుగు భాగంలో కొంత నీరు లీకేజీ రూపంలో పోతూనే ఉంది. స్టాప్లాక్ గేటు ఏర్పాటు ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చే సమయానికి రిజర్వాయర్ ఖాళీ అయింది. గేటు కొట్టుకుపోయే సమయానికి రిజర్వాయర్లో సుమారు 2.75 టీఎంసీల నీరు ఉండగా.. ప్రస్తుతం 0.80 టీఎంసీల లోపు మాత్రమే ఉంది. అంటే ఇంచుమించు రెండు టీఎంసీల నీరు సముద్రంపాలైంది.
రైతుల ఆనందం ఆవిరి
ఈ ఏడాది కూడా గత నెల వరకూ ప్రాజెక్టులో నీరు పెద్దగా లేదు. నిజానికి 6,7 గేట్ల పనులు సెప్టెంబరులో పూర్తి కావడంతో ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 3.86టీఎంసీలలో 3టీఎంసీల వరకు నిల్వ చేసే అవకాశం ఏర్పడింది. అయితే వర్షాలు లేక ఆ స్థాయి నీరు ప్రాజెక్టులోకి రాలేదు. మరోవైపు ఆయకట్టులో రైతులు అక్టోబరు వరకూ పెద్దగా పంటలు సాగు చేయలేదు. నవంబరు తొలివారంలో కురిసిన వర్షాలతో సాగు ఊపందుకుంది. అనంతరం మిచౌంగ్ తుఫాన్తో భారీ వర్షాలు కురవడంతో సాగు మరింత ముమ్మరమయ్యే పరిస్థితి ఏర్పడింది. తుఫాన్ వర్షాలతో గుండ్లకమ్మలోకి కూడా నీరు రావడంతో ఇక వర్షాలు లేకపోయినా ఉన్నదానితో సంక్రాంతి తర్వాత రెండు తడులు ఇచ్చినా పంటలకు డోకా లేదని రైతులు ఆనందపడ్డారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి గుండ్లకమ్మ రెండో గేటు కొట్టుకుపోయింది. దానికి స్టాప్ లాక్ గేట్లు పెట్టేందుకు వీలు కాక అధికారులు రిజర్వాయర్లో నీటిని బయటకు వదిలేయడంతో రైతుల ఆశలు అడియాశలయ్యాయి.
60వేల ఎకరాల్లో పంటల పరిస్థితి ప్రశ్నార్థకం
ఇప్పటికే జిల్లాలో సాధారణ వర్షాకాలం పూర్తయింది. అనుకోకుండా తుఫాన్లు వస్తేనో, ఊహించని రీతిలో వాతావరణం మారితేనో తప్ప సీజనల్గా వర్షాలు కురిసే కాలం ముగిసింది. దీని వల్ల గుండ్లకమ్మ ఆయకట్టులో ఇంచుమించు 60వేల ఎకరాల ఆయకట్టులో సాగువుతున్న పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. సీజనల్గా ఆ ప్రాంతంలో వేసే మిర్చి, పొగాకు, శనగ పంటలకు సంక్రాంతి తర్వాత తడులు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఏడాది ఇంకా ఆలస్యంగా పంటలు సాగు చేయడంతో మార్చి వరకు నీటి అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో గుండ్లకమ్మ రిజర్వాయర్ ఖాళీ అవడంతో రైతులు తీవ్రఆందోళన చెందుతున్నారు. సాధారణంగా రిజర్వాయర్కు ఎగువన కురిసే వర్షాలు లేదా ఎన్ఎస్పీ నీరు ప్రధాన వనరు. అయితే ఈ ఏడాది సాగర్ నీరు వచ్చే పరిస్థితి లేదు. వర్షాకాలం ముగిసింది. దీంతో ఆయకట్టు రైతులు పంటలు పరిస్థితిపై కలవరపడుతున్నారు.
ఉన్న నీరు కాలువలకు ఎక్కే అవకాశం లేదు
ప్రస్తుతం రిజర్వాయర్లో ఉన్న నీటిని చూస్తే ఆయకట్టుకు ఇచ్చే పరిస్థితి ఏమాత్రం లేదు. రిజర్వాయర్ డెడ్స్టోరేజీ 0.30టీఎంసీలు కాగా ప్రస్తుతం ఉన్న 0.80 టీఎంసీలలో అర టీఎంసీ మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే నీరు కూడా కాలువలకు ఎక్కే అవకాశం లేదు. డ్యాం నీటి మట్టం 24.38మీటర్లు కాగా కాలువలకు నీరు ఎక్కాలంటే అది కనీసం 20 మీటర్లు ఉండాలి. ప్రస్తుతం ఆలోపుగానే ఉన్నట్లు చెప్తున్నారు. అంటే ప్రస్తుతం ఉన్న నీరు కాలువలకు ఎక్కే అవకాశం లేదు. కేవలం తాగునీటి కోసం పంపింగ్ చేయడం మాత్రమే సాధ్యమవుతుంది తప్ప సాగు నీటికి ఇచ్చే అవకాశం లేదు.
Updated Date - 2023-12-10T23:09:33+05:30 IST